Begin typing your search above and press return to search.

టీఆర్‌ఎస్‌ ప్లీనరీ వర్సెస్‌ చంద్రబాబు సభ!

By:  Tupaki Desk   |   14 April 2015 5:50 AM GMT
టీఆర్‌ఎస్‌ ప్లీనరీ వర్సెస్‌ చంద్రబాబు సభ!
X
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ పర్యటనకు సర్వం సిద్ధం అయ్యింది. ప్రస్తుతం బాబు ఏపీ ముఖ్యమంత్రి హోదాలో చైనా పర్యటనలో ఉండగా.. తెలుగుదేశం అధ్యక్షుడిగా ఆయన చేపట్టబోయే పాలమూరు పర్యటనకు సర్వం సిద్ధం అవుతోంది. ఈ నెల 23 వ తేదీన బాబు పాలమూరులో పర్యటించింది అక్కడే సభను కూడా నిర్వహించనున్నాడు.

విశేషం ఏమిటంటే ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీకి ఏర్పాట్లు ఊపందుకోనున్నాయి. ఈ నెల 24 వ తేదీ నుంచి టీఆర్‌ఎస్‌ ప్లీనరీ జరగనుంది. ఇదే సమయంలో బాబు తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణలో హడావుడి చేయనుంది. దీంతో పరిస్థితి టీఆర్‌ఎస్‌ ప్లీనరీ వర్సెస్‌ టీడీపీ సభ అన్నట్టుగా మారనుంది.

ఎన్నికలు అయిపోయాకా ఇప్పటికే తెలుగుదేశం అధినేత రెండు మార్లు తెలంగాణ జిల్లాల్లో పర్యటించాడు. వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో పర్యటనలను పూర్తి చేశాడు. ఇప్పుడు ఆయన పాలమూరు జిల్లాపై దృష్టిసారించాడు.

ప్రస్తుతం ఎన్నికల హడావుడి ఏమీ లేకపోయినా.. ఇలా రెండు రాజకీయ పార్టీల మధ్య ఒకేసారి సభల రూపంలో పోరాటం జరగడం విశేషమే అని చెప్పాలి. మామూలుగా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ పర్యటనకు వస్తే... టీఆర్‌ఎస్‌కే పని ఎక్కువగా ఉంటుంది. బాబు పర్యటన తీరును ఖండించడం.. బాబుకు తెలంగాణలో అడుగు పెట్టే అర్హత లేదని స్పష్టం చేయడం.. బాబుపై తీవ్రమైన విమర్శలు చేయడం వంటి వ్యవహారాల ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు హడావుడి చేస్తూ ఉంటారు.

అయితే ఈ సారి వారికి ఆ అవకాశం ఉండకపోవచ్చు.. ఎందుకంటే.. వారు ప్లీనరీ ఏర్పాట్లలో మునిగిపోనున్నారు. ఏకంగా కొన్ని లక్షల మందితో ప్లీనరీని నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి వారు ప్రకటించేశారు కాబట్టి.. ఇక బాబు సభ మీద కన్నా వీరు ప్లీనరీ మీదనే ఎక్కువ కాన్సన్‌ట్రేట్‌ చేయాల్సి ఉంటుంది!