Begin typing your search above and press return to search.

బుర్ఖా తీసి మహిళా విద్యార్థినుల మర్మంగాల పై దాడి ... కారణం ఏంటంటే !

By:  Tupaki Desk   |   11 Feb 2020 7:15 AM GMT
బుర్ఖా తీసి మహిళా విద్యార్థినుల మర్మంగాల పై దాడి ... కారణం ఏంటంటే !
X
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం పై దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఎన్ని ఆందోళనలు చేసినప్పటికీ ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు అని కేంద్రం స్పష్టం చేసింది. అయినప్పటికీ కూడా ఈ ఆందోళనకారులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ సిఏఏ కి వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన నిరసన ర్యాలీ , తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. విద్యార్థులు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో వారిద్దరి మధ్య తోపులాట జరిగింది. బలవంతంగా కొందరిని అరెస్ట్ చేసిన పోలీసులు , పోలీస్ స్టేషన్స్ కి తరలించారు. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు తమ బుర్ఖా తీసి మరీ మర్మాంగాలపై దాడి చేశారని పలువురు వర్సిటీ మహిళా విద్యార్థులు ఆరోపణలు చేస్తుండటం సంచలనంగా మారింది.

జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు సీఏఏని వ్యతిరేకిస్తూ పార్లమెంటు వరకు ర్యాలీ చేపట్టాలని బయలుదేరారు. అయితే పోలీసులు బారికేడ్లతో వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులు బారికేడ్ల పైనుంచి దూకే ప్రయత్నం చేయడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పినట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పోలిసుల దాడుల్లో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి చెందిన 10 మంది విద్యార్థులు తమ ప్రైవేట్ పార్ట్స్‌కి గాయాలు కావడంతో జామియా హెల్త్ సెంటర్‌లో చేరారు. అయితే కొంతమంది విద్యార్థులకు గాయాలకు తీవ్రంగా ఉండటంతో... అక్కడినుంచి అల్ షిఫా ఆస్పత్రికి తరలించినట్టు జామియా హెల్త్ సెంటర్ వైద్యులు తెలిపారు. 10 మందికి పైగా మహిళా విద్యార్థుల మర్మాంగాల పై గాయాలు గుర్తించామని తెలిపారు.

ఇకపోతే, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళా విద్యార్థుల్లో ఓ విద్యార్థిని మీడియాతో మాట్లాడారు. ఓ మహిళా పోలీస్ తన బుర్ఖా విప్పి మరీ ప్రైవేట్ పార్ట్స్‌పై బూటు కాలితో దాడి చేసిందని చెప్పారు. లాఠీతోనూ తన ప్రైవేట్ పార్ట్స్‌పై దాడి చేసిందన్నారు. మరో ఇద్దరు పురుష విద్యార్థులు కూడా తమ మర్మాంగాలపై పోలీసులు దాడి చేశారని చెప్పారు. గాయాలతో వారు కూడా ఆస్పత్రిలో చేరారు. పోలీసులు లాఠీలతో ఛాతిపై కొట్టడంతో కొంతమంది విద్యార్థులకు అంతర్గతం గా గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. మరికొందరు విద్యార్థులు మాట్లాడుతూ.. పోలీసులు తమ బెల్టు కింది భాగంలోనే ఎక్కువగా కొట్టారని ఆరోపించారు. కెమెరా కంటికి చిక్కకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే బెల్టు కింది భాగంలో దాడి చేశారని అన్నారు. శాంతియుత నిరసనకు తమను అనుమతించాలని పోలీసులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ వారు పట్టించుకోలేదన్నారు. మాటి మాటికీ వెనక్కి నెట్టేయడంతో.. తొక్కిసలాట జరిగింది అని పలువురు విద్యార్థులు పోలీసుల పై ఆరోపణలు చేసారు.