Begin typing your search above and press return to search.

ఏలూరు గ్రౌండ్ రిపోర్టు: త్రిముఖ పోరులో గెలుపెవరిది?

By:  Tupaki Desk   |   19 March 2019 11:49 AM GMT
ఏలూరు గ్రౌండ్ రిపోర్టు: త్రిముఖ పోరులో గెలుపెవరిది?
X
అసెంబ్లీ నియోజకవర్గం : ఏలూరు
టీడీపీ : బాడేటి బుజ్జి
వైసీపీ : ఆళ్ల నాని
జనసేన : రెడ్డి అప్పలనాయుడు
------------------------------------

పశ్చిమ గోదావరి జిల్లాలో ఆది నుంచి టీడీపీ హవా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ వ్యూహ్మాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రధానంగా టీడీపీకి కంచుకోటగా ఉన్న ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంపై వైసీపీ అధినేత జగన్ ప్రధానంగా దృష్టిపెట్టారు. ఇక్కడి వర్గ విభేదాలను ఒక్క నిర్ణయంతో చెక్ పెట్టారు. ఇప్పుడా నిర్ణయమే ఏలూరులో వైసీపీకి విజయం దక్కేలా చేస్తోంది.

*ఎవరికి గెలుపు అవకాశాలు?
సీనియర్ రాజకీయ నాయకుడు, అందరినీ కలుపుకొని పోతారనే పేరు వైసీపీ ఏలూరు అభ్యర్థి ఆళ్ల నానికి ఉంది. ప్రజలపైన ప్రభావం చూపిస్తారనే ఉద్దేశంతోనే జగన్.. ఆళ్ల నానికి పగ్గాలు అప్పగించారు. దీంతో ఇక్కడ వైసీపీ జోరు పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో టీడీపీకి బలమైన ప్రత్యర్థిగా వైసీపీ ఆళ్ల నానిని దించింది. టీడీపీని ఎదురించే శక్తి కూడా నాని వల్ల జగన్ కు వచ్చింది. అయితే ఇక్కడ బలమైన నాయకుడిగా ఉన్న బడేటి బుజ్జిని అలియాస్ కోట రామారావును ఆళ్ల నాని నిలువరిస్తాడా లేదా అన్నది ప్రధాన సందేహంగా మారింది. టఫ్ ఫైట్ లో ఆళ్ల నానికే ఎక్కువ అవకాశాలున్నాయని తేలింది.

ఇక ఏలూరు అసెంబ్లీ పరిధిలో కాపు ఓట్లు ఎక్కువ. అందుకే జనసేన కూడా ఇక్కడ పోటీ పెట్టింది. కాపు సామాజికవర్గానికి చెందిన రెడ్డి అప్పల నాయుడు బరిలో ఉన్నారు. నిజానికి ఈ సీటుపై పవన్ కళ్యాణ్ కూడా పోటీచేస్తాడని వార్తలొచ్చాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న కాపు ఓట్లతో ఈజీగా పవన్ గెలువవచ్చని రిపోర్టులు అందాయి. కానీ ఎందుకో జనసేనాని పవన్ ఇక్కడికి మొగ్గు చూపలేదు. నియోజకవర్గంలో కాపు సామాజికవర్గంలో బలమైన నేతగా ఉన్న రెడ్డి అప్పలనాయుడును బరిలో దించాడు.

*ఏలూరు అసెంబ్లీ చరిత్ర
ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆళ్ల నాని ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. వైఎస్ ఆశీస్సులతో 2004లో ఏలూరులో పోటీ చేసి గెలిచారు. 2004లో టీడీపీ అభ్యర్థి మారండి రంగారావును ఆళ్ల నాని 33వేల ఓట్ల మెజార్టీతో ఓడించారు. ఇక ఆ తర్వాత 2009 నాటికి టీడీపీలోకి బడేటి బుజ్జి ఎంట్రీ ఇచ్చారు. స్థానికంగా మంచి పేరు సంపాదించిన బుజ్జికీ టికెట్ ఇచ్చి గెలిపించుకుందామని చంద్రబాబు భావించారు. అయితే అనూహ్యంగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో ఆ పార్టీలోకి జంప్ చేసిన బుజ్జి టికెట్ సంపాందించుకున్నా సరైన పోటీ ఇవ్వలేకపోయారు. అప్పటి పోటీలోనూ ఆళ్ల నాని గెలుపొందారు.2004లో వచ్చిన మెజారిటీని ఆయన కైవసం చేసుకోలేదు. కేవలం 13 వేల సీట్ల మెజారిటీకే పరిమితమయ్యారు.

2014 కు వచ్చేసరికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల నాని పార్టీ మారి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ప్రభావం ఆయనపై పడలేదు. ఫలితంగా అప్పటికే టీడీపీలోకి వచ్చి చంద్రబాబు ఆశీస్సులతో బుజ్జి టికెట్ పొంది పోటీచేశారు. బుజ్జి కి టీడీపీ అనుకూలత కలిసి వచ్చి ఆళ్ల నానిపై భారీ విజయం సాధించారు.

ఇక అప్పటి నుంచి ఆళ్ల నాని తెరమరుగయ్యారు. అయితే ఆళ్ల నాని ప్రభావాన్ని గుర్తించిన జగన్.. ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించాడు. ఏలూరు నుంచి గట్టి వ్యక్తిని నిలబెట్టాలని ఆళ్ల నానికే అవకాశం ఇచ్చారు.

* జనసేనకు చాన్స్
ఏపీ రాజకీయాల్లో కుల ఫ్యాక్టర్ ఖచ్చితంగా పనిచేస్తుంది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరిల్లో ఈ ప్రభావం ఎక్కువ. అందుకే ఏలూరు బరిలో జనసేన కాపు సామాజికవర్గం నేత రెడ్డి అప్పలనాయుడిని బరిలో దింపింది. ఏలూరు లో మంచి పేరు, పలుకుబడి ఆయన సామాజకవర్గంలో ఉంది. దీంతో కాపులంతా అప్పలనాయుడికి ఓటేస్తే ఆయన గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే తాజాగా 2019 ఎన్నికల వేళ టీడీపీలో ఏలూరు నియోజకవర్గంలో వర్గం పోరు పెరగడం, టికెట్ కోసం కీచులాడుకోవడంతోనే నేతలు పరిమితమయ్యారు. దీంతో బలమైన ఆళ్ల నానిపై పోటీకి మరోసారి బుజ్జిని టీడీపీ బరిలోకి దింపింది. కానీ టికెట్ కోసం ఆశించి భంగపడ్డ నేతలు బుజ్జిని తీవ్రంగా వ్యతిరేకేస్తున్నారు. కింది స్థాయి టీడీపీ కేడర్ కూడా బుజ్జిని వ్యతిరేకిస్తోంది. ఇది వైసీపీ అభ్యర్థి ఆళ్ల నానికి అనుకూలంగా ఉంది. అయితే జనేసేన అభ్యర్థిని తక్కువ అంచనావేయడానికి వీల్లేదు. ఆ కాపులు ప్రభావం చూపితే ఏమైనా జరగొచ్చు. సో ఏలూరులో ప్రస్తుతానికి త్రిముఖ పోరు నెలకొందని చెప్పవచ్చు.