Begin typing your search above and press return to search.

కేసీఆర్ కేబినెట్లో ఇద్ద‌రు మంత్రుల‌కు ప‌ద‌వీ గండం?

By:  Tupaki Desk   |   6 May 2022 8:29 AM GMT
కేసీఆర్ కేబినెట్లో ఇద్ద‌రు మంత్రుల‌కు ప‌ద‌వీ గండం?
X
తెలంగాణ‌లో రాజ‌కీయాలు ప్ర‌స్తుతం హాట్ హాట్ గా మారిపోయిన సంగ‌తి తెలిసిందే. అధికార టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు అందివ‌చ్చే ప్ర‌తి అవ‌కాశాన్ని ప్ర‌తిప‌క్షాలు వినియోగించుకుంటున్నాయి. చిన్న అంశం అయినా స‌రే, పాల‌క ప‌క్షంపై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డుతున్నాయి. ఇక కీల‌క‌మైన‌, మెజార్టీ ప్ర‌జ‌ల‌కు సంబంధించిన విష‌యాల్లో అయితే, ఆందోళ‌న బాట ప‌ట్టే సంగ‌తి తెలిసిందే. అలాంటి ఓ అంశంలో ఇద్ద‌రు కేబినెట్ మంత్రుల ప‌ద‌వులు ఊడిపోయేలా కొత్త డిమాండ్ తెర‌మీద‌కు వ‌చ్చింది. కేసీఆర్ స‌ర్కారుపై తీవ్రంగా విరుచుకుప‌డుతున్న బీజేపీ ఈ డిమాండ్ చేసింది.

తాజాగా కురిసిన అకాల వ‌ర్షాల‌కు తెలంగాణ‌లో పెద్ద ఎత్తున పంట న‌ష్టం జ‌రిగింది. తెలంగాణవ్యాప్తంగా కీల‌క పంట‌లు దెబ్బ‌తిని రైత‌న్న ఆందోళ‌న‌లో ఉన్నారు. ఈ స‌మ‌యంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వరిధాన్యం కొనుగోళ్ళ విషయంలో రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా అకాల వర్షంతో ధాన్యం పండిరచిన రైతులు నిట్టనిలువునా మునిగారని తాజాగా ఓ ప్ర‌క‌ట‌న‌లో సంజ‌య్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

వడ్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో రాష్ట్రప్రభుత్వం అలసత్వం కారణంగా తెలంగాణలో రైతాంగం తీవ్రంగా నష్టపోయారని మండిప‌డ్డారు. ఐకెపి కేంద్రాలు సకాలంలో ప్రారంభం కాకపోవడంతో తక్కువ ధరకే దళారులకు పంటను అమ్ముకుని రైతాంగం తీవ్రంగా నష్టపోగా...అకాల వర్షంతో ఇప్పుడు రైతాంగం పూర్తిగా దెబ్బతిన్నారని బండి సంజ‌య్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ గత వారం రోజులుగా హెచ్చరిస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం దున్నపోతుపై వర్షం కురిసిన చందంగా వ్యవహరించిందని ఆరోపించారు.

అమ్మకానికి తెచ్చిన ధాన్యానికి సైతం కనీస రక్షణ ఏర్పాట్లు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బండి సంజ‌య్ పేర్కొన్నారు. ఫలితంగా అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొట్టుకుపోయిందని తెలిపారు.

''సకాలంలో ఐకెపి కేంద్రాల ఏర్పాటులో అలసత్వం వహించిన మీ సివిల్‌ సప్లయ్‌ శాఖామంత్రి, అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ముందు హెచ్చరించినా రైతాంగాన్ని, వ్యవసాయ అధికారులను అప్రమత్తం చేయని మీ వ్యవసాయ శాఖా మంత్రిని మీ క్యాబినెట్‌లో కొనసాగించడం సిగ్గుచేటు.

అటువంటి అసమర్థత కలిగిన మంత్రులను మీ క్యాబినెట్‌లో కొనసాగించాలా లేదా అనే విషయాన్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇప్పటికైనా రైతాంగానికి జరిగిన నష్టానికి తగిన పరిహారం చెల్లించి, తెలంగాణ రైతాంగానికి మీరు చేసిన పాపానికి ప్రశ్చాతాపం ప్రకటించండి.'' అని వ్యాఖ్యానించారు.