Begin typing your search above and press return to search.

హైదరాబాద్ వాసికి పాకిస్తాన్లో ఊహించని ఆతిథ్యం..!

By:  Tupaki Desk   |   25 Nov 2022 2:30 AM GMT
హైదరాబాద్ వాసికి పాకిస్తాన్లో ఊహించని ఆతిథ్యం..!
X
పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆయుధగారంగా మారడంతో ఆ దేశంపై ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత నెలకొంది. ఇక పొరుగున మన దేశంతో నిత్యం సరిహద్దు గొడవలు.. కశ్మీర్ లో అల్లర్లు.. ముంబై.. పంజాబ్.. హైదరాబాద్ వంటి నగరాల్లో బాంబు దాడులకు పాకిస్తానీ ఉగ్రదాడులకు పాల్పడటం వంటి చర్యలతో ఆ దేశంపై ఉగ్రవాద దేశంగా ముద్ర పడిపోయింది. ఈ నేపథ్యంలోనే అన్ని దేశాల మాదిరిగానే భారతీయుల్లోనూ పాకిస్థాన్ అంటే ఒకింత ఆందోళన నెలకొని ఉంది.

అయితే అక్కడ కూడా మనలాంటి చాలా మంది సామాన్య ప్రజలే జీవిస్తున్నారు. ఉగ్రవాదం మూలంగా ఆ దేశానికి చెడ్డపేరు వచ్చింది కానీ నిజానికి అక్కడి వాళ్లు ఇతరులకు సాయం చేయడంలో ఎల్లప్పుడు ముందుంటారు. మనదేశంలోని ముస్లింలు ఎలాగైతే తమకు ఉన్నదాంట్లోనే ఇతరులకు సాయం అందిస్తారో.. వాళ్లు కూడా అంతేనని తాజాగా జరిగిన ఒక సంఘటన మరోసారి రుజువు చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మణికొండ పరిధిలోని పుష్పాల గూడలోని శ్యాంసన్ అనే ఆటో డ్రైవర్ నివసిస్తున్నాడు. అతడి కుమార్తె సరాయ్ టెన్నిస్ క్రీడాకారిణి. ఈ నేపథ్యంలో ఐటీఎఫ్ జే 5 టోర్నమెంట్ కోసం సారాయ్ పాకిస్తాన్ వెళ్లాల్సి వచ్చింది. ఈనెల ప్రథమార్థంలో సారాయ్ మొయినాబాద్లోని అజీజ్ నగర్ కు చెందిన సత్తయ్య.. అతని కూతురు ప్రిన్సీతో కలిసి పాకిస్థాన్ కు వెళ్లింది.

అయితే అక్కడికి వెళ్లడానికి ముందు వీరిలోనే అనేక సందేహాలు.. భయాలు ఉన్నాయి. తీరా అక్కడికి వెళ్లాక పాకిస్థానీయులు వారిపై చూపిన ఆదరాభిమానాలకు ఫిదా అయిపోయారు. వారి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. పాకిస్థాన్ లోని ఇస్లాబాద్ కు చేరుకున్నాక ఒక హోటల్లో బస చేశాం. అక్కడి నుంచి జిన్నా స్టేడియానికి 20 కి.మీ. దూరంలో ఉంది. దీంతో ప్రతీరోజు వెళ్లాల్సి వచ్చేది. అయితే ఈనెల 10న గేమ్ పూర్తయ్యాక హోటల్ కు తిరిగి వస్తుండగా క్యాబ్ కోసం ప్రయత్నించినా దొరకలేదు.

దీంతో నిర్మానుష్యంగా ఉండే షకర్ పరియర్ నుంచి నడుకుంటూ వెళుతున్నాం. ఈ సమయంలో తాహెర్ ఖాన్ అనే వ్యక్తి వాహనంలో వస్తుండటం లిప్ట్ అడిగాం. ఆయన వెంటనే ఆపి మా నలుగురిని ఎక్కించుకున్నారు. మేం భారతీయులమని చెప్పగానే.. 'వారె వాహ్' అన్నారు. మమల్ని హోటల్ వద్ద దింపడానికి ముందు అతిథ్యం స్వీకరించాలని కోరారు. అతడికి కరాచీ.. ఇస్లామాబాద్.. లాహోర్లో తదితర ప్రాంతాల్లో పలు రెస్టారెంట్లు ఉన్నాయి. అంతేకాకుండా అతడు యూట్యూబర్ కూడా.

ఈక్రమంలోనే తాహెర్ ఇస్లామాబాద్ లోని తన రెస్టారెంట్ కు తీసుకెళ్లి పలు వంటకాలతో ఆతిథ్యం ఇచ్చారు. పాకిస్తానీ వంటకాలతో పాటు హైదరాబాద్ బిర్యానీని కూడా వడ్డించారు. భోజనం చేస్తున్న సమయంలో తమ పరిస్థితి గురించి ఆరా తీశారు. మీరు ఏ దేశం క్రీడాకారులతో తలపడుతున్నారని ప్రశ్నించారు. పాకిస్తానీతోనే తల పడుతున్నట్లు చెప్పడంతో ఎవరు గెలుస్తారని? ప్రశ్నించారు. చివరకు గెలుపు మాదే అయింది.

పేదరికంతో ఉండి పిల్లల భవిష్యత్ కోసం ఇంత దూరం కష్టపడాల్సి రావడంపై అభినందించారు. ఇక ఇస్లామాబాద్ లో ఆటోలు సరిగా లేకపోవడంతో 15 రోజులు క్యాబ్ లనే ఆశ్రయించాల్సి వచ్చింది. మాటల సందర్భంలో తాము భారతీయులమని చెప్పగా సగానికి పైగా మంది డబ్బులు తీసుకోలేదని సారాయ్ తెలిపింది. ఈ సంఘటనతో పాకిస్తానీయులు భారతీయులతో స్నేహానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.