Begin typing your search above and press return to search.

‘తమ్ముళ్ల’కు కాలిపోయే మాటను అనేశాడు

By:  Tupaki Desk   |   11 Sep 2016 4:33 PM GMT
‘తమ్ముళ్ల’కు కాలిపోయే మాటను అనేశాడు
X
రాజకీయాల్లో ఒకరికొకరు మర్యాదను ఇచ్చిపుచ్చుకోవటం తగ్గిపోయి చాలా కాలమే అయ్యింది. నువ్వు ఒకటంటే.. నేను రెండు అంటానన్న రీతిలో వ్యాఖ్యలు చేయటం ఇప్పుడో అలవాటుగా మారింది. ఇక.. భావోద్వేగ అంశాలపై రగడ జరుగుతున్న వేళ.. ఎంత దూకుడుగా విమర్శలు చేస్తే అంత బాగా ఫోకస్ అయ్యే పాడు రోజులు రావటంతో.. ఎవరూ ఎక్కడా తగ్గని పరిస్థితి. కాస్త మర్యాదగా.. పద్ధతిగా మాట్లాడే వారన్న పేరున్న నేతలు సైతం మారిన కాలానికి తగ్గట్లుగా మారి నోటికి పని చెబుతున్నారు.

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత తులసి రెడ్డి తాజాగా నోరు పారేసుకున్నారు. రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా విభజన చేస్తున్నప్పుడు పార్టీపై విమర్శలు గుప్పించినప్పటికీ.. తమ అధినేతలు చేసిన తప్పుల కారణంగా ఏపీ సర్వనాశనమైందన్న విషయం తెలిసి కూడా.. సీమాంధ్రులకు ఇంత వరకూ సారీ చెప్పని ఆయన..ఏపీ అధికారపక్షంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

టీడీపీకి కొత్త పేరు పెట్టిన ఆయన.. తన మాటతో తెలుగు తమ్ముళ్లకు కాలిపోయే మాటను అనేశారు. ప్రస్తుతం టీడీపీ అంటే తెలుగు దద్దమ్మల పార్టీ అని.. కపట నాటకాలతో తెలుగు ప్రజల్ని మోసం చేస్తున్న పార్టీగా అభివర్ణించారు. తెలుగుదేశం పేరుతో ఎన్టీఆర్ స్ఠాపించిన పార్టీ ఇది కాదన్న ఆయన.. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయన్నారు. ఉద్దేశపూర్వకంగానే కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటానికి నిరాకరిస్తుందన్న ఆయన.. 14వ ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ ప్రత్యేకహోదా ఇవ్వలేకపోతున్నట్లుగా తాము చెప్పలేదన్న వ్యాఖ్యను ప్రస్తావించారు. అధికార పార్టీ సభ్యుల్ని దద్దమ్మలుగా అభివర్ణించిన తులసిరెడ్డిపై తెలుగు తమ్ముళ్లు ఎంతలా చెలరేగిపోతారో చూడాలి.