Begin typing your search above and press return to search.

మృత్యువు ముంగిట ఉన్న ఆ ముగ్గురు నియంతలు వీరే!

By:  Tupaki Desk   |   20 May 2022 2:45 AM GMT
మృత్యువు ముంగిట ఉన్న ఆ ముగ్గురు నియంతలు వీరే!
X
ఈ ప్రపంచం ఇప్పటిదాకా ఎంతోమంది నియంతలను చూసింది. ప్రాచీన కాలంలో రాజుల కాలం నుంచి ప్రస్తుతం వరకు ఎంతో మంది నియంతలు ఉన్నారు. అయితే మనకందరికీ తెలిసిన నియంతలు ఎవరంటే.. హిట్లర్‌ (జర్మనీ), ముస్సోలినీ (ఇటలీ). రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన ఈ ఇద్దరు నియంతల చివరి జీవితం అతి దారుణంగా ముగిసింది.

ఇప్పుడు హిట్లర్, ముస్సోలినీల కోవలోనే ముగ్గురు నియంతలు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నారు. ప్రపంచ శాంతికి పెను ప్రమాదంగా తయారయ్యారు. తాము ఎదగడానికి మానవ హక్కులను హననం చేయడం, విమర్శించినవారిని జైలులో పెట్టడం లేదంటే చంపేయడం, వారి వ్యాపారాలను దెబ్బతీయడం, ఆస్తులను స్వాధీనం చేసుకోవడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రపంచ ఆధిపత్యం కోసం చేయరాని పనులన్నీ చేస్తున్నారు. వారే.. రష్యా, చైనా, ఉత్తర కొరియా అధ్యక్షులు.. వ్లాదిమిర్‌ పుతిన్, జీ జిన్‌పింగ్, కిమ్‌ జోంగ్‌ ఉన్‌.

ఈ ముగ్గురు నియంతలు ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఓవైపు ఈ ముగ్గురికి ప్రాణాంతకమైన జబ్బులు ఉన్నాయని ప్రపంచ మీడియా కోడై కూస్తోంది. మృత్యువు ముంగిట ఉన్నారని చెబుతోంది. అయినా ఈ ముగ్గురు నియంతలు చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు ప్రపంచ ఆధిపత్యం కోసం.. తమ దేశాలను ప్రపంచంలో సూపర్‌ పవర్లుగా నిలపాలనే ఏకైక కాంక్షతో రగిలిపోతున్నారు.

వీరిలో ముందుగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను తీసుకుంటే.. అధికారంలో జీవితాంతం కొనసాగేలా చైనా రాజ్యాంగంలో పలు సవరణలు తెచ్చాడు.. జీ జిన్‌పింగ్‌. చైనాకు జీవితాంతం అధ్యక్షుడిగా, మిలిటరీ అధిపతి ఉండేలా రాజ్యాంగాన్ని సవరించుకున్నాడు. అఖండ చైనాను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో భారత్, నేపాల్, భూటాన్, తైవాన్, మంగోలియా, జపాన్‌ తదితర దేశాల్లోని ప్రాంతాలను, దీవులను కలుపుకోవడానికి పదే పదే కాలుదువ్వుతున్నారు. ఈ విషయంలో ప్రపంచ దేశాల నుంచి విమర్శలు ఎదురవుతున్నా జీ జిన్‌ పింగ్‌ లెక్కచేయడం లేదు. అమెరికాను మించి సూపర్‌ పవర్‌గా చైనా ఎదగాలని కలలు కంటున్నారు. అయితే సెరిబ్రల్‌ అణురిజం అనే వ్యాధితో జిన్‌పింగ్‌ బాధపడుతున్నాడు. అయినా సరే దారుణాలకు తెగించడం మానలేదు.

ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. ఇప్పటికే రెండుసార్లు రష్యా అధ్యక్షుడిగా, పలుమార్లు దేశ ప్రధానమంత్రిగా పనిచేశారు. రష్యా రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి అయినా రెండుసార్లు మాత్రమే అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉంది. దీంతో రష్యా రాజ్యాంగాన్ని మార్పించేశాడు.. పుతిన్‌. 1991లో విచ్ఛిన్నమైపోయి దాదాపు 20 దేశాలుగా విడిపోయిన పాత సోవియట్‌ యూనియన్‌ను తిరిగి ప్రతిష్టించడమే లక్ష్యంగా అన్ని అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలో తనకు అడ్డొచ్చే దేశాలపై దండయాత్రలకు దిగుతున్నారు. ఇలాగే ప్రస్తుతం ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగారు. ఆ దేశంలో పలు ప్రాంతాలను ఆక్రమించారు. ఇప్పుడు ఫిన్లాండ్, స్వీడన్, లిథువేనియా తదితర దేశాలను హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు అమెరికాతో సమానంగా సూపర్‌ పవర్‌గా వెలుగొందిన రష్యాను తిరిగి చూడాలని పుతిన్‌ కలలు కంటున్నారు. బ్లడ్‌ క్యాన్సర్‌ వ్యాధి పుతిన్‌ను కబళిస్తున్నా.. వయసు 70 ఏళ్లకు పైబడినా తన లక్ష్యం నుంచి ఈ నియంత పక్కకు తప్పుకోవడం లేదు.

ఇక ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. అతను నియంతలకే నియంత. శాడిజానికి కేరాఫ్‌ అడ్రస్‌.. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చేసే చేష్టలు.. వ్యవహరించే తీరు.. యమ కింకరులకి నాయకుడన్నట్టుగా ఉంటుంది. తనకు కోపమొస్తే కుటుంబ సభ్యులనైనా.. ప్రజలనైనా చంపేస్తాడు. తన కోసం ప్రజలు చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని శాసిస్తాడు. ఆ దేశంలో ప్రజలు వేసుకునే బట్టలపైనా నిషేధం, ఆహారంపైనా ఆంక్షలు.. చివరకు మగవాళ్ల క్రాపు ఎలా ఉండాలో, మహిళల హెయిర్‌స్టైల్‌ ఎలా ఉండాలో కిమ్‌ జోంగ్‌ ఉన్నే చెబుతాడు. ఇలా ఒకటేమిటి సొంత కుటుంబ సభ్యులనే వేట కుక్కలతో చంపించిన క్రూరత్వం కిమ్‌ది. అమెరికా దీని మిత్ర దేశాలు దక్షిణ కొరియా, జపాన్‌ను భయపెట్టడానికి నిత్యం అణు పరీక్షలు, క్షిపణి పరీక్షలు చేస్తూ ఆయా దేశాలను కిమ్‌ జోంగ్‌ ఉన్‌ హడలెత్తిస్తున్నాడు.

ప్రపంచం మొత్తానికి ఏకైక నాయకుడిగా, నియంతగా ఉండాలని ఉన్‌కు ఉంది. అమెరికాకు నిజమైన పోటీ ఉత్తర కొరియానే అని భావిస్తుంటాడు. అయితే గతంలోనే కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరణించాడని వార్తలు వచ్చాయి. అతడికి ఏదో భయంకర జబ్బు ఉందని పుకార్లు వ్యాపించాయి. కొద్ది నెలలపాటు అతడు ఎవరికీ కనిపించపోయే సరికి ప్రపంచం ఈ వార్తలు నిజమే అనుకుంది. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే ఉన్‌ ప్రజల ముంగిటకొచ్చేశాడు. అయితే ఖచ్చితంగా అతడు దారుణమైన జబ్బుతో బాధపడుతున్నాడని అమెరికా నిఘా సంస్థ సీఐఏ చెబుతోంది. ఉత్తర కొరియాలో మీడియా, ఇంటర్‌నెట్‌పై నిషేధం ఉండటంతో ఇందుకు సంబంధించిన వార్తలు బయటకు రావడం లేదు. ఇలా ముగ్గురు నియంతలు .. పుతిన్, జిన్‌పింగ్, కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మృత్యువుతో పోరాడుతున్నారు.