Begin typing your search above and press return to search.

ఆ త‌ప్పు ఎవ‌రిదో జ‌గ‌న్, అంబ‌టి చెబుతారా?

By:  Tupaki Desk   |   3 Aug 2022 9:22 AM GMT
ఆ త‌ప్పు ఎవ‌రిదో జ‌గ‌న్, అంబ‌టి చెబుతారా?
X
రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల కాలంలో ప‌లు మీడియా సంస్థ‌ల‌కు, యూట్యూబ్ చాన‌ళ్ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్న తాజాగా మీడియాతో మాట్లాడుతూ పోల‌వ‌రంపై హాట్ కామెంట్స్ చేశారు. పోల‌వ‌రంలో కాపర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టడం వల్ల వచ్చిన నష్టానికి బాధ్యులెవరో నిర్థారించాలని, ఆ తప్పు ఎవరిదో సీఎం జగన్, జ‌ల‌వ‌న‌రుల శాఖ‌ మంత్రి అంబటి రాంబాబు చెప్పాలని కోరారు. ఆనాడు డయాఫ్రమ్ వాల్‌ కట్టాలని చెప్పినోళ్లే.. ఇప్పుడు దాని వల్లే నష్టం జరుగుతుందని అంటున్నారని ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. పోలవరం నిర్మాణంపై రాష్ట్ర ప్ర‌భుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు.

పోల‌వ‌రం ప్రాజెక్టుపై అధికార వైఎస్సార్సీపీ, ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నాయ‌ని ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ త‌ప్పుబ‌ట్టారు. త‌న జీవిత‌కాలంలో పోల‌వరం పూర్తి కాద‌నేది తేలిపోయింద‌న్నారు. పోల‌వరం ఎప్ప‌టికి పూర్త‌వుతుందో చెప్ప‌లేన‌న్న మంత్రి అంబ‌టి రాంబాబుకు ఉండ‌వల్లి సెటైరిక‌ల్ గా అభినంద‌న‌లు తెలిపారు.

ప్ర‌జ‌లు న‌ష్ట‌పోతున్నా పోల‌వరం గురించి ప‌ట్టించుకోక‌పోవ‌డం సిగ్గుచేట‌ని ఉండ‌వ‌ల్లి ధ్వ‌జ‌మెత్తారు. బావర్‌ వంటి అంతర్జాతీయ సంస్థలకు ఏమీ తెలియదా? అని ప్రశ్నించారు. మ‌రోవైపు పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం మునిగిపోతుందని తెలంగాణ నేతలు ఆరోపిస్తున్నారని.. అసలు పోలవరం డ్యామే ఇంకా క‌ట్ట‌లేద‌ని.. అప్పుడే భ‌ద్రాచ‌లం మున‌గడం ఏంట‌ని నిల‌దీశారు.

అలాగే కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తున్న‌వారిని, ప్ర‌శ్నిస్తున్న‌వారిని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ భ‌య‌పెడుతున్నార‌ని ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) వంటివాటితో త‌న‌ను విమ‌ర్శించేవారిని మోడీ భ‌య‌పెడుతున్నార‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ అగ్ర నేత‌లు సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ విచారణ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటంలో కాంగ్రెస్ విఫలమైంద‌ని ఉండ‌వ‌ల్లి తెలిపారు.

కాగా లోక్ సత్తా అధినేత జయప్రకాష్‌ నారాయణ పెట్టుబ‌డిదారీ విధానం వల్ల దేశానికి మంచి జరుగుతుంద‌ని చెబుతున్నార‌ని.. అయితే తాను ఆయ‌న చెప్పిన‌దాన్ని ఒప్పుకోబోన‌ని తెలిపారు. పెట్టుబ‌డిదారీ విధానంలో జయప్రకాశ్ నారాయణతో చర్చకు తాను సిద్దంగా ఉన్నానని ఉండవల్లి అరుణ్ కుమార్ స‌వాల్ విసిరారు.

పోల‌వ‌రంపై ఉండ‌వ‌ల్లి హాట్ కామెంట్ల‌తో ఇప్పుడు వైఎస్సార్సీపీ నేత‌లు ఎలా స్పందిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. అలాగే ఆయ‌న టీడీపీ తీరును కూడా త‌ప్పుబ‌ట్ట‌డంతో టీడీపీ నేత‌లు ఉండ‌వ‌ల్లి వ్యాఖ్య‌ల‌పై ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే!