Begin typing your search above and press return to search.

మూడు పార్టీల్లో ఓడిన సీనియర్ నేతలు వీరే

By:  Tupaki Desk   |   12 Dec 2018 4:45 AM GMT
మూడు పార్టీల్లో ఓడిన సీనియర్ నేతలు వీరే
X
సవాల్ చేసిన నోళ్లు ఇప్పుడు సైలెంట్ అయ్యాయి. దమ్ముంటే కొడంగల్ ఇలాఖాలో తనను ఓడించాలని తొడగొట్టిన రేవంత్ రెడ్డికి భారీ షాకే తగిలింది.. ఇప్పుడు ఓడిపోయి.. ఓటమిని ఒప్పుకొని విషణ్ణవదనంతో ఉండిపోయారు. తెలంగాణ ఎన్నికలు కాంగ్రెస్ సీనియర్ నేతలకు పీడకలనే మిగిల్చాయి. మహామహులన్న వారు కూడా మట్టికరవడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఇక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నాగార్జన సాగర్ నియోజకవర్గంలో ఓడిపోయారు. డీకే అరుణ గద్వాలలో, సంపత్ కుమార్ ఆలంపూర్ లో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో, జీవన్ రెడ్డి నల్గొండలో.. దామోదర రాజనర్సింహా ఆంధోల్ లో.. సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్ లో, సుదర్శన్ రెడ్డి భోదన్ లో.. పద్మావతి రెడ్డి కోదాడలో, పొన్నాల లక్ష్మయ్య జనగామలో, కొండా సురేఖ పరకాలలో, బలరాం నాయక్ మహబూబాబాద్ లో.. సర్వే సత్యనారాయణ కంటోన్మెంట్ లో, ముఖేష్ గౌడ్ లో గోషామహల్ లో .. చిన్నారెడ్డి వనపర్తిలో ఓడిపోయారు.

టీఆర్ఎస్ ఎవ్వరూ ఊహించని విధంగా 88 సీట్లలో విజయబావుటా ఎగురవేస్తుందని నేతలు కలలో కూడా అనుకోలేదు. మహాకూటమి 21 సీట్లకే పరిమితం అవ్వడం కలవరపాటుకు గురిచేసింది. మజ్లిస్ 7, బీజేపీ 1 స్థానాల్లో గెలిచాయి.

కాంగ్రెస్ ముఖ్యలతోపాటు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు కూడా ఓడిపోవడం గమనార్హం. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, అజ్మీరా చందూలాల్ తోపాటు స్పీకర్ మధుసూదనాచారి ఓడిపోయారు.

ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా బీజేపీని కృంగిబాటుకు గురిచేశాయి. రాష్ట్రంలోనూ గడిచిన సారి గెలిచిన 5 స్థానాలను బీజేపీ కాపాడుకోలేకపోయింది. బీజేపీ సీనియర్ నేతలైన కిషన్ రెడ్డి, కే. లక్ష్మన్, చింతల రాంచంద్రరెడ్డి, రాంచంద్రరావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ లు చిత్తుగా ఓడిపోయారు. తెలంగాణ వ్యాప్తంగా ఇద్దరు స్వతంత్రులు రాములునాయక్ (వైరా), కోరుకంటి చందర్ (రామగుండం)లు గెలిచారు.

కొడంగల్ లో ఓడిపోయాక రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. 45-50 ఏళ్లుగా కాంగ్రెస్ గెలుపోటములు సహజమన్నారు. గెలుపును ప్రజలు ఇచ్చిన లైసెన్స్ గా భావించి దోచుకోవద్దని అధికార పార్టీకి హితవు పలికారు. అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని సూచించారు. రైతులు ఆత్మహత్యలు ఆపాలన్నారు. ఎన్నికల ఫలితాలపై పార్టీ నేతలతో కలిసి విశ్లేషిస్తామన్నారు. అక్రమాలు జరిగాయా.. టీఆర్ఎస్ ఈవీఎంల ట్యాంపరింగ్ చేసిందా అనేది చర్చిస్తామన్నారు. రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నట్లు ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజల తరుఫున పోరాడుతామన్నారు.