Begin typing your search above and press return to search.

మ‌నోళ్ల‌కు ట్రంప్ ఇచ్చిన తాజా షాక్ ఇదే

By:  Tupaki Desk   |   2 Nov 2018 8:55 PM GMT
మ‌నోళ్ల‌కు ట్రంప్ ఇచ్చిన తాజా షాక్  ఇదే
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోమారు మ‌నకు చేదుక‌బురు వినిపించారు. అగ్ర‌రాజ్యం అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ కి పెద్ద షాక్ ఇచ్చారు. కొద్దికాలంగా ట్రంప్ సర్కార్ ఉద్యోగుల నియామకాలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటుండ‌గా అదే కోవ‌లో మ‌న‌వాళ్లు పెద్ద ఎత్తున ఆధార‌ప‌డే హెచ్‌1బీ వీసాల‌పై మ‌రోమారు క‌న్నెర్ర చేశారు. తాజాగా పేర్కొన్న‌ కొత్త నియమాల ప్రకారం అమెరికా కంపెనీలు ఇకపై తమ దగ్గర పనిచేసే ఉద్యోగుల వివరాలను లేబర్ డిపార్ట్ మెంట్ కి అందజేయాల్సి ఉంటుంది. తమ సంస్థలో మొత్తం ఎందరు విదేశీయులు పని చేస్తున్నారో తప్పనిసరిగా తెలియజేయాలి. భవిష్యత్తులో అమెరికాలో పనిచేయాలనుకొనే వారికి ట్రంప్ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది.

భారతీయ ఐటీ ఉద్యోగుల నుంచి హెచ్1-బీ వీసాలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ నాన్ ఇమ్మిగ్రేంట్ వీసా ఉన్న నిపుణులైన విదేశీయులను అమెరికా కంపెనీలు ఉద్యోగాలలో నియమించేందుకు అనుమతిస్తుంది. కొత్తగా వచ్చిన నిబంధనతో లేబర్ డిపార్ట్ మెంట్ ఆమోదముద్ర వేసిన తర్వాతే హెచ్1-బీ వీసాతో కంపెనీ విదేశీ ఉద్యోగిని నియమించాల్సి వస్తుంది. దేశీయంగా ఆ ఉద్యోగానికి నైపుణ్యం గల ఉద్యోగులు లేరని నిర్థారించుకున్న తర్వాతే డిపార్ట్ మెంట్ విదేశీయుల నియామకానికి అనుమతి మంజూరు చేస్తుంది. దీంతో కొత్తగా విదేశీ ఉద్యోగులను తీసుకోవడం కష్టం అవుతుంది. ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ చర్యతో కంపెనీలకు కొత్త విదేశీ ఉద్యోగుల నియామకాలలో కష్టాలు ఎదురవుతాయని భావిస్తున్నారు. ఇప్పుడు ప్రకటించిన కొత్త నియమావళితో సంస్థలు విదేశీ ఉద్యోగులను స్పాన్సర్ చేయడం అంత సులువు కాదు.

ప్రపంచంలోనే అత్యంత వృత్తి నిపుణులుగా ఖ్యాతిపొందుతున్న భారతీయులు ప్రధానంగా హెచ్-1బీ వర్క్ వీసాలతో అమెరికాకు వస్తున్నారు. 2016లో అమెరికా ప్రభుత్వం జారీచేసిన మొత్తం హెచ్-1బీ వీసాల్లో 74.2 శాతం వీసాలు భారతీయ ఐటీ నిపుణులే దక్కించుకున్నారు. 2017లో ఈ సంఖ్య మరింత పెరిగి 75.6 శాతానికి చేరుకుంది. అమెరికా పౌరసత్వ, వలససేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్) ఈ మేర‌కు ఇటీవ‌ల గ‌ణాంకాలు వెల్ల‌డించింది. ఇంత భారీ స్థాయిలో ఉన్న వారి వెన్నులో వ‌ణుకుపుట్టేలా అమెరికా స‌ర‌కారు తాజాగా వెలువ‌రించిన ప్ర‌తిపాద‌న‌లు ఉన్నాయి.