Begin typing your search above and press return to search.

టీవీ 9 ర‌విప్ర‌కాశ్ ఎపిసోడ్‌!..ఏం జ‌రిగిందంటే?

By:  Tupaki Desk   |   9 May 2019 5:47 PM GMT
టీవీ 9 ర‌విప్ర‌కాశ్ ఎపిసోడ్‌!..ఏం జ‌రిగిందంటే?
X
ప్ర‌ముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ9 - దానికి ఆది నుంచి సీఈఓగా వ్య‌వ‌హ‌రిస్తున్న ర‌విప్ర‌కాశ్ పై కేసు న‌మోదు - ఇళ్ల‌లో సోదాలు - ర‌విప్ర‌కాశ్ అజ్ఞాతం త‌దిత‌రాల గురించి గురువారం ఉద‌యం నుంచీ ఒక‌టే ర‌చ్చ కొన‌సాగిన విషయం తెలిసిందే. అయితే అంద‌రికీ షాకిస్తూ స్వ‌యంగా ర‌వి ప్ర‌కాశే రాత్రి 6.45 గంట‌ల‌కు టీవీ 9 తెర‌పై ప్ర‌త్య‌క్ష‌మై ఈ వివాదంపై వివ‌రణ ఇచ్చిన సంగ‌తీ తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అస‌లు జ‌రిగిన‌దేమిటీ? అనే విష‌యంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో కాసేప‌టి క్రితం ఓ ప్ర‌ముఖ ఛానెల్ ఈ వ్య‌వ‌హారంలో ఇప్ప‌టిదాకా జ‌రిగిన‌దేమిటి? అన్న దానిపై స‌వివరంగా ఓ క‌థ‌నాన్ని ప్ర‌సారం చేసింది.

ఈ క‌థ‌నం మేర‌కు... గురువారం సాయంత్రం ర‌వి ప్ర‌కాశ్ ను పోలీసులు టీవీ 9 కార్యాల‌యంలోనే ప్ర‌శ్నించారు. ర‌వి ప్ర‌కాశ్ - శివాజీ మ‌రికొంద‌రితో క‌లిసి ఫోర్జ‌రీకి పాల్ప‌డి న‌కిలీ ప‌త్రాలు సృష్టించార‌ని ఆరోపిస్తూ... టీవీ 9 నూత‌న యాజ‌మాన్యం అలంద మీడియా ఎంట‌ర్ టైన్ మెంట్ ఏప్రిల్ 24న సైబ‌ర్ క్రైమ్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ర‌విప్ర‌కాశ్ - శివాజీ ఇత‌రుల‌పై సైబ‌ర్ క్రైమ్ పోలీసులు ఐపీసీ సెక్ష‌న్ 406 - 420 - 467 - 471 - 469 - 120 (బీ) కింద కేసులు న‌మోదు చేశారు. ఐటీ యాక్ట్ లోని సెక్ష‌న్ 66 - 72ల కింద కూడా కేసులు న‌మోద‌య్యాయి. ఈ వ్య‌వ‌హారంలో ఏప్రిల్ 30న అలంద మీడియా మ‌రోమారు అలంద మీడియా సైబ‌ర్ పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. ఈ సారి ర‌విప్ర‌కాశ్ పేరుతో పాటు మూర్తి అనే మ‌రో వ్యక్తి పేరును కూడా అలంద మీడియా ప్ర‌స్తావించింది.

ఈ ఫిర్యాదు ఆధారంగా సైబ‌ర్ పోలీసులు ర‌వి ప్ర‌కాశ్ - మూర్తి త‌దిత‌రులపై ఐపీసీ సెక్ష‌న్ 420 - 468 - 471 - 120 (బీ)ల కింద కేసులు న‌మోదు చేశారు. ఆ త‌ర్వాత కోర్టు ఆదేశాల మేర‌కు పోలీసులు టీవీ 9 కార్యాల‌యం - ర‌విప్ర‌కాశ్‌ - శివాజీ - మూర్తి ఇళ్ల‌లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో ప‌లు కీల‌క ప‌త్రాలు - ల్యాప్ టాప్ లు - హార్డ్ డిస్క్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో హార్డ్ డిస్క్‌ లు - ల్యాప్ టాప్ ల‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌ కు పంపేందుకు పోలీసులు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా ఆ క‌థ‌నం పేర్కొంది. ఇదీ మొత్తంగా ఇప్ప‌టిదాకా జ‌రిగిన వ్య‌వ‌హార‌మంటూ స‌ద‌రు ఛానెల్ ఓ ఆస‌క్తిక‌ర క‌థ‌నాన్ని ప్ర‌సారం చేసింది.