Begin typing your search above and press return to search.

ఇదేం విడ్డూరం.. ఎమ్మెల్సీ అనంతబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం

By:  Tupaki Desk   |   15 Jun 2022 6:30 AM GMT
ఇదేం విడ్డూరం.. ఎమ్మెల్సీ అనంతబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం
X
ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో తన దగ్గర పని చేసే డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినందుకు ప్రస్తుతం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రాజమండ్రి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. సుబ్రహ్మణ్యం దళితుడు కావడంతో ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.

ఎమ్మెల్సీనే హత్య చేశారనడానికి అన్ని ఆధారాలు కనిపిస్తున్నా పోలీసులు ఆయనను అరెస్టు చేయడానికి ముందు మీన మేషాలు లెక్కించారు. అయితే దీనిపై ప్రతిపక్ష పార్టీలు, దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. దీంతో ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్టు చేయక పోలీసులకు మరోదారి లేకుండా పోయింది.

ఆ తర్వాత వైఎస్సార్సీపీ అనంతబాబుని పార్టీ నుంచి కూడా సస్పెండ్‌ చేసింది. ఇక సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేశానని పోలీసుల విచారణలో ఎమ్మెల్సీ అనంత బాబు కూడా అంగీకరించారు. దీంతో ఆయనను అరెస్ట్‌ చేసినట్లు.. కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌ తెలిపిన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం జైల్లో ఉన్న అనంతబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం వైరలవుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేటలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు అనంత బాబు ప్లెక్సీల ఏర్పాటు చేయడమే కాకుండా ఊరేగింపులు, పాలాభిషేకాలు కూడా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వచ్చాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

దీనిపై నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. ''దళిత యువకుడు సుబ్రహ్మణ్యంని అత్యంత కిరాతకంగా చంపిన ఎమ్మెల్సీ అనంతబాబుకి పాలాభిషేకం చేయించారు.. సీఎం జగన్ రెడ్డి. జైల్లో సకల సౌకర్యాలు, బయట ఫ్లెక్సీల‌తో ఊరేగింపులు చూస్తుంటే దళితులపై సాగుతున్న దమనకాండ అంతా జగన్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందని స్పష్టమవుతోంది" అని లోకేష్ ట్వీట్‌ చేశారు. ఈ ప్ర‌భుత్వంలో నిందితుల‌కు ర‌క్ష‌, బాధితుల‌కు శిక్షేనని మరోసారి రుజువైందన్నారు. దమనకాండ అంతా జగన్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందని స్పష్టమవుతోందని తీవ్ర విమర్శలు చేశారు.

ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైళ్లో అనంతబాబుకు సకల సౌకర్యాలు అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన కోరుకున్న ఆహారాన్ని అందిస్తున్నారని.. ఆయన జైల్లో ఉండే అందరితో ఫోన్లు మాట్లాడుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా ములాఖత్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా రోజూ పదుల సంఖ్యలో అనంతబాబుని వైఎస్సార్సీపీ నేతలు, తదితరులు కలుస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా పాలాభిషేకం ఘటనతో ఈ విమర్శలు ఎక్కువయ్యాయి.