Begin typing your search above and press return to search.

పబ్‌జీ పై బ్యాన్...చైనా కంపెనీకి లక్ష కోట్లు లాస్

By:  Tupaki Desk   |   3 Sep 2020 6:00 PM GMT
పబ్‌జీ పై బ్యాన్...చైనా కంపెనీకి లక్ష కోట్లు లాస్
X
దేశ భద్రతకు ముప్పు వాటిల్లడం, డేటా గోప్యత ఆందోళనల నేపథ్యంలో పబ్జీ సహా 118 చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. భారత్ వ్యాప్తంగా 14 కోట్ల మంది యూజర్లు పబ్జీ ఆడుతున్నారని ఓ అంచనా. పబ్ జీకి భారత్ ఓ అతిపెద్ద మార్కెట్. పబ్జీపై నిషేధం విధించడంతో పబ్జీ సహా పలు యాప్ లను రూపొందించిన టెన్సెంట్‌కు భారీ నష్టం వాటిల్లిందని మార్కెట్ నిపుణులు అంచనా. పబ్జీపై బ్యాన్ వల్ల టెన్సెంట్ దాదాపు లక్ష కోట్ల రూపాయలు (14 బిలియన్ డాలర్లు) నష్టం వాటిల్లి ఉంటుందని, ఇది ఆ సంస్థకు పెద్ద దెబ్బ అని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బ్యాన్ తరువాత టెన్సెంట్ షేరు విలువ 2 శాతం పడిపోయిందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు, పబ్జీ సహా 118 చైనా యాప్‌లను భారత్‌ నిషేధించడంపై చైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ బ్యాన్ వల్ల తమ ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోయారని, అది తమ ఇన్వెస్టర్ల హక్కులను ఉల్లంఘించడమేనని చైనా వాదిస్తోంది. ఈ నిషేధం నిర్ణయంతో చైనా ఇన్వెస్టర్లు, సర్వీస్‌ ప్రొవైడర్ల చట్టబద్ధ ప్రయోజనాలకు భారత్ విఘాతం కలిగించిందని చైనా ఆరోపించింది. ఈ నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నామని, భారత్‌ నిర్ణయం విచారకరమని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి గో ఫెంగ్‌ అన్నారు. కాగా, బైడు, బైడు ఎక్స్‌ప్రెస్‌ ఎడిషన్‌, అలీపే, టెన్సెంట్‌ వాచ్‌లిస్ట్‌, ఫేస్‌యూ, విచాట్‌ రీడింగ్‌, క్యామ్‌కార్డ్‌ సహా పలు యాప్‌ లతో సహా 224 చైనా యాప్ లను భారత్ నిషేధించింది. కాగా, భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలోనే భారత్ ఈ బ్యాన్ విధించిందన్న వాదనలు కూడా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.