Begin typing your search above and press return to search.

అయోధ్య తీర్పు కి ఇది సరైన సమయం కాదు : పాకిస్థాన్

By:  Tupaki Desk   |   9 Nov 2019 11:13 AM GMT
అయోధ్య తీర్పు కి ఇది సరైన సమయం కాదు : పాకిస్థాన్
X
అయోధ్య లోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం పై సుప్రీం కోర్టు తుది తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో వివాదానికి కారణమైన స్థలాన్ని రామ మందిర నిర్మాణానికే కేటాయిస్తున్నట్టు తెలిపింది. అలాగే మూడు నెలల్లో కేంద్రం అయోధ్య ట్రస్ట్ ఏర్పాటు చేసి ..ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పింది. అలాగే ముస్లిం లకి అయోధ్యలో 5 ఎకరాల స్థలాన్ని మసీద్ కోసం కేటాయించాలని సుప్రీం తన తీర్పుని వెల్లడించింది. ఈ తీర్పు ఎవరికీ అనుకూలంగా ఉన్నా కూడా దేశ ప్రజానీకం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాయి.

కానీ , పాకిస్తాన్ మాత్రం తనకి అలవాటు గా మారిన ధోరణిలోనే మరోసారి విమర్శలకి దిగింది. సుప్రీంకోర్టు తీర్పు రామ జన్మభూమి కి అనుకూలంగా రావడం పట్ల అసహనాన్ని వ్యక్తం చేసింది. ఇది చాలా సున్నితమైన సమస్య అన్ని , ఈ వివాదం పై సుప్రీం ఇంకొన్ని రోజులు వేచి చుసింటే బాగుండేది అని చారిత్రాత్మక అంశం పై తీర్పును వెల్లడించడానికి ఇది సరైన సమయం కాదని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ అన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడానికి గుర్తుగా చెబుతున్న కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవం శనివారమే. అదే రోజు రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం పై సుప్రీం కోర్టు తన తీర్పును వెల్లడించింది.

ఒకే రోజు ఈ రెండు ఘట్టాలు చోటు చేసుకున్నాయి. కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవం నాడే అయోధ్య పై తీర్పును వెల్లడించడం సరి కాదని మహమ్మద్ ఖురేషీ అన్నారు. దీని వల్ల కర్తార్ పూర్ కారిడార్ కు ప్రాధాన్యత లభించకుండా పోయిందని చెప్పారు. పాకిస్తాన్ కు సంబంధించినంత వరకు కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవం అత్యంత సంతోష కరమైన రోజు అని, అలాంటి సందర్భాన్ని పక్క దారి పట్టించేలా భారత్ ప్రవర్తించిందని అన్నారు. ఇప్పటికే భారతీయ ముస్లింల పై తీవ్ర ఒత్తిడి ఉందని, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యం లో.. వారి పై మరింత ఒత్తిడి పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ఉద్దేశపూరకంగానే ఆ దేశ అత్యున్నత న్యాయ స్థానం ఈ నిర్ణయాన్ని తీసుకుని ఉండొచ్చని తాను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు.