Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.. తాజాగా ఏం జ‌రిగిందంటే!

By:  Tupaki Desk   |   15 Nov 2022 5:40 AM GMT
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.. తాజాగా ఏం జ‌రిగిందంటే!
X
తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో నిందితుల‌కు చుక్కెదురైంది. ఈ కేసును ఏక‌కాలంలో మూడు కోర్టులు విచారించాయి. అయితే, ఎక్క‌డా కూడా నిందితుల‌కు సానుకూలంగా తీర్పు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి త‌మ‌కు బెయిల్ వ‌స్తుంద‌ని నిందితులు ఎదురు చూశారు. కానీ, వారికి ఊర‌ట ల‌భించ‌లేదు. ఈ కేసును సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు, ఏసీబీ కోర్టులు విచారిస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో సోమ‌వారం ఈ మూడు కోర్టుల్లోనూ ప‌లు పిటిష‌న్ల‌పై విచార‌ణ జ‌రిగింది. అయితే, ఎక్క‌డా కూడా నిందితుల‌కు సాన‌కూలంగా నిర్ణ‌యాలు వెలువ‌డ‌లేదు. సుప్రీ కోర్టు.. విచారణను సోమవారానికి వాయిదా వేస్తే.. హైకోర్టు మంగ‌ళ‌వారానికి వాయిదా వేసింది. ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం అయితే.. ఏకంగా బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో నిందితులు మళ్లీ రిమాండ్ ఖైదీలుగా జైలుకే వెళ్లనున్నారు.

ఎమ్మెల్యేల కొనుగోలు ప్ర‌య‌త్నం కేసులో ప్ర‌స్తుతం విచార‌ణ ఖైదీలుగా ఉన్న‌ నిందితులు బెయిల్ కోసం తిప్ప‌లు ప‌డుతున్నారు. సుప్రీం కోర్టు, హైకోర్టు, ఏసీబీ స్పెషల్ కోర్టు.. ఇలా మూడు న్యాయస్థానాలను వారు ఆశ్ర‌యించారు. అయితే.. ఎక్క‌డా కూడా వారికి ఊర‌ట ల‌భించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

సుప్రీంకోర్టులో ఇలా..

వాస్త‌వానికి సోమ‌వారం ఎలాగైనా బెయిల్ వస్తుందని భావించిన‌ నిందితులకు సుప్రీం కోర్టు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్‌పై విచారణ ఉన్నందున.. వాయిదా వేయాలని ప్రతివాదులు కోరగా.. సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

హైకోర్టు కూడా..

మరోవైపు ఈ కేసుకు సంబంధించి విధించిన స్టేను ఎత్తివేస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ.. బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని.. సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ప్రేమేందర్ రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై అత్యవసరంగా విచారణ జరిపించాలని ప్రేమేందర్ తరఫు న్యాయవాది సోమవారం తెలంగాణ హై కోర్టును కోరగా.. దీనిపై స్పందించిన న్యాయస్థానం మంగళవారం విచారణ చేపడతామని పేర్కొంది.

ఏసీబీ కోర్టులో చుక్కెదురు!

బెయిల్‌ మంజూరు చేయాలని వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన.. నాంపల్లి ఏసీబీ స్పెషల్ కోర్టు ఏకంగా పిటిష‌న్‌ను కొట్టివేసింది. ఇది హై ఫ్రొఫైల్ కేసు కావటం వల్ల.. దర్యాప్తు సమయంలో నిందితులకు బెయిల్‌ మంజూరు చేస్తే కేసును, సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది వినిపించిన వాద‌న‌ల‌తో కోర్టు ఏకీభవించింది. నిందితుల బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసింది. బెయిల్‌ మంజూరు కాకపోవడంతో ముగ్గురు నిందితులు యథావిధిగా చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉండనున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.