Begin typing your search above and press return to search.

కోదండ‌రాం కొలువుల కొట్లాట‌..ముందున్న స‌వాళ్లు ఇవి

By:  Tupaki Desk   |   3 Dec 2017 1:30 AM GMT
కోదండ‌రాం కొలువుల కొట్లాట‌..ముందున్న స‌వాళ్లు ఇవి
X
కొలువుల కొట్లాట పేరుతో డిసెంబర్ 4వ‌ తేదీన సరూర్‌ నగర్‌ ఎల్బీనగర్‌ స్టేడియంలో సభ నిర్వ‌హించేందుకు తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం స‌ర్వం సిద్ధం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. త‌న స‌భ‌కు సంఘీభావం తెల‌పాలంటూ...ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ స‌హా - బీజేపీ - టీడీపీ ముఖ్య నేత‌ల‌ను కోదండ‌రాం క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ఇలా ఓ వైపు త‌న స‌భ‌కు ఏర్పాట్లు చేసుకుంటుండ‌గా...మ‌రోవైపు జేఏసీ చైర్మ‌న్‌ కు ఈ స‌మావేశానికి ముందే ప‌లు స‌వాళ్లు ఎదుర్కోవాల్సి వ‌స్తోందని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఇందులో ముఖ్య‌మైన‌ది అధికార టీఆర్ ఎస్ పార్టీ నుంచి వ‌చ్చే ఎదురుదాడిని త‌ట్టుకోవ‌డ‌మ‌ని పేర్కొంటున్నారు.

తాజాగా అధికార టీఆర్ ఎస్ పార్టీకి చెందిన ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు తెలంగాణ జేఏసీ చైర్మ‌న్‌ పై - ఆయ‌న నిర్వ‌హిస్తున్న కొలువుల కొట్లాట కార్య‌క్ర‌మంపై విరుచుకుప‌డ్డారు. రాజకీయ దురుద్దేశంతోనే ఆందోళనలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కోదండరాం చేస్తున్నది కొలువుల కొట్లాట కాదు.. ఆయన కొలువు కోసం కొట్లాడుతున్నాడని టీఆర్‌ ఎస్ ఎమ్మెల్సీ - ప్ర‌భుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి విమర్శించారు. ఉద్యోగాల భర్తీకి టీఆర్‌ ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీ విషయంలో కోదండరాం అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.

కేంద్రంలో అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందని గుర్తు చేస్తూ...కోదండరాం బీజేపీపై పోరాటం చేయకుండా.. ఆ పార్టీ మద్దతు కోరుతారా? అని టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ ప్ర‌శ్నించారు. రాష్ట్రం కన్నా దేశంలో నిరుద్యోగ శాతం అధికంగా ఉందని తెలిపారు. దేశంలో నిరుద్యోగ వృద్ధి రేటు 3.7 శాతంగా ఉంటే.. తెలంగాణలో కేవలం 2.7 శాతం మాత్రమే ఉందన్నారు. లక్షా 12 వేల ప్రభుత్వ ఉద్యోగాలను గుర్తించాం. ఉద్యోగాల భర్తీపై ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చిచెప్పారు.

కాగా, టీఆర్ ఎస్ పెద్ద‌ల‌కు స‌న్నిహితుడ‌నే పేరున్న ఎంపీ బాల్క సుమన్ సైతం ప్రొఫెస‌ర్ కోదండ‌రాంపై మండిప‌డ్డారు. నిరుద్యోగుల భుజాలపై తుపాకులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాల్చాలని కోదండరాం కుట్ర పన్నారని నిప్పులు చెరిగారు. నిరుద్యోగులు కోదండరాం వలలో చిక్కుకుని భవిష్యత్‌ ను పాడు చేసుకోవద్దని కోరారు. టీఎస్‌ పీఎస్సీ సిలబస్ కమిటీలో కోదండరాంకు చోటు కల్పించిన విషయం మరిచిపోవద్దని సూచించారు. ఉద్యోగాల భర్తీపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పదిహేను రోజులకో సారి సమీక్ష చేస్తున్నారని సుమన్ స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీలో ఆలస్యానికి విపక్షాల కేసులే కారణమని పేర్కొన్నారు. వందకు వంద శాతం లక్షా 12 వేల ఉద్యోగాలను భర్తీ చేసి తీరుతామని ఉద్ఘాటించారు.