Begin typing your search above and press return to search.

టోక్యో ఒలంపిక్స్ : నాలుగో రోజు హైలెట్స్ ..తీవ్ర నిరాశపరుస్తోన్న భారత అథ్లెట్స్ !

By:  Tupaki Desk   |   28 July 2021 4:40 AM GMT
టోక్యో ఒలంపిక్స్ : నాలుగో రోజు హైలెట్స్ ..తీవ్ర నిరాశపరుస్తోన్న భారత అథ్లెట్స్  !
X
టోక్యో ఒలింపిక్స్‌ లో రోజులు గడుస్తున్న కొద్దీ భారత అథ్లెట్లు ఒక్కొక్కరుగా ఉత్త చేతులతో వెనుదిరుగుతున్నారు. మొదటి రోజే మీరాబాయి చాను సిల్వర్‌ తో మెరవడం తప్ప తర్వాతి మూడు రోజులూ భారత్‌ కు నిరాశాజనకమైన ఫలితాలే వచ్చాయి. నాలుగో రోజైన మంగళవారం కూడా అదే పరిస్థితి కొనసాగింది. మెన్స్ హాకీ టీమ్‌, బాక్సర్ లవ్లీనా విజయాలు తప్ప మిగతా అన్నింట్లోనూ భారత అథ్లెట్స్ దారుణంగా విఫలమయ్యారు. షూటర్ల గురి మళ్లీ తప్పింది. బ్యాడ్మింటన్ డబుల్స్ యంగ్ సెన్సేషన్ సాత్విక్-చిరాగ్‌ జోడీ విజయం సాధించిన క్వార్టర్స్‌ కు క్వాలిఫై కాలేకపోయింది. టీటీలో ఎన్నో అంచనాలున్నా శరత్ కమల్ మూడో రౌండ్‌ లోనే ఇంటి దారిపట్టాడు.

మంగళవారం చెప్పుకోదగిన విజయం ఏదైనా ఉందంటే అది తొలిసారి ఒలింపిక్స్‌ బరిలోకి దిగిన బాక్సర్ లవ్లీనా విజయమే. మహిళల వెల్టర్‌ వెయిట్( 64-69 కేజీల) విభాగం రౌండ్ ఆఫ్ 32లో బై లభించడంతో ఈమె నేరుగా మంగళవారం జరిగిన రౌండ్ ఆఫ్ 16లో తలపడింది. జర్మనీ బాక్సర్ నదైన్ అపెట్జ్‌ పై 3-2తో విజయం సాధించింది. ఆమె క్వార్టర్‌ ఫైనల్లో గెలిస్తే చాలు సెమీస్ ఫలితంతో సంబంధం లేకుండా ఇండియాకు మరో పతకం ఖాయం. బాక్సింగ్‌ లో సెమీస్‌లో ఓడిన ఇద్దరికీ బ్రాంజ్ మెడల్ ఇస్తారు. క్వార్టర్ ‌ఫైనల్లో లవ్లీనా బలమైన చైనీస్ తైపేకి చెందిన నియెన్-చిన్ చెన్‌ తో తలపడాల్సి ఉంది.

వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రేలియా చేతిలో 1-7తో చిత్తు చిత్తుగా ఓడిన టీమిండియా , మళ్లీ విజయాల బాట పట్టింది. మంగళవారం ఉదయం స్పెయిన్‌ తో జరిగిన మ్యాచ్‌ లో 3-0తో గెలిచింది. మ్యాచ్ మొత్తం మన్‌ ప్రీత్ సింగ్ సేన ఆధిపత్యం ప్రదర్శించింది. గురువారం ఒలింపిక్ చాంపియన్స్ అర్జెంటీనాతో టీమిండియా తలపడనుంది. భారత్ తరఫున సిమ్రన్‌జీత్‌ సింగ్‌ (14వ నిమిషం), రూపిందర్‌పాల్‌ సింగ్‌ (15ని, 51ని) గోల్స్ చేశారు.

షూటింగ్‌, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింట్‌ లో భారత్‌కు నిరాశే ఎదురైంది. మంగళవారం జరిగిన రెండు మెడల్ ఈవెంట్‌ లలోనూ భారత షూటర్లు ఫైనల్‌ కు అర్హత సాధించలేకపోయారు.10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌ లో మను బాకర్‌, సౌరభ్ చౌదరి జోడీతోపాటు అభిషేక్ వర్మ, యశస్విని దేశ్వాల్ విఫలమయ్యారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌ లోనూ దివ్యాంశ్ పన్వర్‌, ఎలవెనిల్ వలరివన్ జోడీ, అంజుమ్ మౌడ్గిల్‌, దీపక్ కుమార్ జోడీలు నిరాశపరిచాయి. ఇండియన్ టెబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ శరత్ కమల్ మూడో రౌండ్‌ లో ఓడిపోయాడు. ఒలింపిక్ చాంపియన్ మా లాంగ్ చేతిలో అతడు 1-4 తేడాతో పరాజయం పాలయ్యాడు.

బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి జోడీ గ్రూప్‌-ఏ మ్యాచులో విజయం సాధించినప్పటికీ క్వార్టర్ ఫైనల్‌ కు అర్హత సాధించలేకపోయింది. మరో మ్యాచ్‌ లో చైనీస్ తైపీ జోడీ టాప్ సీడ్ ఇండోనేషియా జోడీపై గెలవడంతో సాత్విక్‌, చిరాగ్‌కు నిరాశ తప్పలేదు. మంగళవారం లేన్‌ బెన్‌, వెండీ సేన్‌తో జరిగిన పోరులో 21-17, 21-19తో సాత్విక్-చిరాగ్ జోడీ విజయం సాధించింది. కానీ రెండో మ్యాచ్‌ లో ఇండోనేషియా జోడీ చేతిలో ఓడటంతో వెనుదిరిగాల్సి వచ్చింది.

ఇక బుధవారం భారత ఆర్చర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా.. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌ లో తెలుగు తేజం పీవి సింధు బరిలోకి దిగనుంది. రెండో విజయంపై కన్నేసిన సింధు టోర్నీలో ముందడగువేయాలని భావిస్తుండగా.. పురుషుల సింగిల్స్ స్టార్ బీ సాయిప్రణీత్ తొలి మ్యాచ్ ఓటమి నుంచి తేరుకొని బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు సిద్దమవుతున్నాడు. బాక్సర్ పుజారాణి, సెయిలర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఇండియ‌న్ ఏస్ ష‌ట్ల‌ర్ పీవీ సింధు ఒలింపిక్స్ ప్రిక్వార్ట‌ర్స్‌ లో అడుగుపెట్టింది. బుధ‌వారం జ‌రిగిన గ్రూప్ జే రెండో మ్యాచ్‌ లో ఆమె విజ‌యం సాధించింది. హాంకాంగ్‌ కు చెందిన ఎన్‌ గ‌న్ యితో జరిగిన మ్యాచ్‌లో 21-9, 21-16 తేడాతో వ‌రుస గేమ్స్‌లో గెలిచింది. తొలి గేమ్‌ను 15 నిమిషాల్లోనే సునాయాసంగా సొంతం చేసుకున్న సింధుకు.. రెండో గేమ్‌లో ప్ర‌త్యర్థి నుంచి ప్ర‌తిఘ‌ట‌న ఎదురైంది. 14 పాయింట్ల వ‌ర‌కూ ఇద్ద‌రూ హోరాహోరీగా త‌ల‌ప‌డ్డారు. అయితే ఆ త‌ర్వాత పుంజుకున్న సింధు.. వ‌రుస‌గా పాయింట్లు సాధించింది. సింధు తొలి మ్యాచ్‌లోనూ గెలిచిన విష‌యం తెలిసిందే. దీంతో గ్రూప్ జే టాప‌ర్‌ గా ప్రిక్వార్ట‌ర్స్‌ లో అడుగుపెట్టింది.

ఆర్చ‌రీ మెన్స్ సింగిల్స్‌లో త‌రుణ్‌ దీప్ రాయ్ పోరాటం ముగిసింది. రౌండ్ ఆఫ్ 32లో గెలిచి ఆశ‌లు రేపిన అత‌డు.. రౌండ్ ఆఫ్ 16లో పోరాడి ఓడిపోయాడు. షూట్ ఆఫ్ ద్వారా విజేత‌ను తేల్చిన ఈ రౌండ్‌ లో 5-6 తేడాతో ఇజ్రాయెల్ ఆర్చ‌ర్ ఇతాయ్ షానీ చేతిలో ప‌రాజ‌యం పాల‌య్యాడు. ఐదు సెట్లు ముగిసే స‌మ‌యానికి త‌రుణ్‌ దీప్‌, ఇతాయ్ చెరో ఐదు పాయింట్ల‌తో స‌మంగా నిలిచారు. రెండు, నాలుగు సెట్ల‌ను త‌రుణ్‌దీప్ గెల‌వ‌గా.. తొలి, ఐదో సెట్‌ల‌ను ఇతాయ్ గెలిచాడు. మూడో సెట్‌ లో ఇద్ద‌రికీ ఒక్కో పాయింట్ వ‌చ్చింది. దీంతో షూట్ ఆఫ్ త‌ప్ప‌లేదు. ఇందులో ఇతాయ్ ప‌ర్ఫెక్ట్ 10 సాధించ‌గా.. త‌రుణ్ 9 స్కోరు మాత్ర‌మే చేయ‌గ‌లిగాడు.

టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా గ్రేట్‌ బ్రిటన్‌తో జరిగిన పూల్‌ ఏ మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు ఓటమి పాలైంది. తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన గ్రేట్‌ బ్రిటన్‌ 4-1 తేడాతో భారత మహిళల జట్టును చిత్తుగా ఓడించింది. దీంతో ఆడిన మూడు మ్యాచ్‌లు ఓడడంతో భారత మహిళల హాకీ జట్టు క్వార్టర్స్‌కు చేరే అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. భారత మహిళల జట్టు తమకు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవడంతో పాటు ప్రత్యర్థి జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది.