Begin typing your search above and press return to search.

మోడీ కేబినెట్ విస్తరణలో కీలకమైన టాప్ 5 అంశాలు

By:  Tupaki Desk   |   8 July 2021 4:48 AM GMT
మోడీ కేబినెట్ విస్తరణలో కీలకమైన టాప్ 5 అంశాలు
X
అనుకున్నట్లే.. అంచనాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో కేంద్రంలోని మోడీ సర్కారు తన మంత్రివర్గాన్ని విజయవంతంగా విస్తరించింది. విస్తరణకు ముందు బయటకు వచ్చిన పేర్లతో పాటు.. విస్తరణ వ్యూహాన్ని పలువురు విశ్లేషించారు. దాదాపుగా అదే తీరులో మోడీ నిర్ణయాలు ఉండటం గమనార్హం. అందరూ అంచనాలకు తగ్గట్లే.. మహారాష్ట్ర.. కర్ణాటక.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ప్రాధాన్యత లభించింది. విస్తరణలో మోడీ మార్కు కొట్టొచ్చినట్లు కనిపించింది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న కీలక రాష్ట్రాలైన గుజరాత్.. ఉత్తప్రదేశ్ లకు పెద్ద పీట వేయటం కనిపిస్తుంది. గవర్నర్ గా పంపిన గెహ్లోత్ తో సహా మొత్తం 12 మంది మంత్రుల్ని తొలగించిన మోడీ.. 43 మందిని కొత్తగా చేర్చుకున్నారు. ఇప్పటికే మంత్రివర్గంలో భాగస్వామ్యం ఉన్న ఏడుగురికి కేబినెట్ హోదా కల్పించారు. తాజాగా జరిగిన విస్తరణలో కీలకమైన ఐదు అంశాల్ని చూస్తే..

1. వారికి పెద్దపీట.. మిగిలిన వారికి మొండి చేయి

తాజా విస్తరణ జరిగిన తర్వాత పదవుల పంపకాల్ని రాష్ట్రాల వారీగా చూస్తే.. కొన్ని రాష్ట్రాలకు అమితమైన ప్రాధాన్యతను కల్పిస్తే.. మరికొన్ని రాష్ట్రాల్ని లైట్ తీసుకున్న వైనం కనిపిస్తుంది. అత్యధికంగా యూపీ నుంచి తొమ్మిది మందికి మంత్రి పదవులు లభించాయి. తర్వాతి స్థానంలో గుజరాత్ నిలుస్తుంది. ఈ రాష్ట్రానికి చెందిన ఐదుగురికి చోటు లభించింది. అదే సమయంలో మహారాష్ట్ర.. బెంగాల్.. కర్ణాటక రాష్ట్రాలకు పెద్ద పీట వేశారు. ఒక్కో రాష్ట్రానికి నలుగురు చొప్పున ప్రాతినిధ్యం కల్పించారు. దక్షిణాదికి చెందిన ఆంధ్రప్రదేశ్..కేరళ రాష్ట్రాలకు చోటు లభించలేదు. పంజాబ్ కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది.

తెలంగాణ నుంచి కొత్త వారికి అవకాశం కల్పించకున్నా.. ఇప్పటికే డిప్యూటీ కేబినెట్ మంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డికి ప్రమోషన్ కల్పించారు. ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ.. నాగాలాండ్.. సిక్కింలకు కూడా చోటు దక్కలేదు. ఇటీవల రెండు ముక్కలైన ఎల్ జేపీ చీలిక వర్గం నేత దివంగత రామ్ విలాస్ పాశవాన్ తమ్ముడుపశుపతి కుమార్ కు కేబినెట్ పదవులు దక్కాయి. యూపీలో అప్నాదళ్ మహిళా నేత అనుప్రియ పటేల్ కు చోటు దక్కింది.

2. ఫుల్ యంగ్ టీం..

తాజాగా జరిపిన విస్తరణలో కొట్టొచ్చేలా కనిపించే అంశం.. మంత్రివర్గంలో అత్యధికులు పిన్నవయస్కులే కావటం. దీంతో.. మోడీ కేబినెట్ యూత్ ఫుల్ గా ఉందన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు.. మహిళలకు పెద్ద పీట వేయటంలో మోడీ మార్కు కనిపించింది. కొత్త మంత్రుల్లో రాణే అత్యంత పెద్ద వయస్కుడు. ఆయన వయసు 69 ఏళ్లు కాగా.. పిన్న వయస్కుడు బెంగాల్ కు చెందిన ఎంపీ నిశిత్ ప్రామాణిక్. అతగాడి వయసు కేవలం 35 ఏళ్లు మాత్రమే కావటం గమనార్హం.

కొత్తగా మంత్రి వర్గంలో చేరిన వారిలో 15 మందికి కేబినెట్ హోదా దక్కగా.. 28 మందికి మాత్రం సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజా విస్తరణతో మంత్రివర్గం సగటు వయసు 58 ఏళ్లు కాగా.. మోడీ టీంలోని మంత్రుల్లో 50 ఏళ్ల లోపు వారు 14 మంది ఉండటం విశేషం. తాజా విస్తరణతో మొత్తం మంత్రుల సంఖ్య 77కు పెరిగింది.

3. వాళ్లపై వేటు తప్పలేదు

ముందుగా అంచనా వేసినట్లే పలువురు సీనియర్ మంత్రులపై వేటు తప్పలేదు. పని తీరుపై ప్రధాని గుర్రుగా ఉండటం.. ఇటీవల కాలంలో వివాదాల్లో నిలిచిన వారిపైనా మోడీ వేటు వేసినట్లుగా చెప్పాలి. అన్నింటికి మించి ఐటీ.. న్యాయశాఖా మంత్రిగా వ్యవహరించిన రవిశంకర్ ప్రసాద్ .. పర్యావరణం .. అడవులు.. సమాచార శాఖ మంత్రిగా వ్యవహరించిన ప్రకాశ్ జవడేకర్.. ఆరోగ్య శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్న హర్షవర్దన్.. విద్యాశాఖా మంత్రి రమేశ్ పోఖ్రియాల్.. ఎరువులు రసాయనాల శాఖను నిర్వహించిన సదానంద గౌడ్ ను ఉద్వాసన పలకటం సంచలనంగా మారింది. వివాదాలు.. పని తీరే దీనికి కారణమని చెబుతున్నారు.

4. ప్రకాశ్ జవదేకర్ వేటు వెనుక అసలు సంగతి ఇదేనట

పలువురు మంత్రులపై వేటు వేసిన ప్రధాని మోడీ షాకిచ్చారు. అయితే.. అందరిని ఎక్కువగా షాక్ కు గురి చేసిన నిర్ణయం ఏమైనా ఉందంటే అది ప్రకాశ్ జవదేకర్ విషయంలోనే. ఆయన్ను తప్పించే విషయంలో మోడీ పలు అంశాల్ని ప్రాతిపదికగా తీసుకున్నట్లుగా చెబుతున్నారు. పెరిగిన వయసు కూడా కారణమన్న మాట వినిపిస్తోంది. కేబినెట్ నుంచి తప్పించిన పులువురు మంత్రులు పలు వివాదాల్లో వారి పేర్లు వినిపించాయి. కానీ.. ప్రకాశ్ జవదేకర్ పేరు మాత్రం ఎక్కడా వినిపించలేదు. కానీ.. ఆయనపై వేటు వేయటానికి కారణం మహారాష్ట్ర సమీకరణమన్న మాట వినిపిస్తోంది. ఈ రాష్ట్రం నుంచి ఎక్కువమందికి కల్పించటంతో.. ఆయన్ను పక్కన పెట్టాల్సిన పరిస్థితి నెలకొని ఉందంటున్నారు.

ఆయన్ను ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ గా పంపే వీలుందంటున్నారు. అదే సమయంలో ఆయన నిర్వహించిన శాఖను గతంలో చేపట్టిన వెంకయ్యానాయుడు.. సుష్మా స్వరాజ్.. అరుణ జైట్లీ లాంటి వారు చేపట్టిన శాఖను.. ప్రకాశ్ ఆశించినంత మేర నిర్వహించలేదన్న విశ్లేషణ కూడా ఉంది.

5. సామాజిక అంశం చాలా కీలకం

మోడీ కేబినెట్ విస్తరణ అన్నంతనే ఆయన కూర్పులో అగ్రవర్ణాల కంటే కూడా వెనుకబడిన వర్గాలకు పెద్ద పీట వేస్తారన్న అంచనాలు వెల్లువెత్తాయి. దీనికి తగ్గట్లే తాజా ఎంపిక ఉండటం విశేషం. ఇంతకాలం అగ్రవర్ణాల వారికి పెద్ద పదవులు దక్కే దానికి బదులుగా.. వెనుకబడిన వారికి పెద్దపీట వేయటం విశేషం. మొత్తం 77 మంది మంత్రుల్లో దగ్గర దగ్గర 40 శాతం మంది మంత్రులు ఓబీసీలు కావటం గమానార్హం. ఎస్సీలు 12 మందికి.. ఎస్టీల్లో 8 మందికి.. ఐదుగురు మైనార్టీ నేతలకు అవకాశం కల్పించారు. మొత్తంగా మంత్రివర్గంలో 25 రాష్ట్రాలకు కానీ కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం లభించిందని చెప్పక తప్పదు. ఇదో కొత్త కోణంగా అభివర్ణించక తప్పదు.