Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ లో రెండు ఆర్టీసీ బ‌స్సుల్ని త‌గ‌లెట్టేశారు

By:  Tupaki Desk   |   20 Dec 2017 6:46 AM GMT
హైద‌రాబాద్ లో రెండు ఆర్టీసీ బ‌స్సుల్ని త‌గ‌లెట్టేశారు
X
ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ఐదు రోజుల పాటు నాన్ స్టాప్ గా సాగిన ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు అత్యంత అద్భుత‌మైన రీతిలో జ‌రిగాయి. ఎలాంటి లోటు లేకుండా సాగిన ఉత్స‌వాల ప్రారంభం ఎంత ఉత్సాహ‌వంత‌మైన వాతావ‌ర‌ణంలో సాగిందో.. ముగింపు అంతే ఉత్సాహంగా ముగిసింది.

న్యూఇయ‌ర్ వేడుక‌లు ముందే వ‌చ్చిన‌ట్లుగా.. ఐదు రోజులుగా ఒక‌లాంటి పండ‌గ వాతావ‌ర‌ణం ప్ర‌భుత్వ వ‌ర్గాల్లోనూ.. ప్ర‌జ‌ల్లోనూ.. మీడియాలోనూ క‌నిపించింది. మంగ‌ళ‌వారం రాత్రి ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు ముగిశాక‌.. ప్ర‌భుత్వ యంత్రాంగం యావ‌త్తు ఊపిరిపీల్చుకుంది. ఇలాంటి వేళ‌.. మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి అనుకోని రీతిలో చోటు చేసుకున్న ఘ‌ట‌న ఒక్క‌సారి ఉలిక్కిప‌డేలా చేసింది.

ఉప్ప‌ల్ లోని ఆదిత్య ఆసుప‌త్రి స‌మీపంలో రెండు ఆర్టీసీ బ‌స్సుల్ని పెట్రోల్ పోసి త‌గ‌ల‌బెట్టిన వైనం సంచ‌ల‌నం సృష్టించ‌ట‌మేకాదు.. అర్థ‌రాత్రివేళ పోలీసు వ‌ర్గాల్ని అల‌ర్ట్ అయ్యేలా చేసింది. స్థానికంగా క‌ల‌క‌లం రేపిన ఈ ఉదంతం వెనుక ఉన్న‌ది ఎవ‌ర‌న్న‌ది అంతుబ‌ట్ట‌నిదిగా మారింది.

గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు రెండు ఆర్టీసీ బ‌స్సుల్ని త‌గ‌ల‌బెట్టిన‌ట్లుగా స్థానికులు చెబుతున్నారు. సీసాలో పెట్రోల్ తీసుకొచ్చి బ‌స్సుపై పోసి త‌గ‌ల‌బెట్టార‌ని పోలీసులు గుర్తించారు. బ‌స్సులు కాలిపోతున్న వైనాన్ని గుర్తించిన వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బందిని అలెర్ట్ చేయ‌టంతో.. ఉరుకులు ప‌రుగులు తీస్తూ ఘ‌ట‌నాస్థ‌లానికి వ‌చ్చి మంట‌ల్ని ఆర్పే ప్ర‌య‌త్నం చేశారు. ఇంత‌కీ బ‌స్సుల్ని ద‌గ్థం చేసింది ఎవ‌ర‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.