Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్.. ఆ దేశ ప్రధానిని ఆసుపత్రికి తరలింపు

By:  Tupaki Desk   |   6 April 2020 10:10 AM IST
కరోనా ఎఫెక్ట్.. ఆ దేశ ప్రధానిని ఆసుపత్రికి తరలింపు
X
కరోనా దెబ్బకు ప్రపంచం హడలిపోతోంది. సంపన్న దేశాలు సైతం ఈ పిశాచి వైరస్ దెబ్బకు హాహాకారాలు చేస్తున్నారు. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా కరోనా వ్యాప్తి చెందుతున్న వైనానికి తగ్గట్లే.. వెలుగు చూస్తున్న పాజిటివ్ కేసులు సంచలనంగా మారుతున్నాయి. కరోనా సోకి ఇంటికే పరిమితమైన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ను తాజాగా ఆసుపత్రికి తరలించటం షాకింగ్ గా మారింది.

యాభై ఐదేళ్ల బోరిస్ పది రోజులుగా హోం క్వారంటైన్ లో ఉన్నారు. సాధారణంగా కరోనా సోకిన వారికి ట్రీట్ మెంట్ క్రమపద్దతిలో సాగుతుంది. ట్రీట్ మెంట్ స్టార్ట్ చేసిన ఐదారురోజులకే మార్పు వస్తుందని చెబుతారు. అందుకు భిన్నంగా బ్రిటన్ ప్రధానికి పది రోజులైనా కరోనా లక్షణాలు తగ్గకపోవటంతో తాజాగా ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.

ఇంట్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డు లో ఉంటున్న బ్రిటన్ ప్రధానిని ఇప్పుడు ఆసుపత్రికి షిఫ్ట్ చేయటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా తీవ్రత పెరగటంతో.. మరింత మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్రీట్ మెంట్ స్టార్ట్ చేసి పది రోజులు అవుతున్నా.. పెద్దగా ఫలితం లేని కారణంతో మరింత కేర్ అవసరమై ఉంటుంది. ఈ కారణంతోనే ఆసుపత్రికి మార్చి ఉంటారంటున్నారు. ఇప్పటివరకూ బ్రిటన్ లో 48 వేల మందికి కరోనా సోకగా.. 4934 మంది దీని బారిన పడి మరణించారు.