Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ ఎంపీల‌తో క‌లిసి ఓవైసీ ఆందోళ‌న

By:  Tupaki Desk   |   7 March 2018 1:45 PM GMT
టీఆర్ ఎస్ ఎంపీల‌తో క‌లిసి ఓవైసీ ఆందోళ‌న
X
పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా మిగ‌తా రాష్ర్టాల వారితో పోలిస్తే ఢిల్లీలో తెలుగు రాష్ర్టాల ఎంపీల హ‌ల్‌చ‌ల్ కొన‌సాగుతోంది. ప్ర‌త్యేక హోదా కోసం ఏపీకి చెందిన అధికార - ప్ర‌తిప‌క్ష ఎంపీలు ఆందోళ‌న చేస్తుండ‌గా...త‌మ డిమండ్ల‌ను పేర్కొంటూ తెలంగాణ‌లో పాల‌క‌ప‌క్ష‌మైన టీఆర్ ఎస్ గ‌ళం విప్పుతోంది. పార్ల‌మెంటు స‌మావేశాలు ప్రారంభ‌మ‌యిన రోజు నుంచి మొద‌లుకొని కొన‌సాగుతున్న ఈ ఘ‌ట‌న తాజాగా బుధ‌వారం రోజు ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాల‌కు వేదిక‌గా మారింది. గులాబీ పార్టీ ఎంపీల‌తో క‌లిసి హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ ఆందోళ‌న తెలిపారు. సాక్షాత్తు పార్ల‌మెంటు వేదిక‌గా ఈ ప‌రిణామ చోటుచేసుకుంది.

తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని డిమాండ్‌చేస్తూ టీఆర్‌ ఎస్ ఎంపీలు దేశ రాజధాని ఢిల్లీలో పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. తొలిరోజైన సోమవారం లోక్‌సభను స్తంభింపజేసిన టీఆర్‌ ఎస్ ఎంపీలు.. రెండోరోజైన మంగళవారం కూడా తమ ఆందోళనను కొనసాగించారు. లోక్‌సభ లోపల - బయట నిరసన తెలిపారు. ముస్లింలు - ఎస్టీలకు విద్యాసంస్థల్లో - ఉద్యోగ కల్పనలో మరిన్ని రిజర్వేషన్లు ఇచ్చేందుకుగాను ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను 50% నుంచి 62 శాతానికి పెంచుతూ రాష్ట్ర శాసనసభ గతేడాది ఏప్రిల్‌లో చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేశారు. తమ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫారసును రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని నినదించారు. ఈ మేర‌కు ప్ల‌కార్డులు ప‌ట్టుకున్నారు. వారికి ఎంపీ అస‌దుద్దీన్ మ‌ద్ద‌తిచ్చారు.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త‌న‌య - నిజామాబాద్ ఎంపీ త‌న‌య క‌ల్వ‌కుంట్ల క‌విత‌తో పాటుగా ఆ పార్టీకి చెందిన ఎంపీల‌తో క‌లిసి ప్ల‌కార్డులు ప‌ట్టుకున్న ఓవైసీ పార్ల‌మెంటు ప్రధాన ద్వారా వ‌ద్ద ఆందోళ‌న తెలిపారు. రిజ‌ర్వేష‌న్ల క‌ల్ప‌న‌ హ‌క్కును రాష్ర్టానికి కట్ట‌బెట్టాల‌ని కోరుతూ ఈ ప్లకార్డులు ప్ర‌ద‌ర్శించారు. కాగా, అధికార పార్టీ ఎంపీల‌తో క‌లిసి ఓవైసీ ఆందోళ‌న చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.