Begin typing your search above and press return to search.

నామినేటెడ్ పదవులకూ ఎమ్మెల్యేల పోటీ

By:  Tupaki Desk   |   11 Oct 2015 3:35 PM GMT
నామినేటెడ్ పదవులకూ ఎమ్మెల్యేల పోటీ
X
నామినేటెడ్ పదవుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న టీఆరెస్ నాయకులకు మళ్లీ ఉత్సాహం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో నామినేటెడ్‌ పదవుల పందేరానికి కేసీఆర్ రెడీ అవుతుండడంతో క్యాడర్ ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. ఇటీవల తెలంగాణ భవన్‌ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష పార్టీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ పలు కార్పొరేషన్లు - వ్యవసాయ మార్కెట్లు - దేవాలయాలకు కమిటీలకు పాలకమండళ్లను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ లతో పాటు వివిధ స్థాయిల్లో భర్తీ చేయాల్సిన పదవులకు సంబంధించి అభ్యర్థులను అన్వేషించాలని మంత్రులు, ఎమ్మెల్యేలను కేసీఆర్‌ ఆదేశించారు. దీంతో పదవుల భర్తీపై కసరత్తు ముమ్మరమైంది. అయితే.. ఈసారి నామినేటెడ్ పదవుల కోసం ఎమ్మెల్యేల నుంచి పోటీ తీవ్రంగా ఉంది.

టీఆర్‌ ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి యేడాదిన్నర కావొస్తున్నా.. ఒకట్రెండు కార్పొరేషన్లకు మాత్రమే చైర్మన్‌ లను నియమించింది. ఇంకా చాలా వాటికి భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆశావహుల్లో ఉత్సాహం నెలకొంది. దీంతో ఎవరికి వారు అధినాయకుడితోపాటు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే పలు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ లకు ఐదారుగురు ఎమ్మెల్యే లను నియమిస్తామని కూడా ముఖ్య మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యేలు సైతం లాబీయింగ్‌ చేస్తూ బిజీగా ఉన్నారు. మంత్రి పదవిని ఆశించి భంగపడిన కొందరు ఎమ్మెల్యేలు ఈ రేసులో ముందు వరుసలో ఉన్నారు. వీరు ప్రభుత్వంలో కీలకమైన మంత్రుల సహకారంతో పదవులు పొందేందుకు పావులు కదుపుతున్నారు. అదేవిధంగా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుని టికెట్‌ రానివారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.

భర్తీ చేయాలనుకుంటున్న కార్పొరేషన్లలో ప్రధానంగా హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌ మెంట్‌ అథారిటీ (హెచ్‌ ఎండీఏ), రోడ్డు రవాణా సంస్థ (ఆర్‌ టీసీ), ట్రైకార్‌ (గిరిజన), స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ స్టేట్‌ (సాట్స్‌), తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఐఐసీ), స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌, స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ ఎఫ్‌ సీ), మినరల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ ఎండీసీ), బీసీ కార్పొరేషన్‌ - ఫిల్మ్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌ డీసీ), మైనారిటీ కార్పొరేషన్‌(వక్ఫ్‌ బోర్డు), హస్తకళల అభివృద్ధి సంస్థ, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లు ఉన్నాయి. ఈ కార్పొరేషన్ల చైర్మన్‌ పదవుల కోసం పెద్దమొత్తంలో పోటీపడుతున్నారు.

హెచ్‌ఎండీఏ చైర్మన్‌ పదవికి మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బొంతు రామ్మోహన్‌ - కూకట్‌ పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పద్మారావు, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ నాయకుడు శంబీపూర్‌ రాజు తదితరులు పోటీపడుతున్నారు.

టీఎస్‌ ఆర్‌ టీసీ చైర్మన్‌ రేసులో ఉన్నవారి జాబితా చాంతాడుంది. కోరుట్ల ఎమ్మెల్యే కె.విద్యాసాగర్‌ రావు, సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ పార్టీ అధినేత కేసీఆర్‌కు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉంటూ వస్తున్న కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లికి చెందిన చిరుమల్ల రాజేశ్‌ ఉన్నారు. అయితే విద్యా సాగర్‌ రావుకే ఈ పదవి ఖాయమైందని అప్పట్టో ప్రచారం జరిగింది. కావేటి సమ్మయ్య సైతం అధినాయకుడిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది. అటవీ - బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న జోగు రామన్నను ప్రత్యేక పరిస్థితుల్లో కేబినెట్‌ నుంచి తప్పించి ఆర్‌ టీసీ పగ్గాలు అప్పగించాలనే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

గిరిజన సంక్షేమానిక సంబంధించిన గిరిజన కార్పొ రేషన్‌ (ట్రైకార్‌) చైర్మన్‌ పదవికి పలువురు ఎమ్మెల్యేలతోపాటు ఓ మాజీ ఎమ్మెల్యే సైతం పోటీలో ఉన్నారు. రేసులో ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు - రెడ్యానాయక్‌ - మాజీ ఎమ్మెల్యే సత్యవతిరాథోడ్‌ ఉన్నారు.

ఇలా పలు పదవులకు ఎమ్మెల్యేలు - మాజీ ఎమ్మెల్యేలు పోటీ పడుతుండడంతో ఆ పదవులను ఆశిస్తున్న ఇతర నాయకులు మండిపడుతున్నారు. మంత్రి పదవులు రాలేదన్న కారణంతో ఎమ్మెల్యేలు వీటికి పోటీపడుతుంటే తమ పరిస్థితి ఏంటని అంటున్నారు.