Begin typing your search above and press return to search.

ముమైత్ ఖాన్.. శ్రీరెడ్డిలు ఏం పాపం చేశారు.. మీ నోళ్లల్లో నానుతున్నారే?

By:  Tupaki Desk   |   14 July 2021 3:15 AM GMT
ముమైత్ ఖాన్.. శ్రీరెడ్డిలు ఏం పాపం చేశారు.. మీ నోళ్లల్లో నానుతున్నారే?
X
గతంలో ఎప్పుడూ లేని దరిద్రపుగొట్టు రాజకీయాలకు కేరాఫ్ గా మారుతున్నాయి తెలుగు రాజకీయాలు. ఘాటు విమర్శలు.. దిమ్మ తిరిగే ఆరోపణలు చేసుకోవటం పాలిటిక్స్ లో మామూలే. అంత మాత్రాన పరిమితుల్ని పక్కన పెట్టేసి.. మర్యాదల్ని వదిలేసి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడుకోవటం ఏ మాత్రం సంస్కారం కాదన్న విషయం తెలంగాణ రాష్ట్ర రాజకీయ నేతల్లోని కొందరు మర్చిపోతున్నారు. ఇప్పటివరకు రాజకీయాల్లో లేని విధంగా.. కొందరు మహిళా సెల్రబిటీల పేర్లతో తిట్టుకోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయం హాట్ హాట్ గా మారిన సంగతి తెలిసిందే.

మాజీ మంత్రి ఈటలపై భూ కబ్జా ఆరోపణలు మొదలై.. కేసులు నమోదైన నాటి నుంచి రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈటల మెడలో కాషాయ కండువా పడటం.. అదే సమయంలో రేవంత్ ను టీ పీసీసీ చీఫ్ పదవిని అప్పజెప్పటం లాంటి పరిణామాలతో.. తెలంగాణ అధికారపక్షానికి విపక్షానికి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకోవటం ఎక్కువైంది. టీఆర్ఎస్ పార్టీని వదిలి.. బీజేపీలోకి చేరే ముందు తన ఎమ్మెల్యేగిరికి రాజీనామా చేసిన ఈటల కారణంగా ఇప్పుడు హూజూర్ నగర్ ఉప ఎన్నికల హాట్ టాపిక్ గా మారింది. దీని చుట్టూనే తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. ఈ ఎన్నికల బరిలో నిలిచేందుకు టీఆర్ఎస్ పార్టీ గాలం వేయటం.. కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌశిక్ రెడ్డి చిక్కుకోవటం తెలిసిందే.

గత ఎన్నికల్లో ఈటల మీద పోటీ చేసిన కౌశిక్.. ఏకంగా అరవై వేల ఓట్లను సొంతం చేసుకోవటం ద్వారా గులాబీ బాస్ కంట్లో పడటం తెలిసిందే. ఆ మధ్యన మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని కౌశిక్ రెడ్డితో భేటీ కావటంతో కాంగ్రెస్ ను బయటకు వెళ్లటం ఖాయమనిపించింది. అయితే.. తాను పార్టీలోనే ఉంటానని చెప్పిన అతగాడు.. ఉప ఎన్నిక వేళ టీఆర్ఎస్ టికెట్ ఖాయమంటూ తన వర్గీయులకు ఫోన్ లో మాట్లాడిన వాయిస్ క్లిప్ లీక్ కావటం తెలిసిందే. దీంతో.. టీపీసీసీ షోకాజ్ నోటీసు ఇవ్వటం.. ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే కౌశిక్ మీద వేటు వేసినట్లుగా టీపీసీసీ చెబుతుంటే.. తానే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా చెప్పటం తెలిసిందే. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముమైత్ ఖాన్ లా తయారయ్యారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సినిమాల్లో ముమైత్ ఖాన్ వచ్చినప్పుడు ఈలలు.. కేకలు వేస్తారని.. ఇప్పుడు కాంగ్రెస్ కు రేవంత్ మరో ముమైత్ ఖాన్ అని మండిపడ్డారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ నేత మరింత ఘాటుగా రియాక్టు అయ్యారు. తాజాగా పత్తి కృష్ణారెడ్డి స్పందిస్తూ.. ‘ముమైత్ తో రేవంతన్నను పోలుస్తావా బిడ్డా.. నువ్వే శ్రీరెడ్డిలా వ్యవహరిస్తున్నావు’ అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం జరిగినప్పుడు కుక్క..పిల్లి..నక్క.. పులి.. సింహం.. లాంటి వాటి ప్రస్తావన వచ్చేది.

ఇప్పుడు అందుకు భిన్నంగా సినిమా రంగానికి చెందిన మహిళా సెలబ్రిటీల పేర్లను ప్రస్తావించటం సభ్యత కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎవరికి వారు.. వారి వ్యక్తిగత జీవితాల్ని ప్రభావితం చేసేలా రాజకీయ నేతల మాట్లాడటం మంచిది కాదని చెప్పాలి. ఆ విషయాన్ని మర్చిపోయి.. ఇలా మొమైత్.. శ్రీరెడ్డిలాంటి వారి ప్రస్తావన తీసుకురాకపోవటమే మంచిది. మరీ.. విషయాన్ని తెలుగు నేతలు గుర్తిస్తారా?