Begin typing your search above and press return to search.

ఉగాది పంచాంగం..మంత్రుల ప‌ద‌వుల‌పై కేసీఆర్

By:  Tupaki Desk   |   18 March 2018 9:51 AM GMT
ఉగాది పంచాంగం..మంత్రుల ప‌ద‌వుల‌పై కేసీఆర్
X
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విళంబి నామ సంవత్సర ఉగాది సంద‌ర్భంగా మ‌రోమారు త‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల‌కు ఉత్కంఠ రేకెత్తించారు. ఇద్ద‌రు మంత్రుల‌కు గుడ్ న్యూస్ చెప్తూనే నలుగురు మంత్రుల‌ను స‌స్పెన్స్‌లో పెట్టారు. ఇదంతా సాక్షాత్తు ముఖ్య‌మంత్రి కార్యాల‌య‌మైన ప్రగతి భవన్ వేదిక‌గా జ‌రిగింది కావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరంలో రాష్ట్ర ప్రజానీకానికి శుభం జరగాలని భగవంతుణ్ణి ప్రార్థించినట్లు సీఎం చెప్పారు.

`ప్రజలు సకల సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థించాను. రైతాంగం సుభిక్షంగా ఉండాలి. ఈ రోజు స్వీకరించే పచ్చడి.. సందేశాత్మకంగా ఉంటుంది. తీపి, వగరు, పులుపులాగే జీవితం కూడా ఉంటుంది` అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ అద్భుతమైన వెలుగుజిలుగులతో విరాజిల్లుతుందని పంచాంగకర్తలు చెప్పడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన సిరిసంపదలతో తులతూగుతుందని పంచాంగకర్తలు చెప్పారని సీఎం గుర్తు చేశారు. శాంతిభద్రతలు సుభిక్షంగా ఉంటాయని, పోలీసు శాఖ సమర్థవంతంగా పని చేస్తుందని కేసీఆర్ ఉద్ఘాటించారు. `తెలంగాణ రాష్ట్రం అవతరించడం.. తదనంతరం మంచి ఫలితాలు సాధించడం. అవి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడం గర్వించదగ్గ విషయం. తెలంగాణ రాష్ట్రం రాశి కర్కాటక రాశి. ఆదాయం 8, వ్యయం 2. రాష్ట్రం తప్పకుండా సుసంపన్నంగా ఉంటుంది. తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉంటుందని సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పారు. ఆ విధంగానే రాష్ట్రం ఉండబోతుంది` అని సీఎం స్పష్టం చేశారు.

`తెలంగాణ దేవభూమి కలిగిన రాష్ట్రం. రాష్ట్రంలో అద్భుతంగా పూజలు జరుగుతున్నాయి. అన్ని వర్గాల పండుగలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా నిర్వహిస్తుంది` అని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రగతిభవన్‌ ఉగాది వేడుకల్లో పంచాగ శ్రవణం చేసిన బాచంపల్లి సంతోశ్‌కుమార్‌ శర్మ.. పలు ఆసక్తికర విషయాలను పేర్కొన్నారు. అతి త్వరలోనే 5 నుంచి 8 మంది మంత్రులకు ఇబ్బందులు తప్పవని, మళ్లీ వారికి పదవులు లభించడం కష్టమేనని చెప్పడం, కొన్ని రాశులవారికి ఎమ్మెల​ఏ టికెట్లు దక్కవని హెచ్చరించడం గ‌మ‌నార్హం. అయితే అనంత‌రం సీఎం కేసీఆర్ స్పందిస్తూ `ఈ సంవత్సరం ఎన్నికల సంవత్సరం కాబట్టి శాస్త్రి చెప్పినట్లు ఏ నాయకుడికి కూడా ఢోకా లేదు. టికెట్లు సంపాయించుకోవాలి అంటే ప్రజల్లో ఉండాలి. హైదరాబాద్‌లో ఉండొద్దు. ప్రజల్లో ఉంటే గెలుపు వారిదే` అని సీఎం కేసీఆర్ చెప్పారు. `హోం - ఆరోగ్య శాఖల పనితీరు బాగుటుందని శాస్త్రి చెప్పడంతో ఆ శాఖల మంత్రులకు ఎలాంటి ఢోకా లేదు.` అని అన్నారు. అయితే ఇద్ద‌రు మంత్రుల విష‌య‌మే చెప్పిన సీఎం కేసీఆర్ మిగ‌తా వారి విష‌యంలో క్లారిటీ ఇవ్వ‌కపోవ‌డంతో....వారి భ‌విష్య‌త్ ఏంట‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.