Begin typing your search above and press return to search.

దేశముదురు హీరోయిన్ మాదిరి సన్యాసినిగా కావాలని ఫిక్స్

By:  Tupaki Desk   |   24 Jan 2020 5:15 AM GMT
దేశముదురు హీరోయిన్ మాదిరి సన్యాసినిగా కావాలని ఫిక్స్
X
తెలిసి తెలియని వయసులో తీసుకునే నిర్ణయాలు ఎంత అపరిపక్వంగా ఉంటాయనటానికి తాజా ఉదంతం ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. అమ్మ తిట్టిందని అలిగిన ఇద్దరు కవలలు.. ఊహించిన నిర్ణయాన్ని తీసుకున్నారు. తల్లిదండ్రుల్ని ఉరుకులు పరుగులు పట్టించిన వైనం వింటే.. ఇప్పటి పిల్లల్ని ఎలా డీల్ చేయాల్రా భగవంతుడా? అన్న భావన కలుగక మానదు. దీనికి తోడు సినిమాల ప్రభావం తోడైతే.. పిచ్చ పీక్స్ కు చేరటం ఖాయం. సంచలనంగా మారిన తాజా ఉదంతాన్ని చూస్తే..

చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన కవలలైన అమ్మాయిలు ప్రస్తుతం తిరుపతిలో ఇంటర్ చదువుతున్నారు. సంక్రాంతి పండక్కి సెలవుల కోసం ఇంటికి వచ్చారు. వారి పనుల్ని తీవ్రంగా తప్ప పడుతూ.. తల్లి మందలించింది. దీంతో వారికి కోపం వచ్చి అలిగారు. స్నేహితురాలు.. దేశ ముదురు సినిమాలో హీరోయిన్ మాదిరి సన్న్యాసినిలా మారిపోతే జీవితం బాగుంటుందన్న సలహా ఇవ్వటం.. అది వారికి నచ్చటంతో ఇంట్లో నుంచి చెప్పకుండా బయటకు వచ్చేశారు.

అయితే.. ఇదంతా వారు తమ బంధువుల ఇంట్లో ఉండగా చేశారు. దీంతో.. అటు బంధువులు.. ఇటు కవలల తల్లిదండ్రులు ఇద్దరు అమ్మాయిల కోసం విపరీతంగా గాలించటం షురూ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. అయితే.. వారి దగ్గరి సెల్ ఫోన్లు స్విచ్ఛాప్ చేసి ఉండటంతో వారు ఎక్కడ ఉన్నారో గుర్తించటం కష్టంగా మారింది. వారి ఆచూకీ లభించకున్నా అదే పనిగా వెతుకుతున్న వారికి.. పిల్లల సెల్ ఫోన్లు ఆన్ కావటం.. వారి లొకేషన్ ఆధారంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

స్నేహితురాలు ఇచ్చిన సలహా నచ్చి.. దేశముదురు సినిమాలో హీరోయిన్ మాదిరి సన్యాసినిగా మారాలని.. అందుకు తగిన ఆశ్రమం కశ్మీర్ లో ఉంటుందన్న ఉద్దేశంతో తమిళనాడులోని చుట్టాల ఇంటి నుంచి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చేరుకున్న వేళలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. దీంతో.. మూడు రోజుల నుంచి వారి కోసం వెతుకుతున్న తల్లిదండ్రులు.. బంధువులు.. ఎట్టకేలకు వారు క్షేమంగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు.