Begin typing your search above and press return to search.

వైఎస్ షర్మిల వెనుకుంది ఆ ఇద్దరే!

By:  Tupaki Desk   |   11 July 2021 5:40 AM GMT
వైఎస్ షర్మిల వెనుకుంది ఆ ఇద్దరే!
X
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి దూసుకొచ్చారు వైఎస్ షర్మిల. తెలంగాణలో ఇన్నాళ్లు ప్రత్యామ్మాయం లేదు అని భావించే టీఆర్ఎస్ కు పోటీగా గట్టిగా నిలబడుతున్నారు. షర్మిల పార్టీ పెట్టడం వైఎస్ జగన్ కు ఇష్టం లేదని వార్తలు వచ్చాయి. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా షర్మిల, జగన్ ఒకేసారి నివాళులర్పించకపోవడంతో ఈ అనుమానాలు బలపడ్డాయి.

ఇక వైఎస్ షర్మిల పార్టీ వెనుక కేసీఆర్ వ్యూహం ఉందని..ఆంధ్రా ఓట్లు చీల్చడానికి షర్మిలతో ఈ కొత్త పార్టీ పెట్టించారని కొందరు వ్యాఖ్యలు చేశారు. తాజాగా సీనియర్ కమ్యూనిస్టు నేత, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. షర్మిల వెనుక ఎవరున్నారో తేల్చేశారు.

కేసీఆర్, జగన్ ఇద్దరు వైఎస్ షర్మిల వెనుక ఉన్నారని.. ఇద్దరు ముఖ్యమంత్రులు ఆడుతున్న నాటకాలు ఆపాలని కాస్త ఘాటుగానే స్పందించారు. వైఎస్ షర్మిల పార్టీ వెనుక ఉంది ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ యేనని సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెల్లెలి పార్టీకి జగన్ నిర్మాత అని.. స్క్రిప్ట్, డైరెక్షన్ బాధ్యతలు కేసీఆర్ వేనని నారాయణ అన్నారు. లేకపోతే ఇంత స్వేచ్ఛగా ఆమె తెలంగాణలో తిరుగుతుందా? అంటూ సూటిగా ప్రశ్నించారు.

టీఆర్ఎస్ వ్యతిరేక ఓటును చీల్చేందుకు షర్మిలను రంగంలోకి దించారని సీపీఐ నారాయణ అభిప్రాయపడ్డారు. ఇక జల వివాదం కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు డ్రామా అన్నారు. డ్రామా ఆపేస్తే జలవివాదం సమసిపోతుందన్నారు. జగన్ బెయిల్ రద్దు అంశాలపై కూడా తనదైన స్టైల్లో నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇక అమిత్ షా ఉన్నంత కాలం జగన్ బెయిల్ రద్దు కాదని.. రెబల్ ఎంపీ రఘురామ ఎన్ని పిటీషన్లు వేసినా కూడా అమిత్ షా అండదండలు పుష్కలంగా జగన్ కు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

మొత్తంగా సీపీఐ నారాయణ తెలంగాణ రాజకీయాల వెనుక.. షర్మిల అడుగుల వెనుక మతలబు ఉందని ఆరోపించారు. ఈయన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. కేసీఆర్, జగన్ లే వెనుకుండి నడిపిస్తున్నారని చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.