Begin typing your search above and press return to search.

టోక్యో ఒలంపిక్స్ : 13 వ రోజు హైలెట్స్ ... 41 ఏళ్ల నిరీక్షణకు తెర !

By:  Tupaki Desk   |   6 Aug 2021 4:21 AM GMT
టోక్యో ఒలంపిక్స్ : 13 వ రోజు హైలెట్స్ ... 41 ఏళ్ల నిరీక్షణకు తెర !
X
విశ్వక్రీడల చరిత్రలో రజత పతకం సాధించిన భారత రెండో రెజ్లర్‌గా రవికుమార్‌ దహియా రికార్డు నెలకొల్పాడు. టోక్యో ఒలింపిక్స్‌ సెమీస్‌ లో అద్భుత విజయంతో సత్తాచాటిన అతడు ఫైనల్‌ లో ఓడి పసిడిని పట్టలేకపోయాడు. గురువారం జరిగిన పురుషుల 57 కేజీల విభాగం ఫైనల్‌లో రవి 4-7 తేడాతో జవుర్‌ యుగెవ్‌ (రష్యా ఒలింపిక్‌ కమిటీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. రవి దూకుడు ప్రదర్శించినా ఆర్‌ వోసీ రెజ్లర్‌ డిఫెన్స్‌ ను ఛేదించలేకపోయాడు. దీంతో సుశీల్‌ తర్వాత ఒలింపిక్స్‌ వెండి పతకం పట్టిన భారత రెజ్లర్‌ గా రవి నిలిచాడు. సుశీల్‌ జైలుపాలుకావడం తో మసకబారిన భారత రెజ్లింగ్‌ కు రవి ఈ పతకంతో కళ తేవడంతో పాటు ఎంతో మంది ఈ క్రీడలోకి వచ్చేందుకు స్ఫూర్తిగా నిలిచాడు.

భారత స్టార్‌, టాప్‌ సీడ్‌ వినేశ్‌ ఫోగట్‌ కు మహిళల 53 కేజీల క్వార్టర్‌ ఫైనల్‌ లోనే షాక్‌ ఎదురైంది. బెలారస్‌ రెజ్లర్‌ వనెసా కలాడ్‌ జిన్సకయా చేతిలో వినేశ్‌.. 3-9తో వెనుకబడి ఫెయిల్‌ గా పోటీ నుంచి నిష్క్రమించింది. అంతకుముందు ప్రిక్వార్టర్స్‌ లో సోఫియా మ్యాట్‌ సన్‌ పై 1-7తో అదిరే విజయం సాధించిన ఫోగట్‌ ఆ జోరును కొనసాగించలేకపోయింది. ఇక తనను ఓడించిన ప్రత్యర్థి ఫైనల్‌ చేరడంతో రెపిచేజ్‌ రౌండ్‌ రూపంలో అన్షుమాలిక్‌(57 కేజీలు)కు మరో అవకాశం వచ్చినా ఫలితం లేకపోయింది. ఈ పోటీలో అన్షు 1-5 తేడాతో కొబ్లోవా (రష్యా) చేతిలో ఓటమి పాలైంది. దీంతో మహిళల రెజ్లింగ్‌ విభాగంలో భారత్‌ తరఫున ఇక సీమా బిస్లా (50కేజీలు) మాత్రమే టోక్యో బరిలో మిగిలింది.

కాంస్య పతక పోరులో భారత రెజ్లర్‌ దీపక్‌ పునియాకు తీవ్ర నిరాశ ఎదురైంది. మైల్స్‌ నజెమ్‌ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన దీపక్‌ చివరి పది సెకన్లలో వెనుకబడ్డాడు. దీంతో చివరికి 2-4 తేడాతో ఓడాడు. బుధ‌వారం జ‌రిగిన సెమీఫైన‌ల్లో ఓడిన దీప‌క్‌.. గురువారం బ్రాంజ్ మెడ‌ల్ కోసం త‌ల‌ప‌డినా.. అక్క‌డా అత‌నికి నిరాశ త‌ప్ప‌లేదు. ఇంత‌కుముందే 57 కేజీల విభాగంలో రెజ్ల‌ర్ ర‌వి ద‌హియా సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన విష‌యం తెలిసిందే. మరోవైపు భారత స్టార్‌ బజరంగ్‌ పూనియా శుక్రవారం బరిలోకి దిగనున్నాడు.

ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2020లో సెమీస్ లో ఓడి చరిత్ర సృష్టించే అవకాశాన్ని పోగొట్టుకున్నా.. వీరోచిత పోరాటంతో యావత్ దేశ ప్రజల మనసును దోచుకున్నాయి భారత పురుషుల, మహిళల హాకీ జట్లు. అంచనాలను అందుకున్న పురుషుల జట్టు గురువారం జరిగిన మ్యాచ్లో జర్మనీపై అద్భుత ప్రదర్శన చేసి కాంస్యం సాధించింది. గేమ్ ప్రారంభమైన రెండో నిమిషంలోనే జర్మనీ ప్లేయర్ టిముర్ ఒరుజ్ గోల్ సాధించి ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత భారత్‌ ఆటగాళ్లపై ఆధిపత్యం చెలాయించినప్పటికీ జర్మనీ మరో గోల్‌ నమోదు చేయలేకపోయింది. చివరి నిమిషంలో ఆ జట్టుకు వరుసగా నాలుగు పెనాల్టీ కార్నర్స్ లభించాయి. కానీ వాటిని భారత డిఫెన్స్ సమర్థవంతంగా అడ్డుకుంది.

ఇక రెండో క్వార్టర్‌ లో భారత ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించారు. బంతిని పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంచుకుంటూ ప్రత్యర్థి గోల్‌ పోస్ట్‌ లోకి పదే పదే దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే 17వ నిమిషంలో సిమ్రన్‌జిత్ గోల్ కొట్టి భారత్ ఖాతా తెరిచాడు. జర్మనీ మరో 2 నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ కొట్టి ఆధిక్యాన్ని 3-1 డబుల్ చేసింది. ఆ తర్వాత జర్మనీ డిఫెన్సీవ్ తప్పిదాలు భారత్‌ కు కలిసొచ్చాయి. వరుసగా లభించిన పెనాల్టీ కార్నర్స్‌ ను హార్దిక్ సింగ్ గోల్ గా మలిచి జర్మనీ ఆధిక్యాన్ని 2-3 కు తగ్గించాడు. హార్దిక్ గోల్ చేసిన వెంటనే.. హర్మన్ ప్రీత్ సింగ్ కూడా పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ చేయడంతో స్కోరు 3-3తో సమం అయింది. మూడో క్వార్టర్‌లో భారత్ మరింత చెలరేగి ఆడింది.

31వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ రూపిందర్ పాల్ సింగ్ గోల్‌గా మల్చడంతో 4-3తో ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఆ వెంటనే గుర్జంత్ సింగ్ ఇచ్చిన పాస్‌ను సిమ్రన్ జిత్‌ గోల్‌గా మలచడంతో భారత్ ఆధిక్యం 5-3తో డబుల్ అయింది. ఆ తర్వాత భారత్‌కు పలు అవకాశాలు దక్కినా సద్వినియోగం చేసుకోలేకపోయింది.చివరి క్వార్టర్‌లోనూ ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే భారత రక్షణ శ్రేణి తప్పిదంతో లభించిన పెనాల్టీ కార్నర్‌ను జర్మనీ సద్వినియోగం చేసుకుంది. లుకాస్ విండ్ ఫెడర్ కొట్టిన గోల్‌ను కీపర్ శ్రీజేష్ అంచనా వేయలేక విఫలమయ్యాడు. దాంతో భారత ఆధిక్యం 5-4కు తగ్గింది. ఆ తర్వాత మరింత జోరు కనబర్చిన భారత్, ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత హాకీకి తొలి పతకం రావడంతో దేశమంతగా సంబరాలు అంబరాన్ని అంటాయి.

ఇక శుక్రవారం హైలెట్స్ విషయానికొస్తే .. టోక్యో ఒలింపిక్స్‌ లో భార‌త మ‌హిళ‌ల హాకీ జ‌ట్టు , బ్రాంజ్ మెడ‌ల్ మ్యాచ్‌ ను ఓడిపోయింది. హోరాహోరీగా సాగిన ఆ మ్యాచ్‌ లో బ్రిట‌న్ 4-3 గోల్స్ తేడాతో ప‌త‌కాన్ని సొంతం చేసుకున్న‌ది. తుద వ‌ర‌కు ఇండియ‌న్ వుమెన్ పోరాడినా, ఫోర్త్ క్వార్ట‌ర్స్‌ లో చేతులెత్తేశారు. దీంతో ఒలింపిక్స్ హాకీలో చ‌రిత్ర సృష్టించే అద్భుత అవ‌కాశాన్ని మ‌హిళ‌ల జ‌ట్టు మిస్సైంది. నిజానికి టీమిండియా వుమెన్ స్పూర్తిదాయ‌క‌మైన ఆట‌ను ప్ర‌ద‌ర్శించింది. తొలి క్వార్ట‌ర్‌ లో రెండు జ‌ట్లు గోల్ చేయ‌లేక‌పోయాయి. స‌వితా పూనియా అద్భుత‌మైన రీతిలో గోల్ పోస్టు వ‌ద్ద బ్రిట‌న్ దూకుడును అడ్డుకున్న‌ది.

ఇక సెకండ్ క్వార్ట‌ర్‌ లో గోల్స్ వ‌ర్షం కురిసింది. బ్రిట‌న్ రెండు గోల్స్ చేయ‌గా.. ఇండియ‌న్ వుమెన్ మూడు గోల్స్ చేశారు. గుర్జిత్ కౌర్ రెండు గోల్స్ చేసింది. మ‌రో ప్లేయ‌ర్ వంద‌నా క‌టారియా త‌న డ్రాగ్ ఫ్లిక్‌ తో మ‌రో గోల్‌ను ఇండియాకు అందించింది. దీంతో రెండ‌వ క్వార్ట‌ర్‌ లో ఇండియా త‌న ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. ఇక మూడ‌వ క్వార్ట‌ర్ కూడా ఆస‌క్తిక‌రంగా సాగింది. గోల్ పోస్టును టార్గెట్ చేస్తూ దూకుడు ప్ర‌ద‌ర్శించిన బ్రిట‌న్ అమ్మాయిలు.. ఆ క్వార్ట‌ర్‌ లో ఒక గోల్ చేశారు. దీంతో రెండు జ‌ట్లు 3-3 గోల్స్‌ తో స‌మంగా నిలిచాయి. టెన్ష‌న్‌ గా మారిన నాలుగ‌వ క్వార్ట‌ర్‌ లో బ్రిట‌న్ వుమెన్ త‌మ జోరును ప్ర‌ద‌ర్శించారు. 48వ నిమిషంలో గ్రేస్ బ‌ల్స‌డ‌న్ గోల్ చేయ‌డంతో బ్రిట‌న్‌కు ఆధిక్యం దక్కింది. చివ‌రి క్వార్ట‌ర్‌ లో భార‌త మ‌హిళ‌లు తీవ్రంగా శ్ర‌మించినా ఫ‌లితం ద‌క్క‌లేదు.