Begin typing your search above and press return to search.

ప్రశ్న వేసి పంచ్ వేయించుకున్న టీఆర్ ఎస్ ఎంపీ

By:  Tupaki Desk   |   25 March 2021 7:30 AM GMT
ప్రశ్న వేసి పంచ్ వేయించుకున్న టీఆర్ ఎస్ ఎంపీ
X
తాజాగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీలు వేసే ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు బదులిస్తుంటారు. ప్రభుత్వాన్ని ఇరుకున పడేయటమో.. లేదంటే వారిచ్చే సమాధానం తమకు అనుకూలంగా ఉండటమో.. ఇవేమీ కాదనుకుంటే.. ప్రజల్లో నెలకొన్న సందేహాల్ని తీర్చేందుకు వీలుగా ఎంపీలు ప్రశ్నాస్త్రాల్ని సంధిస్తుంటారు. అలాంటి వేళ.. ఆచితూచి వేయాల్సిన ప్రశ్నల విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. టీఆర్ఎస్ ఎంపీకి ఎదురయ్యే పరిస్థితే ఎదురుకాక మానదు. కేంద్రం తమకు నిధులు ఇవ్వటం లేదని.. తాము అడిగినా స్పందించటం లేదనే కంప్లైంట్ మోడీ సర్కారు మీద తరచూ చేస్తుంటారు టీఆర్ఎస్ నేతలు.

అయితే.. ఈ వాదనలో నిజం లేదన్నట్లుగా బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తుంటారు. మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నా.. హైదరాబాద్ మహానగరంలోని ఎంఎంటీఎస్ సర్వీసులకు రాష్ట్రం తాను ఇవ్వాల్సిన వాటా మొత్తాన్ని కేంద్రానికి ఇవ్వని వైనంపై తరచూ ప్రశ్నలు ఎదురవుతుంటాయి. ఈ అంశంపై అధికార టీఆర్ఎస్ మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడదు. అలాంటిది గులాబీ పార్టీకి చెందిన ఎంపీ పుణ్యమా అని.. ప్రశ్న వేసి మరీ పంచ్ వేయించుకునే పరిస్థితిని తెచ్చుకున్నారు చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి.

హైదరాబాద్ ఎంఎంటీఎస్ ను ప్రైవేటుకు అప్పగించే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. అలాంటి ప్రతిపాదన ఏమీ లేదని చెప్పిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తేనే హైదరాబాద్ ఎంఎంటీఎస్ నిర్మాణ పనులు ముందుకు సాగుతాయని స్పష్టం చేవారు. ఇప్పటివరకు ప్రాజెక్టు మొదటి దశ వరకే పూర్తి చేశారు. వికారాబాద్ వరకు పొడిగించాలని ఎంపీ రంజిత్ రెడ్డి కోరగా.. అందుకు స్పందించిన రైల్వే శాఖా మంత్రి.. పనులు పూర్తి చేయటానికి అవసరమైన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేదన్నారు.

ఇప్పటికే తాము ఖర్చు చేసిన పనులకు రూ.544 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 129 కోట్లు మాత్రమే ఇచ్చిందని.. మరో రూ.415 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. ఆ నిధులు ఇచ్చాక వికారాబాద్ వరకు పొడిగించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవచ్చన్నారు. కదిలించి పంచ్ వేయించుకోవటం అంటే ఇదేనేమో? రూ.2.30లక్షల కోట్ల భారీ బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన కేసీఆర్ సర్కారు.. కేంద్రానికి ఇవ్వాల్సిన రూ.415 కోట్ల విషయంలో ఇంత సాగదీత ఎందుకు? ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తి అయ్యే విషయంలో ఆలస్యానికి కారణం టీఆర్ఎస్ సర్కారే అన్న విషయం తాజాగా మంత్రి సమాధానం స్పష్టం చేసిందని చెప్పాలి. ప్రశ్న వేసి మరీ ఇరుకున పడటం అవసరమా రంజిత్ రెడ్డి?