Begin typing your search above and press return to search.

జడ్జీలపై దూషణల కేసు: ముగ్గురు సీబీఐ కస్టడీకి

By:  Tupaki Desk   |   16 Feb 2022 9:38 AM GMT
జడ్జీలపై దూషణల కేసు: ముగ్గురు సీబీఐ కస్టడీకి
X
ఏపీ హైకోర్టు జడ్జీలను దూషించిన కేసులో ముగ్గురికి షాక్ తగిలింది. వారిని సీబీఐకి అప్పగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో ఉన్న న్యాయవాది కళానిధి గోపాలకృష్ణ గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. విచారణకు ఆరోగ్యం సహకరించదని వైద్యులు చెబుతూ కళానిధిని డిశ్చార్జ్ చేసేందుకు నిరాకరించారు.

జడ్జీలపై సోషల్ మీడియాలో పలు అభియోగాలు మోపుతూ పోస్టింగ్ లు పెట్టడంతో అప్పటి హైకోర్టు రిజిస్ట్రార్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అనంతరం కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో ఇప్పటికే 15వ నిందితుడు లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయగా.. బుధవారం ప్రధాన నిందితుడైన ప్రకాశం జిల్లా కొమరవోలు మండలం మూలపల్లికి చెందిన ధనిరెడ్డి కొండారెడ్డి, 3వ నిందితుడైన గుంటూరుకు చెందిన పాముల సుధీర్ లను గతంలో అరెస్ట్ చేశారు.వీరిలో కొండారెడ్డి ధనిరెడ్డి వైఎస్ఆర్ సీపీ, గుంటూరు మహానగరం పేరు మీద ఫేస్ బుక్ ఖాతాలున్నాయి. నిందితుల్లో ఒకరైన పాముల సుధీర్ గుంటూరులో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నారు.

గత ఏడాది హైకోర్టు తీర్పులపై కొందరు న్యాయమూర్తులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు. అనుకూలంగా తీర్పులు రావడం లేదని వ్యతిరేకంగా ఇస్తున్నారని సోషల్ మీడియాలో హోరెత్తించారు.రోడ్లపై బ్యానర్లు కట్టి వ్యతిరేకించారు. హైకోర్టు జడ్జీలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంలో గుంటూరుకు చెందిన న్యాయవాది లక్ష్మీనారాయణ చేసిన ఫిర్యాదు ఆధారంగా హైకోర్టు విచారణ చేపట్టింది.

తొలుత స్థానిక పోలీసులు, తర్వాత సీఐడీ దర్యాప్తు చేపట్టింది. అయితే సీఐడీ విచారణ సాగకపోవడంతో హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది.అప్పటి నుంచి సీబీఐ అధికారులు ఈ పోస్టులు, వాటి మూలాలపై దర్యాప్తు ప్రారంభించారు. నిందితులతో భారీ జాబితానే తయారు చేశారు. ఇందులో ఒక్కొక్కరిగా అరెస్ట్ లు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

న్యాయమూర్తులను దూషించిన కేసులో సీబీఐ తయారు చేసిన నిందితుల జాబితా పెద్దగానే ఉన్నట్టు తేలింది. అయితే ఇందులో 15వ నిందితుడిగా ఉన్న వ్యక్తిని సీబీఐ ముందుగా అరెస్ట్ చేసింది. కడపకు చెందిన లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డిని సీబీఐ తొలి అరెస్ట్ చేసింది. తొలి 14 మందిని వదిలి 15వ నిందితుడిని అరెస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇక స్థానిక కోర్టులో కస్టడీ పిటీషన్ వేసి లింగారెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. కస్టడీలో రాజశేఖర్ రెడ్డి నుంచి సీబీఐ మరిన్ని వివరాలు రాబట్టింది. కడప జిల్లాకు చెందిన రాజశేఖర్ రెడ్డి. ఇతడిని సీబీఐ అరెస్ట్ చేసి గుంటూరు జిల్లా కోర్టులో హాజరు పరిచారు. దీంతో అతడికి రిమాండ్ విధించారు. మూడు రోజులు సీబీఐ కస్టడీకి అప్పగించారు. అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.ఇప్పుడు తాజాగా ముగ్గురిని సీబీఐకి అప్పగిస్తూ కోర్టు నిర్ణయించింది.