Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే మాటః బీజేపే అధికారంలో ఉండాలి

By:  Tupaki Desk   |   17 March 2016 5:30 PM GMT
ఎమ్మెల్యే మాటః బీజేపే అధికారంలో ఉండాలి
X
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా హైద‌రాబాద్‌ లోనే దాదాపు నెల‌రోజులు తిష్ట‌వేయాల్సిన ప‌రిస్థితుల్లో మీడియా మిత్రుల‌తో ఎమ్మెల్యేలు మ‌న‌సు విప్పి మాట్లాడుతున్నారు. అసెంబ్లీ లాబీల్లో ఇష్టాగోష్టిగా ముచ్చ‌టిస్తున్న ఎమ్మెల్యేలు త‌మ, ప‌ర బేధం లేకుండా విలేకరుల‌తో మ‌న‌సులో మాట‌ను వెల్లడించేస్తున్నారు. తాజాగా అధికార టీఆర్ ఎస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండ‌ట‌మే క‌రెక్ట్ అని తేల్చేయ‌డం గ‌మ‌నార్హం.

హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ భార‌త్‌ మాతాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ కామెంట్ల‌ను ఉద్దేశిస్తూ క‌రీంన‌గ‌ర్‌ కు చెందిన ఓ యువ ఎమ్మెల్యే తీవ్రంగా మండిప‌డ్డారు. మ‌త రాజ‌కీయాలు చేయ‌డంలో ముందుండే ఓవైసీలు ఇపుడు దేశంలో చీలిక‌లు తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఫైర్ అయ్యారు. అంతగా ఆయ‌న‌కు భార‌త‌మాత న‌చ్చ‌కుంటే మ‌రే మాత ఇష్ట‌మో చెప్పాల‌ని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్య‌క్తుల ఆట క‌ట్టించేందుకు దేశ‌భ‌క్తి ఉన్న బీజేపీ అధికారంలో ఉండ‌ట‌మే క‌రెక్ట్ అని తేల్చేశారు. కాంగ్రెస్ కానీ ఇత‌ర కూట‌ములు ఏవీ అధికారంలోకి వ‌చ్చినా లౌకిక‌త్వం పేరుతో ముస్లిం చాంద‌స‌వాదుల‌ను దువ్వేందుకు ప్ర‌య‌త్నిస్తాయ‌ని మండిప‌డ్డారు.

ఇంతేకాకుండా వామ‌ప‌క్షాల ఉనికిని కూడా ఆ ఎమ్మెల్యే వివ‌రించారు. వామ‌ప‌క్షాలు అడ‌పాద‌డ‌పా అయినా జెండాలు ప‌ట్టుకోక‌పోతే ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండే వాళ్లుండ‌ర‌ని స‌ద‌రు టీఆర్ ఎస్ యువ ఎమ్మెల్యే సూత్రీక‌రించారు. అంతేకాకుండా వాళ్లు జెండాలు ప‌ట్టుకోకుంటే త‌మ‌కు సైతం స‌మ‌స్య‌లు తెలియ‌వ‌ని చ‌మ‌త్క‌రించారు.