Begin typing your search above and press return to search.

కొత్త చ‌రిత్ర‌ను చెప్తున్న కోదండ‌రాం

By:  Tupaki Desk   |   10 Dec 2016 7:33 PM GMT
కొత్త చ‌రిత్ర‌ను చెప్తున్న కోదండ‌రాం
X
తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్‌గా ఉన్న కోదండ రాంపై టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ మ‌రోమారు మండిప‌డ్డారు. విద్యార్థుల త్యాగాల వల్లే తెలంగాణ వచ్చిందని కోదండరాం పేర్కొనడాన్ని సుమ‌న్ తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. సీఎం కేసీఆర్ పేరును కోదండరాం కావాలని విస్మరిస్తున్నారని మండిపడ్డారు. కోదండరాం కావాలనే చరిత్రను దాస్తున్నారని పేర్కొన్నారు. అలా కోదండ‌రాం కొత్త చ‌రిత్ర‌ను చెప్తున్నందుకే తాను మాట్లాడ‌వ‌ల్సి వ‌స్తుంద‌ని సుమ‌న్ అన్నారు.

ప్రొఫెస‌ర్ గా ఉన్న కోదండ‌రాంను తీసుకువ‌చ్చి తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌గా చేసిందే సీఎం కేసీఆర్ అని సుమ‌న్ పున‌రుద్ఘాటించారు. అలాంటి ఉద్య‌మ‌నాయ‌కుడిని ప‌క్క‌న‌పెట్టేసి విద్యార్థులు ఒక్క‌రిదే క్రెడిట్ అన్న‌ట్లుగా మాట్లాడ‌టం కోదండ‌రాం కు స‌రికాద‌ని అన్నారు. టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ ఎంతో మంది విద్యార్ధి నాయకులను తయారు చేసిన విషయాన్ని సుమ‌న్ గుర్తు చేశారు. తాను కూడా అలాంటి వాళ్లలో ఒకడినని పేర్కొన్నారు. ఇదిలాఉండ‌గా...రాష్ట్ర మంత్రి కేటీఆర్ సెల్పీలపై రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడం అర్థరహితమన్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబులు సెల్పీలు దిగడంలేదా? అని సుమ‌న్‌ నిలదీశారు. రేవంత్‌రెడ్డి తన కొండగల్ నియోజకవర్గానికి ఏం చేసుకున్నారో చెప్పుకుంటే మంచిదని సూచించారు. మ‌రోవైపు నానక్‌రాంగూడలో బిల్డింగ్ కూలిక ఘటనపై కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని బాల్కసుమన్ మండిపడ్డారు. ఈ ఘటనలో యజమానిని ఇప్పటికే అరెస్ట్ చేశామని, బాధ్యులైన అధికారులను కూడా సస్పెండ్ చేశామన్నారు. మంత్రి కేటీఆర్‌ దగ్గరుండి సహాయ చర్యలను పర్యవేక్షించారని తెలిపారు. కాంగ్రెస్ నేతలు శవాలపై పేలాలు ఏరుకునే ప్రయత్నం చేస్తున్నారని బాల్కసుమన్ మండిపడ్డారు.