Begin typing your search above and press return to search.

కేసీఆర్ తో పెట్టుకుంటే..పొంగులేటి పరిస్థితి ఇంతే!

By:  Tupaki Desk   |   5 Jan 2023 1:45 PM GMT
కేసీఆర్ తో పెట్టుకుంటే..పొంగులేటి పరిస్థితి ఇంతే!
X
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయాల్లో అపర చాణక్యుడు టైపు. ఆయన చర్యలు ఊహించనివిధంగా ఉంటాయి. కేసీఆర్ తో పెట్టుకున్న ఆలె నరేంద్ర, విజయశాంతి నుంచి ఇప్పటి ఈటల రాజేందర్ వరకూ రాజకీయంగా ఎంతో ఇబ్బందులు పడ్డారు. చంద్రబాబు లాంటి 40 ఇయర్స్ పెద్దమనిషినే ‘ఓటుకు నోటు’లో ఇరికించి తెలంగాణ దాటించిన ఘనత కేసీఆర్ సొంతం. అలాంటి కేసీఆర్ ముందర కుప్పిగంతులు వేస్తే బీజేపీకే తేడా కొడుతోంది. ఇక సొంత పార్టీలో అసమ్మతి ఓ లెక్కనా? ఇప్పుడు ఖమ్మంలో తోకజాడిస్తున్న నేతలు కేసీఆర్ కు షాకిస్తున్నారు. ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలపొంగులో పొంగుతున్నారు. బీఆర్ఎస్ పై అసమ్మతి రాజేస్తున్నారు. ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేసీఆర్ సర్కార్ ఝలక్ ఇచ్చింది. ఇటీవల పలు సందర్భాల్లో బీఆర్ఎస్ పై అసహనం వ్యక్తం చేసిన క్రమంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కేటాయించిన భద్రతను తగ్గిస్తూ షాకిచ్చింది.

ఖమ్మం జిల్లాలో కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డికి భద్రతను తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకుముందు పొంగులేటి వద్ద 3+3 గన్‌మెన్‌లు ఉండేవారు. ప్రస్తుతం 2+2కి తగ్గించారు. అంతేకాకుండా పొంగులేటి క్యాంపు కార్యాలయం వద్ద పైలట్ సెక్యూరిటీని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్కార్ట్ వాహనాన్ని తొలగించారు. ఇంటి దగ్గర సెక్యూరిటీ సిబ్బందిని కూడా తగ్గించారు. ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్ తో పెట్టుకుంటే ఇలానే ఉంటుందన్న సంకేతాలను ఈ చర్యతో అసమ్మతులకు పంపినట్టైంది.

ఈ నెల 1న నూతన సంవత్సరం వేళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సభకు ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి పొంగులేటి అభిమానులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తన అనుచరులంతా పోటీ చేస్తారని స్పష్టం చేశారు. సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతానని వ్యాఖ్యానించారు. పొంగులేటి అడుగులు బీజేపీ వైపు పడుతున్నట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత వైసీపీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. 2019 ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి టిక్కెట్ ఇవ్వలేదు.

2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కారణమనే ఆరోపణలు ఉన్నాయి. కానీ.. ఈ ఆరోపణలను ఆయన ఖండించారు. ఆ తర్వాత ఆయనకు పదవులు దక్కుతాయని ప్రచారం జరిగింది. కానీ.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎలాంటి పదవులు ఇవ్వలేదు. ఆయన పార్టీ మారుతున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే తాను పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో.. 1న ఆత్మీయ సమ్మేళన నిర్వహించడం.. బీఆర్ఎస్ పై అసమ్మతి రాజేసేలా వ్యాఖ్యానించడంతో కేసీఆర్ తోక కట్ చేసే పనులకు పూనుకున్నారు. కేసీఆర్ పై పొంగులేటి అసమ్మతి.. ఇప్పుడు చర్యలు ఖమ్మంలో చర్చనీయాంశంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.