Begin typing your search above and press return to search.

చినజీయర్ కంటే దురదృష్టవంతుడు మరెవరూ ఉండరా?

By:  Tupaki Desk   |   29 March 2022 3:29 AM GMT
చినజీయర్ కంటే దురదృష్టవంతుడు మరెవరూ ఉండరా?
X
ఇంతకు మించిన దురదృష్టవంతుడు మరేం ఉంటుంది చెప్పండి. ఒక చారిత్రక ఆలయాన్ని పున: నిర్మించటం.. దాన్ని నేత్ర పర్వంగా తీర్చిదిద్దటం మాత్రమే కాదు.. ఆ ప్రాంతానికి ఉన్న పేరును సైతం మార్చేయటం దగ్గర నుంచి.. పనుల ప్రారంభం మొదలు పూర్తి అయ్యే వరకు ప్రతి ఒక్క విషయాన్ని దగ్గరుండి జాగ్రత్తలు తీసుకున్నోళ్లు.. చివరకు దాని ప్రారంభానికి కనీసం ఆహ్వానం లేకపోవటానికి మించిన దారుణ పరిస్థితి మరేం ఉంటుంది చెప్పండి. అవును.. ఇప్పుడు చెప్పేదంతా యాదాద్రి.. చినజీయర్ స్వామి గురించే.

యాదగిరి గుట్టను యాదాద్రిగా పేరు డిసైడ్ చేసింది చినజీయర్ స్వామి. అంతేనా.. ఆలయాన్ని పున: నిర్మించటంతో పాటు.. దాని రూపురేఖలు మొత్తం మార్చేయటమే కాదు.. దేశంలోనే అత్యంత భారీ ఆలయంగా దీన్ని తీర్చి దిద్దటం.. ఎక్కడెక్కడి వారో ఇక్కడకు వచ్చేందుకు వీలుగా యాత్రా స్థలంగా మార్చటం అంత తేలికైన విషయం కాదు.

దాదాపు ఆరేళ్లకు పైనే పడిన కష్టానికి.. శ్రమకు సాక్ష్యంగా నిలుస్తుంది నేటి యాదాద్రి దేవాలయం. ఇప్పుడు అత్యంత సుందరంగా.. రమణీయంగా కనిపించే ప్రతి అంశంలోనూ చిన జీయర్ స్వామి ఉంటారన్న విషయం అందరికి తెలిసిందే. అలాంటిది ఆయనకే తాజా కార్యక్రమంలో కనీస ఆహ్వానం లేకపోవటానికి మించిన దురదృష్టకరం మరేం ఉంటుంది చెప్పండి? యాదాద్రి ఆలయంలోని ప్రతి అంగుళం చినజీయర్ ఇచ్చిన సలహాలు.. సూచనలతోనే జరిగాయన్నది మర్చపోకూడదు.

అలాంటి చినజీయర్ స్వామికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య టర్మ్స్ సరిగా లేవన్న సంగతి తెలిసిందే. చినజీయర్ స్వామి ఏర్పాటు చేసిన సమతామూర్తివిగ్రహ ప్రారంభం సందర్భంగా చోటు చేసుకున్న తేడా వ్యవహారం అంతకంతకూ పెరిగి పెద్దది కావటమే తప్పించి.. ఆ వివాదం తగ్గని పరిస్థితి. శిలాఫలకం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు లేకపోవటం.. దానిపై ఆయన సీరియస్ కావటం.. అది జరిగిన కొన్ని రోజులకే ముఖ్యమంత్రి కేసీఆర్ వర్సెస్ చినజాయర్ స్వామిగా మారింది.

అయితే.. ఇటీవల ప్రెస్ మీట్ పెట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. చినజీయర్ కు తనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదన్న ఆయన.. మీడియా మీదనే నెపం పెట్టేయటం తెలిసిందే. ఇలా మాటలు చెబుతూనే.. చేతల విషయానికి వచ్చేసరికి చినజీయర్ స్వామికి ఎలాంటి ఆహ్వానం లేని వైనం చూస్తే.. ఆయ్యో పాపం అనుకునేలా తాజా సీన్ ఉందని చెప్పాలి.

ఈ రోజున యాదాద్రికి సంబంధించిన కార్యక్రమాల్ని చూసినంతనే చినజీయర్ స్వామి కనిపిస్తారు. ఎందుకంటే.. ఇవాల్టి రోజున కనిపించే యాదాద్రి వెనుక క్రెడిట్ లో సింహభాగం చిన జీయర్ స్వామిదే. అలాంటి ఆయన్ను పక్కన పెట్టేసిన వైనం కళ్లకు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందని చెప్పాలి. కొసమెరుపు ఏమంటే.. ఏ ఆలయాన్ని అయితే తన సొంత ప్రాజెక్టుకు మించి చూసుకున్నారో అలాంటి చినజీయర్ స్వామిని ఆలయ పున: ప్రతిష్ఠ రోజున కనీస ఆహ్వానం కూడా రాని పరిస్థితి. ఇదంతా చూసినప్పుడు చిన జీయర్ కు మించిన దురదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరేమో? అన్న సందేహం కలుగక మానదు.