Begin typing your search above and press return to search.

తెలంగాణకు మోడీ ‘పసుపు బోర్డు’ తోఫా

By:  Tupaki Desk   |   5 Aug 2016 5:00 AM GMT
తెలంగాణకు మోడీ ‘పసుపు బోర్డు’ తోఫా
X
ప్రధానమంత్రిగా భాద్యతలు చేపట్టిన 25 నెలల తర్వాత తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రానికి ఏం ఇవ్వనున్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది. తొలిసారి తన పర్యటనను తియ్యటి గురుతుగా మార్చేందుకు మోడీ సిద్ధంగా ఉన్నారా? అన్నది ఒక ప్రశ్నగా వినిపిస్తోంది. ప్రధాని లాంటి వారు రాష్ట్రాలకు వచ్చిన సందర్భంగా ఏదో ఒక వరాన్ని ప్రకటించటం మామూలే. తాజాగా మోడీ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
రాష్ట్రానికి రోజుల వ్యవధిలో వస్తున్న వేళ.. తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె.. కమ్ ఎంపీ కవిత ప్రధానిని కలవటం.. తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న తమ పాత పాటను వినిపించటం చూసినప్పుడు ఈ వ్యవహారం కాస్త ఆసక్తికరంగా కనిపించక మానదు.ఎందుకంటే..తెలంగాణకు సంబంధించినంత వరకూ పసుపు బోర్డు ఏర్పాటు లాభం కలిగించేదే అయినా.. అదే కీలకం కాదన్నవిషయం తెలిసిందే. హైకోర్టు విభజన.. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు లాంటి కీలక అంశాల్ని వదిలేసి.. తెలంగాణకు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని.. తెలంగాణలో బోర్డు ఏర్పాటు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదంటూ మహారాష్ట్ర.. కేరళ ముఖ్యమంత్రులు ఇచ్చిన మద్ధతు లేఖల్ని ప్రధాని మోడీకి ఎంపీ కవిత అందజేయటం గమనార్హం.

రాజకీయ వర్గాల అంచనా ప్రకారం.. తన తొలి తెలంగాణ రాష్ట్ర పర్యటన సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి పసుపు బోర్డును మోడీ ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉన్న నేపథ్యంలో.. గతంలో ఇదే అంశంపై ప్రధానిని కలిసిన కవిత మరోసారి కలవటం ద్వారా.. రేపొద్దున మోడీ నోటి నుంచి పసుపుబోర్డు మాట వస్తే.. మైలేజీ తమ ఖాతాలో వేసుకోవచ్చన్న ముందుచూపుతో తాజాగా ప్రధానిని కలిసి వినతిపత్రం అందించినట్లుగా చెబుతున్నారు. మరి.. ఈ వాదనలో నిజం పాళ్లు ఎంతన్నది తేలాలంటే మోడీ తెలంగాణ పర్యటన వరకూ వెయిట్ చేస్తే తెలిసిపోతుంది.