Begin typing your search above and press return to search.

జగన్ అమరావతిని తాకట్టు పెట్టారు...ఉండవల్లి షాకింగ్ కామెంట్లు

By:  Tupaki Desk   |   9 Oct 2021 9:00 PM IST
జగన్ అమరావతిని తాకట్టు పెట్టారు...ఉండవల్లి షాకింగ్ కామెంట్లు
X
ఏపీ ఆర్థిక పరిస్థితిపై కొంతకాలంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ... సంక్షేమ పథకాల అమలు కోసం సీఎం జగన్ కుప్పలు తెప్పలుగా అప్పులు చేస్తున్నారని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకటో తారీకున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్ ఇచ్చేందుకు కూడా ఏ నెలకు ఆ నెల నిధులు వెతుక్కునే పరిస్థితి ఉందని కామెంట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా జగన్ పాలనపై మాజీ ఎంపీ, సీనియ‌ర్ పొలిటిషియ‌న్ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏపీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం మారిందన్న ఉండవల్లి...ఇష్టానుసారంగా జగన్ అప్పులు చేయడాన్ని తప్పుబట్టారు. ఇప్పటి దాకా ఏపీ ప్రభుత్వం దాదాపు రూ.6 లక్షల కోట్ల అప్పు చేసిందని ఉండవల్లి గణాంకాలతో సహా వెల్లడించారు. అంతేకాదు, అమరావతిని సైతం తాకట్టు పెట్టి జగన్ అప్పులు తెస్తున్న వైనంపై ఉండవల్లి అసహనం వ్యక్తం చేశారు.

ఏపీ సీఎం జగన్ కు సలహాలిచ్చేందుకు చాలా మంది సలహాదారులున్నారని, అయినప్పటికీ ఏపీలో ఆర్థికంగా దయనీయ పరిస్థితులు ఉండటం దారుణమని ఉండవల్లి విమర్శించారు. మరి కొన్నాళ్లపాటు ఏపీ ఆర్థిక పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీకి గడ్డుకాలం తప్పదని హెచ్చరించారు. దొరికిన ప్రతి చోట అప్పులు చేసే రాష్ట్రంగా ఏపీ మారిందని, జాతీయ స్థాయిలో ఏపీ అప్పులు చర్చనీయాంశమయ్యాయని ఉండవల్లి విమర్శించారు.

'వన్ నేషన్.. వన్ రేషన్ కార్డును దేశంలోని మరే రాష్ట్రం అమలు చేయడం లేదని, ఏపీలో మాత్రం జగన్ అమలు చేస్తున్నారని విమర్శించారు. పోలవరంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, ప్రాజెక్ట్‌ పనులు పూర్తికాకుండానే హడావిడిగా ప్రకటనలు చేయడం సరికాదని చెప్పారు.

ప్రాజెక్టుకు సంబంధించి రూ.4,068 కోట్లు కొర్రీలు వేశారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో పోలవరం ఎలా ఉందో.. ఇప్పటికీ అలాగే ఉందని, పెద్ద తేడా ఏమీ లేదని చెప్పారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం అందడం లేదని అసహనం వ్యక్తం చేశారు.