Begin typing your search above and press return to search.

వైసీపీకి మరో లేడీ ఫైర్ బ్రాండ్ నేత దొరికేసినట్టే

By:  Tupaki Desk   |   27 May 2019 3:56 PM GMT
వైసీపీకి మరో లేడీ ఫైర్ బ్రాండ్ నేత దొరికేసినట్టే
X
ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లోనూ వైసీపీ కొత్త ముఖాల,ను బగానే తీసుకొచ్చేసిందని చెప్పాలి. ఎంపీ సీట్లలో మెజారిటీ సీట్లను కొత్తగా రాజకీయ రంగంలోకి దిగిన వారికే కేటాయించింది. అదే సమయంలో అసెంబ్లీ సీట్ల కేటాయింపు విషయంలోనూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరించిన నయా వ్యూహంతో చాలా మంది కొత్తగా, తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఇాలాంటి వారిలో వాగ్దాటి కలిగిన నేతలు చాలా మందే ఉన్నారు. వీరిలో ఒక్కరొక్కరుగానే బయటకు వస్తున్నారు.

ఇందులో భాగంగానే గుంటూరు జిల్లాలోని తాడికొండ అసెంబ్లీ నియోకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉండవల్లి శ్రీదేవి.. ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఎంట్రీ ఇచ్చారు. ఎన్నికల్లో తనతో పాటు పార్టీ కూడా ఘన విజయం సాధించిన నేపథ్యంలో సోమవారం మీడియా ముందుకు వచ్చిన శ్రీదేవి... టీడీపీ అధినేత చంద్రబాబుపై తనదైన శైలి విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి వేరే ఎవరో కారణం కాదని చెప్పిన... అసలు సిసలు కారకుడు చంద్రబాబేనని చెప్పేశారు. చంద్రబాబును ప్రజలు నమ్మకపోవడంతోనే టీడీపీకి ఘోర పరాభవం ఎదురైందని ఆమె చెప్పారు.

అమరావతి పేరిట చంద్రబాబు ఐదేళ్ల పాటు అబద్ధాలే చెప్పారని సెటైర్ వేసిన శ్రీదేవి... రైతులను నిలువునా మోసం చేశారని ఘాటు వ్యాఖ్యలు సంధించారు. బాబు హయాంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని - ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా అందక చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని ప్రజలంతా భావించారని అందుకే వైసీపీకి భారీ మెజారిటీ విజయం దక్కిందని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే... భవిష్యత్తులో శ్రీదేవి కూడా ఆర్కే రోజా మాదిరే వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా ఎదగడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది.