Begin typing your search above and press return to search.

టోక్యో ఒలంపిక్స్ : 11 వ రోజు హైలెట్స్ నిరాశపరిచిన భారత్ అథ్లెట్స్

By:  Tupaki Desk   |   4 Aug 2021 4:18 AM GMT
టోక్యో ఒలంపిక్స్ : 11 వ రోజు హైలెట్స్ నిరాశపరిచిన భారత్ అథ్లెట్స్
X
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మంగళవారం ఏమాత్రం కలిసిరాలేదు. ఒక్క గేమ్ లో కూడా విజయం కూడా దక్కలేదు. పాల్గొన్న అన్ని ఈవెంట్ల లో ఓటమే ఎదురైంది. 49 ఏళ్ల తర్వాత సెమీఫైనల్ చేరి ఆశలు రేకెత్తించిన భారత పురుషుల హాకీ టీమ్, ఫైనల్‌ కు అర్హత సాధించలేకపోయింది. ఓటమి బాధలో బ్రాంజ్ ఫైట్‌ కు సిద్దమవుతోంది. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత షాట్‌ పుట్ అథ్లెట్ తజిందర్ పాల్ సింగ్, జావెలిన్ త్రోయర్ అన్ను రాణి, రెజ్లర్ సోనమ్ క్వాలిఫికేషన్ రౌండ్‌ లోనే ఇంటిదారి పట్టారు. మంగళవారం భారత ఈవెంట్స్‌ ఫలితాలను ఒకసారి చూస్తే ..

ఒలింపిక్స్ ఆసాంతం ఆకట్టుకున్న హాకీ పురుషుల జట్టు కీలక పోరులో బోల్తా పడింది. ఒత్తిడిని అధిగమించలేక మన్‌ ప్రీత్ సింగ్ సేన ప్రతర్థికి తలవంచింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో భారత హాకీ టీమ్ 2-5 తేడాతో బెల్జియం చేతిలో ఓటమిపాలైంది. మూడు క్వార్టర్ల వరకు అద్భుతంగా పోరాడిన మన్‌ ప్రీత్‌ సేన ఆఖరి క్వార్టర్లో చివరి ఐదు నిమిషాల వరకు విజయంపై ఆశలు రేపడం గమనార్హం. అయితే అలెగ్జాండర్‌ హెండ్రిక్స్‌ 19, 49, 53 నిమిషాల్లో హ్యాట్రిక్‌ గోల్స్‌ తో టీమ్‌ ఇండియా కలలను చిదిమేశాడు. ఇక ఆశలన్నీ కాంస్య పతకంపైనే.. ఆఖరి నిమిషం వరకు పోరాడిన టీమ్‌ఇండియా కంచు పోరులోనైనా 41 ఏళ్ల పతకాల కరవుకు తెరదించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక పురుషుల షాట్‌ పుట్ విభాగంలో తజిందర్ పాల్ సింగ్ క్వాలిఫికేషన్ రౌండ్ లోనే వెనుదిరిగాడు. క్వాలిఫికేషన్ మ్యార్క్ 21.20 మీటర్ల దూరం అందుకోలేకపోయాడు. మూడు ప్రయత్నాల్లో రెండు సార్లు ఫౌల్ చేసిన అతను తొలి ప్రయత్నంలో గుండును 19.99 మీటర్ల దూరం విసిరాడు. దీంతో 13వ స్థానంలో నిలిచి విశ్వక్రీడల నుంచి తప్పుకున్నాడు. తన వ్యక్తిగత బెస్ట్ 21.49 మీటర్లను కూడా తజిందర్ అందుకోలేకపోయాడు. రెండు సార్లు ఫౌల్ చేయడం అతని క్వాలిఫికేషన్‌ పై ప్రభావం చూపింది.

భారత మహిళ జావెలిన్ త్రో క్రీడాకారిణి అన్ను రాణి సైతం క్వాలిఫికేషన్ రౌండ్లోనే వెనుదిరిగింది. తొలి ప్రయత్నంలో 50.35 మీ. విసిరిన అన్ను.. తర్వాత వరుసగా 53.19 మీ., 54.04 మీ. విసిరింది. దాంతో 14వ స్థానంలో నిలిచి విశ్వక్రీడల నుంచి నిష్క్రమించింది. ఫైనల్కు అర్హత సాధించాలంటే 63 మీ. దూరం విసరాల్సి ఉంది. పోలండ్ అమ్మాయి మరియా 65.24 మీ. విసిరి ఫైనల్కు అర్హత సాధించింది.

అచ్చొచ్చిన రెజ్లింగ్లోనూ భారత్కు నిరాశే ఎదురైంది. కెరీర్లో తొలి ఒలింపిక్స్ ఆడుతున్న సోనమ్ మాలిక్ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. 62 కేజీల విభాగంలో పోటీపడిన సోనమ్.. మంగోలియా రెజ్లర్ బోలోర్తుయా ఖురేల్ఖుపై 2-2 తేడాతో పరాజయం చవిచూసింది. తొలి మూడు నిమిషాల్లోనే ఆమె 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది ఈ 19 ఏళ్ల భారత రెజ్లర్. ఆ తర్వాత దూకుడు తగ్గించి రక్షణాత్మక విధానం ఎంచుకుంది. అదే ఆమె కొంప ముంచింది. ఆట మరో 35 సెకన్లలో ముగుస్తుందనగా ఆసియా రజత పతక విజేతైన బొలొర్తుయా.. సోనమ్‌ను(టేక్‌ డౌన్‌) ఎత్తిపడేసింది. దీంతో స్కోరు 2-2తో సమమైంది. ఆఖరి పాయింట్‌ చేసింది మంగోలియన్‌ కాబట్టి న్యాయనిర్ణేతలు ఆమెనే విజేతగా ప్రకటించారు.

ఇక బుధవారం హైలెట్స్ విషయానికొస్తే .. బుధవారం ఉదయం జరిగిన జావెలిన్ త్రో పురుషుల గ్రూప్-ఏ క్వాలిఫై రౌండ్‌ లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా ఫైనల్‌ కు అర్హత సాధించాడు. తొలి ప్రయత్నంలోనే 86.65 మీటర్లు విసిరి ఫైనల్ రౌండ్‌ కు చేరాడు. ఈ సీజన్‌ లో అత్యధిక దూరం విసిరిన ఫిన్లాండ్ అథ్లెట్ లస్సి ఇటెలాట తర్వాత స్థానంలో నీరజ్ చోప్రా ఉండటం గమనార్హం. జావెలిన్ త్రో ఫైనల్ పోటీలు ఈ నెల 7న జరుగనున్నాయి. డిస్కస్ త్రో మహిళల విభాగంలో కూడా కమల్‌ ప్రీత్ ఫైనల్‌ కు చేరుకుంది. కానీ అక్కడ పతకానికి సరిపడా విసరలేకపోయింది. మరోవైపు జావెలిన్ త్రోలో భారత్ తరపున పాల్గొన్న మరో అథ్లెట్ శివ్‌పాల్ సింగ్ పేలవ ప్రదర్శన చేశాడు. గ్రూప్-బి క్వాలిఫై రౌండ్‌లో అతను 76.40 మీట్లు విసిరి 12వ స్థానంలో నిలిచాడు. దీంతో అతడు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు.

మరో వైపు ఇవాళ భారత క్రీడాకారులు పలు క్రీడాంశాల్లో పోటీపడనున్నారు. గోల్ఫ్ క్రీడాకారులు అధితి అశోక్, దీక్షా దగర్, జావెలిన్ త్రోయర్‌ శివపాల్ సింగ్, బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్, రెజ్లర్లు దీపక్ పునియా, రవి కుమార్, అన్షు మాలిక్ పోటీపడనున్నారు. ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించిన భారత మహిళల హాకీ జట్టు సెమీఫైనల్‌ లో అర్జెంటీనాపై తలపడనుంది. ఈ మ్యాచ్‌ లో టీమిండియా గెలిస్తే సరికొత్త చరిత్రకు అడుగు దూరంలో ఉంది. టోక్యో ఒలింపిక్స్ లో సోమవారం జరిగిన క్వార్టర్స్‌ లో భారత మహిళల జట్టు.. ప్రపంచ నంబర్‌-2 ఆస్ట్రేలియాపై నెగ్గి సెమీస్ చేరింది.

విశ్వక్రీడల్లో భారత మహిళా హకీ జట్టు సెమీఫైనన్‌ కు చేరడం ఇదే తొలిసారి. ఇవాళ జరిగే సెమీస్‌ లో గెలిస్తే ఫైనల్‌ కు దూసుకెళ్లి చరిత్ర సృష్టించినట్లవుతుంది. మరో వైపు బాక్సింగ్‌ విభాగంలో ఇప్పటికే లవ్లీనా భారత్‌ కు పతకం ఖరారు చేసింది. క్వార్టర్స్‌ లో చైనీస్ తైపీ బాక్సర్ పై 4-1 తేడాతో గెలిచిన ఈమె.. సెమీస్ లో 69 కేజీల విభాగంలో టర్కీ బాక్సర్ సుర్మేనేలి బుసానాజ్‌ తో తలపడనుంది. అందులో గెలిస్తే ఫైనల్‌ కు అర్హత సాధించనుంది. ఓడినా ఆమెకు కాంస్య పతకం కైవసం చేసుకోనుంది.