Begin typing your search above and press return to search.

కిస్మత్​ అంటే వీళ్లదే! పని ప్రదేశంలో వజ్రాలు దొరికాయి..

By:  Tupaki Desk   |   5 Nov 2020 12:30 AM GMT
కిస్మత్​ అంటే వీళ్లదే! పని ప్రదేశంలో వజ్రాలు దొరికాయి..
X
మధ్యప్రదేశ్​కు చెందిన ఇద్దరు కూలీలకు భారీ విలువైన వజ్రాలు దొరికాయి. దీంతో వారి దశ తిరిగి లక్షాధికారులయ్యారు. మధ్యప్రదేశ్​ రాష్ట్రంలోని పన్నా జిల్లాకు చెందిన ఇద్దరు గనుల్లో కూలి పనికి వెళ్తుంటారు. అయితే ఇటీవల వాళ్లు పనిచేస్తున్న ప్రదేశంలో రెండు విలువైన వజ్రాలు దొరికాయి. ఈ వజ్రాలు ప్రస్తుతం గనుల శాఖ అధికారుల ఆధీనంలో ఉన్నాయి. అయితే వీటిని వేలం వేసి రాయల్టీ పోగా మిగిలిన మొత్తాన్ని కూలీలకు అందజేయనున్నట్టు పన్నా జిల్లా గనులశాఖ అధికారి అనుపమ్​ సింగ్​ పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘ పన్నా జిల్లాకు చెందిన దిలీప్​ మిస్త్రీ, లఖన్​ యాదవ్​ దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. ఇటీవల కల్యాణ్​పూర్​, జర్వా పూర్​ ప్రాంతాల్లోని గనుల్లో పనికి వెళ్లారు. అక్కడ వారికి భారీ విలువైన వజ్రాలు లభించాయి. అయితే సదరు వజ్రాలను గనులశాఖకు అప్పజెప్పారు.

ఆ రెండింటిలో ఒకటి 14.98 క్యారెట్లు, మరొకటి 7.44 క్యారెట్లు ఉన్నది. 14.98 క్యారెట్లు విలువైన వజ్రం రూ. 60 లక్షలు పైనే పలుకుతుంది. మరొకటి కొత్త తక్కువ ధరకు పలకొచ్చు. ఈ వజ్రాలను వేలం వేస్తాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాయల్టీ పోగా మిగిలిన మొత్తాలను కూలీలకు అందజేస్తాం. ’అని ఆయన తెలిపారు. కాగా ఈ విషయంపై సదరు కూలీలు మాట్లాడుతూ.. ‘దేవుడి దయవల్ల మాకు ఇంత విలువైన వజ్రాలు దొరికాయి. అధికారులు డబ్బులు ఇప్పిస్తామని చెప్పారు. ఆ డబ్బుతో మా పిల్లలను ఉన్నత చదువులు చదివించుకుంటాం’ అని సంతోషం వ్యక్తం చేశారు.