Begin typing your search above and press return to search.

మణిపూర్‌ లో ఉగ్రదాడి.. వీరమరణం పొందిన ముగ్గురు జవాన్లు !

By:  Tupaki Desk   |   30 July 2020 1:00 PM GMT
మణిపూర్‌ లో ఉగ్రదాడి.. వీరమరణం పొందిన ముగ్గురు జవాన్లు  !
X
మణిపూర్‌ లో స్థానిక ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉగ్రవాదులు మెరుపు దాడికి పాల్పడిన ఘటనలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. అలాగే, మరో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. మాయన్మార్ సరిహద్దుల్లో జరిగిన ఈ దుర్ఘటనలో అసోం రైఫిల్స్ ‌కు చెందిన జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడి గురించి పూర్తి వివరాలు చూస్తే ..

పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ మణిపూర్ ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ముష్కరులు మొదటగా శక్తివంతమైన ఐఈడీ పేల్చి, తర్వాత సైన్యం పై కాల్పులకు దిగారని తెలిపారు. భారత్-మాయన్మార్ సరిహద్దుల్లోని ఖోంగ్టల్ వద్ద గురువారం ఉదయం 6.30 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అంతర్జాతీయ సరిహద్దుల్లో మూడు రోజుల ఆపరేషన్ ముగించుకుని అసోం రైఫిల్స్ జవాన్లు తమ స్థావరానికి తిరిగి వస్తున్న సమయంలో సరిహద్దుకు 3 కిలోమీటర్ల దూరంలో ఉగ్రవాదులు ఊహించని విదంగా దాడిచేసినట్టు అధికారులు తెలిపారు. మణిపూర్‌ రాజధాని ఇంపాల్‌కు దాదాపు వంద కిలోమీటర్ల దూరంలోని చందేల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ దాడిలో అమరులైన జవాన్లను హవిల్దార్ ప్రణయ్ కలిటా, రైఫిల్‌ మ్యాన్ వైఎం కొనాయక్, రతన్ సలీంగా గుర్తించారు. ఇదే దాడిలో మరో ఐదుగురు జవాన్లకు స్వల్పగాయాలయ్యాయని, వీరిని చికిత్స కోసం మిలటరీ హాస్పిటల్ ‌కు తరలించామని తెలిపారు.