Begin typing your search above and press return to search.

గుడ్ న్యూస్ .. త్వరలోనే అందుబాటులోకి మరో రెండు వ్యాక్సిన్లు !

By:  Tupaki Desk   |   7 Aug 2021 11:33 AM GMT
గుడ్ న్యూస్ .. త్వరలోనే అందుబాటులోకి మరో రెండు వ్యాక్సిన్లు !
X
మనదేశంలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 50 కోట్ల డోసుల టీకాలు వేశారు. కోవిషీల్డ్, కొవాగ్జిన్,స్పుత్నిక్ వ్యాక్సిన్‌ లను ప్రజలకు వేస్తున్నారు. ఈ క్రమంలో మరో టీకా కూడా అందుబాటులోకి రాబోతోంది. జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. అమెరికా దిగ్గజ ఫార్మా కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ కరోనాకు సింగిల్ డోస్ టీకాను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ టీకాకు భారత్ అత్యవసర వినియోగ అనుమతులు జారీచేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. తమ వ్యాక్సిన్ అంతర్జాతీయ సరఫరాలో హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ కీలక పాత్ర పోషిస్తోందని జాన్సన్ అండ్ జాన్సన్ తెలిపింది. వ్యాక్సిన్ వినియోగంపై ఓ సారి దరఖాస్తు చేసి వెనక్కి తగ్గిన ఆ సంస్థ.. భారత్‌లో సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ ను తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నామని గత వారం ప్రకటించింది. ఏప్రిల్ లోనే టీకా ట్రయల్స్ కు సంబంధించి అనుమతులు కోరగా, తాజాగా వ్యాక్సిన్ వినియోగంపై దరఖాస్తు చేసింది. మరోపక్క, ఇండియాకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ కూడా కొవోవ్యాక్స్‌ కు అత్యవసర వినియోగ అనుమతి కోసం దరఖాస్తు చేసింది.

అమెరికా కంపెనీకి చెందిన నొవావ్యాక్స్‌ వ్యాక్సిన్‌ను ఇండియాలో కొవోవ్యాక్స్‌ గా ఉత్పత్తి చేయనుంది. నొవావ్యాక్స్‌ ఎఫికసీ రేట్‌ 93 శాతంగా ఉన్నట్టు ఆ సంస్థ చెబుతోంది. సెప్టెంబర్‌ నాటికి కొవోవ్యాక్స్‌ను అందుబాటులోకి తీసుకు రావాలని సీరం సంస్థ భావిస్తోంది. వివిధ వేరియంట్ల మీద ఈ వ్యాక్సిన్‌ ప్రభావవంతంగా పని చేస్తుందని చెబుతోంది. ఇక, డెల్టా వేరియంట్‌ కు కరెక్ట్ ఆన్సర్ జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ అని ఆ సంస్థ చెబుతోంది. సింగిల్‌ డోస్‌తోనే డెల్టా వేరియంట్‌ ను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తుందని పరిశోధనల్లో తేలింది. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని.. టీకా ప్రభావం ఎనిమిది నెలల వరకు ఉంటుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

ఫేజ్‌-3 క్లినికల్ ట్రయల్స్ ఆధారంగా జాన్సన్ సంస్థ వ్యాక్సిన్ వినియోగానికి సంబంధించిన దరఖాస్తును సమర్పించామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. తీవ్ర కేసుల్లో తమ వ్యాక్సిన్‌ 85 శాతం ప్రభావశీలతను చూపిస్తోందని, ఆస్పత్రిలో చేరిన వారిలో 93.1 శాతం ప్రభావం చూపిస్తోందని వెల్లడించారు. టీకా వేసిన 28 రోజుల తర్వాత కొవిడ్‌ నుంచి రక్షణ కల్పించడం ప్రారంభమవుతుంది. మహమ్మారిని అంతం చేయడంలో సహకరించేందుకు, టీకా లభ్యతను వేగవంతం చేసేందుకు.. భారత ప్రభుత్వంతో జరుపుతోన్న చర్చలు కొలిక్కి రావాలని ఎదురుచూస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఇప్పటికే పలు దేశాలు అనుమతించిన వ్యాక్సిన్లను ట్రయల్స్ అవసరం లేకుండానే అత్యవసర వినియోగానికి అనుమతించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం మనదేశంలో ఉన్న టీకాలన్నీ రెండో డోసుల టీకాలు. కానీ జాన్సన్ అండ్ జాన్సన్ మాత్రం సింగిల్ డోసు టీకా. ఒక్క డోస్ వేసుకుంటే చాలు కరోనాకు చెక్ పెట్టవచ్చు.