Begin typing your search above and press return to search.

భారత్ -పాకిస్థాన్ సరిహద్దులో సొరంగం... వెలుగులోకి మరో కుట్ర !

By:  Tupaki Desk   |   29 Aug 2020 3:00 PM GMT
భారత్ -పాకిస్థాన్  సరిహద్దులో సొరంగం... వెలుగులోకి  మరో కుట్ర !
X
పాకిస్థాన్ ... ప్రతినిత్యం భారత్ ను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది. భారత్ పై ఎదో ఒక ప్లాన్ తో ప్రతి రోజు దాడికి ప్రయత్నాలు చేస్తుంది. ఇలా పాక్ పన్నిన ఎన్నో కుట్రల్ని భగ్నం చేసింది భారత్. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో ఉన్న భారత్, పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మరో ఉగ్ర కుట్రను బీఎస్ ఎఫ్ భద్రతా బలగాలు బయటపెట్టాయి. ఆ సరిహద్దును ఆనుకుని ఓ సొరంగ మార్గం ఉన్నట్లు గుర్తించాయి. ఉగ్రవాదులు భారత్ ‌లోకి చొరబడేందుకు ఈ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

సరిహద్దు కంచె నుంచి భారత్ వైపు దాదాపు 50మీ. పొడవుతో ఆ సొరంగం ఉన్నట్లు బీఎస్ ఎఫ్ గురువారం గుర్తించింది. ఆ సొరంగ ప్రవేశం దాదాపు 25మీ...లోతు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి కేవలం 400మీ. దూరంలో పాకిస్తాన్ బోర్డర్ పోస్ట్ ఉన్నట్లు చెప్పారు. సొరంగం వెలుగుచూడటంతో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మరిన్ని సొరంగాలు ఉండే అవకాశం ఉందా అన్న అనుమానాలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్ ఎఫ్ బలగాలు సరిహద్దు వెంబడి 'మెగా-యాంటీ టన్నెల్' తనిఖీలను నిర్వహిస్తున్నాయి. ఆ సొరంగ ఉపరితలాన్ని 8-10 ప్లాస్టిక్ ఇసుక బస్తాలతో మూసినట్లు గుర్తించింది. ఆ బస్తాలపై పాకిస్తాన్‌ కు చెందిన ఆనవాళ్లను గుర్తించామని... వాటిపై 'కరాచీ.. షకర్ ‌గర్' అని రాసివున్నట్లు బీఎస్ ఎఫ్ అధికారులు తెలిపారు. వాటిపై ఉన్న తయారీ తేదీ, ఎక్స్పైరీ తేదీని బట్టి అవి ఇటీవలే మాన్యుఫాక్చర్ అయినట్లుగా గుర్తించారు.

తాజా ఉదంతంతో బీఎస్ ఎఫ్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా సరిహద్దులో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సరిహద్దు వెంబడి సొరంగాలను గుర్తించేందుకు రాడార్స్‌ ను కూడా ఉపయోగించాలని భావిస్తున్నారు. తద్వారా ఉగ్ర చొరబాట్లకు చెక్ పెట్టవచ్చునని భావిస్తున్నారు. ఇటీవలే పంజాబ్‌లోని సరిహద్దు గుండా భారత్ ‌లోకి చొరబడిన ఐదుగురిని బీఎస్ ఎఫ్ బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా గుర్తించిన సొరంగాన్ని చొరబాట్లతో పాటు ఆయుధ స్మగ్లింగ్‌కి ఉపయోగించుకునేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.