Begin typing your search above and press return to search.

సమైక్యవాది జగన్ విభజనకు మద్దతు ఇస్తున్నారు

By:  Tupaki Desk   |   7 Dec 2022 3:38 PM GMT
సమైక్యవాది జగన్ విభజనకు మద్దతు ఇస్తున్నారు
X
ఉమ్మడి ఏపీని రెండుగా చీల్చవద్దు అంటూ నాడు మాట్లాడిన జగన్ ఇపుడు విభజనకు మద్దతు ఇస్తున్నారా అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీని రెండుగా విడగొట్టడం తప్పు, అసలు పార్లమెంట్ రూల్స్, నిబంధలకు అనుగుణంగా విభజన బిల్లు ఆమోదం పొందలేదని చాలా ఏళ్ళ క్రితం ఉండవల్లి సుప్రీం కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసు విచారణ 2023 ఫిబ్రవరి 22న ఉంది. అయితే ఈ కేసు విషయంలో ఇప్పటిదాకా కేంద్రం కౌంటర్ దాఖలు చేయలేదని ఉండవల్లి అన్నారు. అదే విధంగా ఏపీ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని వదిలేయమంటూ సుప్రీం కి చెప్పడం దారుణమని ఆయన మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం తరఫున విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వీ ఈ కేసు మీద ఏపీ ప్రభుత్వం అభిప్రాయాన్ని అలా తెలియచేశారని ఆయన అన్నారు.

ఇది బాధ కలిగించింది అని ఉండవల్లి అన్నారు. ఇదిలా ఉంటే సమైక్యవాదిగా చెప్పుకునే జగన్ నాడు పార్లమెంట్ లో విభజన విషయంలో ఏ రకమైన పోరాటం చేయలేదని ఉండవల్లి ఫ్లాష్ బ్యాక్ ని గుర్తి చేసి మరీ నిందించారు. ఇక ఏపీని రెండుగా విభజించడం రాజ్యాంగ నిబంధనల ప్రకారం జరగలేదని ఆయన అన్నారు.

ఈ విషయంలో ఏపీకి తీరని అన్యాయం జరిగిందని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ కేవలం వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోయిందని, పరిశ్రమలు లేవు, రావు, ప్రోత్సాహకాలు లేవు అని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీకి అన్ని విధాలుగా అన్యాయం జరిగితే జగన్ ఈ విధంగా సుప్రీం కోర్టులో ఈ విషయాన్ని వదిలేయమని చెప్పడమేంటి అని ఉండవల్లి నిలదీశారు.

నాడు విభజన హామీలు అయినా ఏపీకి అమలు చేశారా అని ఆయన ప్రశ్నించారు. విభజన ఏపీకి పదివేల కోట్లు ఇవ్వాలని నాటి బీజేపీ నేత వెంకయ్యనాయుడు అడిగితే నాటి మంత్రి జై రాం రమేష్ తిరస్కరించారని ఆయన గుర్తు చేశారు. ఇక ప్రత్యేక హోదా లేదు, ఏదీ లేదు అన్ని రకాలుగా ఏపీ విభజన గాయాలతో బాధపడుతోంది అని ఆయన అన్నారు.

అదే విధంగా ఏపీ విభజన గాయాలు అంతకంతకు పెరిగిపోతున్నాయని ఆయన అన్నారు. ఇక ఏపీని అపసవ్యంగా విభజించింది అని ఎపుడూ కాంగ్రెస్ మీద విరుచుకుపడే బీజేపీ ఈ కేసులో కౌంటర్ కేంద్రం తరఫున దాఖలు చేయకపోతే రేపు ఎపుడైనా కాంగ్రెస్ ని విమర్శించగలదా అని ఆయన ప్రశ్నించారు.

ఈ కేసు ఫిబ్రవరిలో విచారణకు వస్తున్న నేపధ్యంలో ఏపీ సర్కార్ తో పాటు కేంద్రం కౌంటర్లు దాఖలు చేయాలని ఆయన కోరారు. జగన్ ఈ విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఆయన అన్నారు. ప్రధాని మోడీకి సన్నిహితుడు అయితే కావచ్చు కానీ ఏపీ హక్కుల గురించి మాట్లాడితే ఏమీ అయిపోదని ఆయన సూచించారు. మొత్తానికి ఉండవల్లి జగన్ సర్కార్ తీరు మీద నిప్పులే చెరిగారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.