Begin typing your search above and press return to search.

కొత్త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము గురించి మీకు తెలియ‌ని విష‌యాలు ఇవే!

By:  Tupaki Desk   |   22 July 2022 8:18 AM GMT
కొత్త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము గురించి మీకు తెలియ‌ని విష‌యాలు ఇవే!
X
భార‌త‌ తొలి గిరిజ‌న రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికై రికార్డు సృష్టించారు.. ద్రౌప‌ది ముర్ము. అందులోనూ తొలి గిరిజ‌న అభ్య‌ర్థిగానే కాకుండా తొలి గిరిజ‌న మ‌హిళ రాష్ట్ర‌ప‌తిగానూ ఆమె రికార్డు సృష్టించారు. అతి చిన్న వ‌య‌సు 64 ఏళ్ల‌కే భార‌త రాష్ట్ర‌ప‌తిగా ఎంపికైన వ్య‌క్తి కూడా ముర్మునే కావ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టివ‌ర‌కు భార‌త రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విని ఓసీలు, బీసీలు, ద‌ళితులు, ముస్లింలు అధిరోహించారు. తొలిసారిగా ఎస్టీల నుంచి ద్రౌప‌ది ముర్ము రాష్ట్ర‌ప‌తిగా ఎన్నిక‌య్యారు. భార‌త‌దేశ చ‌రిత్ర‌లో రాష్ట్ర‌ప‌తి అయిన రెండో మ‌హిళ కూడా ముర్మునే కావ‌డం విశేషం. అంత‌కుముందు ప్ర‌తిభా పాటిల్ భార‌త తొలి మ‌హిళా రాష్ట్ర‌ప‌తిగా ప‌నిచేశారు.

1958 జూన్‌ 20న ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో జన్మించిన ముర్ము.. స్వతంత్ర భారతదేశంలో పుట్టి, రాష్ట్రపతి స్థానానికి చేరిన తొలివ్యక్తిగానూ మరో రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు రాష్ట్రపతులుగా ఉన్నవారంతా దేశానికి స్వాంత్ర్యం రాక‌ముందు అంటే 1947కి ముందు పుట్టినవారే.

జార్ఖండ్‌ సరిహద్దులోని పహర్ద్‌పూర్‌ గ్రామంలో 80 శాతం సంతాల్‌ తెగ వారే ఉండేవారు. ఆ తెగకు చెందిన ఓ కుటుంబంలో పుట్టిన ద్రౌప‌ది ముర్ముకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. తమ ఊరి నుంచి ఒడిశా రాజ‌ధాని భువనేశ్వర్‌కు వెళ్లి కాలేజీలో చదువుకున్న తొలి వ్యక్తి .. ద్రౌప‌ది ముర్మునే. ఈ క్ర‌మంలో తల్లిదండ్రులు ప్ర‌తి నెలా ఇచ్చే రూ.10తోనే కాలేజీకి వెళ్లి ఆమె బీఏ పూర్తి చేసుకున్నారు.

ముర్ముకే 15 ఏళ్ల‌కే పెళ్ల‌యింది. ఆమె జీవిత‌మంతా విషాదాల‌మ‌య‌మే. వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో యువ‌కులుగా ఉన్న తన ఇద్దరు కుమారులను కోల్పోయారు. ఎనిమిదేళ్ల క్రితం భర్త శ్యామ్‌ చరణ్ గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుతం ముర్ముకు కుమార్తె ఇతిశ్రీ ఉన్నారు. ఇతిశ్రీ వివాహ‌మై బిడ్డ ఉన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ముర్ము కాల‌క్షేప‌మంతా కుమార్తె, మ‌న‌వ‌రాలితోనే. భర్త శ్యామ్ చరణ్‌, కుమారులు.. లక్మన్‌, షిపున్‌ పేరు మీద ద్రౌప‌ది ముర్ము.. ఎస్‌ఎల్‌ఎస్‌ మెమోరియల్‌ స్కూల్‌ను నిర్మించ‌డం విశేషం.

ద్రౌపదీ ముర్ము ప్రభుత్వ క్లర్క్‌గా తన వృత్తిని ఆరంభించారు. ఆ తర్వాత కొంతకాలంపాటు టీచర్‌గానూ పనిచేశారు. 1997లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె బీజేపీ త‌ర‌ఫున‌ రాయ్‌రంగ్‌పూర్‌ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అదేస‌మ‌యంలో మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్ గానూ వ్య‌వ‌హ‌రించారు.

2000లో మొద‌టిసారి రాయ్ రంగ‌పూర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నిక‌య్యారు. న‌వీన్ ప‌ట్నాయ‌క్ నేతృత్వంలోని బీజేడీ - బీజేపీ సంకీర్ణ స‌ర్కారులో ర‌వాణా, వాణిజ్య, ప‌శుసంవ‌ర్థ‌క శాఖ‌ల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004లో మ‌రోసారి రాయ్ రంగ‌పూర్ ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నిక‌య్యారు. 2002-2009 మ‌ధ్య మ‌యూర్ భంజ్ జిల్లా బీజేపీ అధ్య‌క్షురాలిగానూ ప‌నిచేశారు. ఒడిశా బీజేపీ ఎస్టీ మోర్చా అధ్య‌క్షురాలిగా విధులు నిర్వ‌ర్తించారు. 2015లో జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ గా నియ‌మించారు.

2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చాక‌ 2015లో జార్ఖండ్‌ గవర్నర్‌గా ద్రౌప‌ది ముర్ము నియమితులయ్యారు. 2021లో గ‌వ‌ర్న‌ర్ గా త‌న ప‌ద‌వీకాలం పూర్తవడంతో తిరిగి తమ స్వస్థలమైన రాయ్‌రంగ్‌పూర్‌ తిరిగొచ్చారు. ఈ పట్టణంలో తన భర్త కట్టించిన ఐదు గదుల ఇంట్లోనే అప్పటి నుంచి ఉంటున్నారు. ఎంత పెద్ద హోదాలో ఉన్నా నిరాడంబ‌ర‌త‌నే ఆమె ఇష్ట‌ప‌డేవారు.