Begin typing your search above and press return to search.

త్రిపుల్ త‌లాక్ బిల్లుకు పార్ల‌మెంట్ ఆమోదం

By:  Tupaki Desk   |   27 Dec 2018 2:50 PM GMT
త్రిపుల్ త‌లాక్ బిల్లుకు పార్ల‌మెంట్ ఆమోదం
X
సుదీర్ఘ చ‌ర్చోప‌ చ‌ర్చ‌ల అనంత‌రం ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. లోక్ సభలో ఇవాళ కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టగా..పలువురు సభ్యులు బిల్లుపై చర్చ సందర్భంగా తమ అభ్యంతరాలను వినిపించారు. అనంతరం ట్రిపుల్ తలాక్ బిల్లుపై పార్లమెంట్ లో ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 245 మంది సభ్యులు ఓటింగ్ వేయగా..వ్యతిరేకంగా 11 మంది ఓటింగ్ వేశారు. ఆ తర్వాత స్పీకర్ సుమిత్రా మహాజన్ బిల్లుకు ఆమోదం లభించిందని ప్రకటించారు. ఓటింగ్ సమయంలో కాంగ్రెస్ - అన్నాడీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి.

లోక్ సభలో ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రవేశపెట్టారు. చ‌ర్చ సంద‌ర్భంగా లోక్‌ సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్ బిల్లుపై కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చర్చ సందర్భంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ..ట్రిపుల్ తలాక్ బిల్లు చాలా ముఖ్యమైందన్నారు. కీలకమైన ట్రిపుల్ తలాక్ బిల్లుపై అధ్యయనం అవసరమన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లును జాయింట్ సెలెక్ట్ కమిటీకి పంపాలని విజ్ఞప్తి చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లు చర్చ సందర్భంగా లోక్ సభలో గందరగోళం నెలకొంది. ట్రిపుల్ త‌లాక్ బిల్లుతో మ‌హిళా సాధికార‌త సాధ్య‌మ‌వుతుంద‌ని బీజేపీ ఎంపీ మీనాక్షీ లేఖి తెలిపారు. విడాకులు ఇచ్చే ప‌ద్ధ‌తినే ఎందుకు వ్య‌తిరేకిస్తున్నార‌ని ఆమె ప్ర‌శ్నించారు. ట్రిపుల్ త‌లాక్ బిల్లును రాజ‌కీయ దురుద్దేశంతో తీసుకువ‌స్తున్నార‌ని కేర‌ళ ఎంపీ ప్రేమ్‌ చంద్ర‌న్ ఆరోపించారు. 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని బిల్లును రూపొందించిన‌ట్లు ఆయ‌న విమ‌ర్శించారు. చాలా బ‌ల‌హీనంగా బిల్లును డ్రాఫ్ట్ చేశార‌న్నారు. త‌లాక్‌ను నేరంగా ఎలా ప‌రిగ‌ణిస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కేవ‌లం ముస్లింల‌కేనా - హిందువులు క్రిస్టియ‌న్ల‌కు ఇది ఎందుకు వ‌ర్తించ‌ద‌ని ఆయ‌న అడిగారు. జాయింట్ సెల‌క్ట్ క‌మిటీకి బిల్లును పంపాల‌ని ఆయ‌న స్పీక‌ర్‌ను డిమాండ్ చేశారు. భ‌ర్త‌ను మూడేళ్లు జైలులో వేస్తే - అప్పుడు భార్య‌కు మెయింటెనెన్స్ ఎవ‌రు ఇస్తార‌ని ప్ర‌శ్నించారు. సుప్రీం ఇప్ప‌టికే ట్రిపుల్ త‌లాక్ విధానాన్ని కొట్టిపారేసింది క‌నుక‌ - దీని అవ‌స‌రం లేద‌న్నారు.

ట్రిపుల్ త‌లాక్‌ మ‌త‌ప‌ర‌మైన అంశం కాదని న్యాయ‌శాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ అన్నారు. ఇది తీవ్ర ఆవేద‌న చెందుతున్న మ‌హిళ‌ల అంశమ‌ని ఆయ‌న తెలిపారు. ఈ బిల్లు మాన‌వ‌త్వాన్ని చాటుతుంద‌ని - స‌మాన హ‌క్కులు - గౌర‌వం కోసం పోరాడుతున్న అనేక మంది సోద‌రీమ‌ణుల‌కు ఇది చెందుతుంద‌ని మంత్రి ర‌విశంక‌ర్ తెలిపారు. ట్రిపుల్ త‌లాక్ కేసులు దేశ‌వ్యాప్తంగా ఉన్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ట్రిపుల్ త‌లాక్‌ ను రాజ‌కీయ అంశంగా చూడ‌రాద‌న్నారు.