Begin typing your search above and press return to search.

అప్పుడు కపిల్‌..ఇప్పుడు కోహ్లీ... రేర్ రికార్డ్ !

By:  Tupaki Desk   |   7 Sep 2021 3:11 AM GMT
అప్పుడు కపిల్‌..ఇప్పుడు కోహ్లీ... రేర్ రికార్డ్ !
X
ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌ లో టీమిండియా ఘన విజయం సాధించింది. 157 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ పై విజయాన్ని నమోదు చేసింది. భారత జట్టు విజయంలో రోహిత్ శర్మ, బౌలర్స్ ఉమేశ్ యాదవ్, బుమ్రా, జడేజా, శార్దూల్ ఠాకూర్ కీలక భూమిక పోషించారు. దీంతో ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల ఈ సిరీస్‌ లో టీమిండియా 2-1 తో ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌ లో భారత బ్యాట్స్‌ మెన్ పూర్తిగా చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌ లో భారత్ 191 పరుగులకే అలౌట్ అయింది.

ఆ తర్వాత బ్యాటింగ్‌ కు దిగిన ఇంగ్లాండ్ జట్టు.. తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులు చేసింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా పుంజుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 127 పరుగుల సాధించి టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మిగతా ఆటగాళ్లు కూడా తొలి ఇన్నింగ్స్‌తో పోల్చితే మెరుగైన ఆటతీరు కనబరిచారు. శార్దుల్, పంత్‌ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఫలితంగా టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 466 పరుగులు సాధించింది.

ఆ తర్వాత విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 77 పరుగులు చేసింది. ఐదో రోజు ఇంగ్లాండ్ 291 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే ఐదో రోజు ఆటలో భారత బౌలర్లు విజృంభించారు. వెంట వెంటనే కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ ను కోలుకోలేని దెబ్బ తీశారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 210 పరుగులకే కుప్పకూలింది. వరుసగా వికెట్లు తీసిన బౌలర్లు భారత్‌ ను విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్‌ కు 3 వికెట్లు, బుమ్రా, జడేజా, శార్దూల్ ఠాకూర్‌ లు తలో రెండు వికెట్లు తీశారు.

ఈ గెలుపుకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇంగ్లండ్‌ లో ఇంగ్లండ్‌ ను వరసగా రెండు టెస్టుల్లో ఓడించటం చరిత్రలో రెండు సార్లే జరిగింది. మొదటిసారి 1986లో .. కపిల్‌ దేవ్ ఆ ఘనత సాధించారు. అంటే 34 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడే. 1986 ఇంగ్లండ్ టూర్‌లో కపిల్‌ సేన టెస్ట్‌ ఇంగ్లిష్‌ టీమ్‌ ని మట్టి కరిపించింది. ఇప్పుడు కోహ్లీసేన ఐదు టెస్టుల సిరీస్‌ ఆడుతుంది. 1986 సిరీస్‌ లో మూడే టెస్టు మ్యాచ్‌ లు. మొదటి టెస్టులో ఇంగ్లిష్ టీమ్‌ కెప్టెన్‌ డేవిడ్‌ గోవర్‌..కాగా రెండు మూడు టెస్టులకు మైక్‌ గ్యాటింగ్‌ కెప్టెన్సీ చేశారు. ఆనాటి సిరీస్‌ లో ఇంగ్లండ్‌ టీమ్‌ లో గ్రాహం గూచ్‌, అలన్‌ లాంబ్‌, డేవిడ్‌ గోవర్‌, మైక్‌ గ్యాటింగ్‌ వంటి లెజెండ్స్ ఉన్నారు.

అప్పటి టీమ్‌ ఇండియాలో కపిల్‌ దేవ్‌ సునీల్‌ గవాస్కర్‌ , శ్రీకాంత్‌, అజారుద్దీన్‌, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ , మొహిందర్‌ అమరనాథ్‌, రోజర్‌ బిన్నీ రవిశాస్త్రి, మణీందర్‌ సింగ్‌ వంటి హేమాహేమీలున్నారు. లార్డ్స్‌ లో జరిగిన తొలి టెస్ట్‌ లో భారత్‌ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. దిలీప్‌ వెంగ్‌ సర్కార్‌ సెంచరీ చేశాడు. సెకండ్‌ ఇన్నింగ్స్‌ లో ఇంగ్లండ్‌ టాప్‌ ఆర్డర్‌ ని కుప్పకూల్చి విజయంలో కీలక పాత్రపోషించిన కపిల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్ గా నిలిచాడు. కెప్టెన్‌ గా కపిల్‌ కు 21 మ్యాచ్‌ ల తర్వాత దక్కిన విజయం ఇది. ఇక లీడ్స్‌ లో జరిగిన సెకండ్‌ టెస్ట్‌ లో 279 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ , సెకండ్ ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన దిలీప్‌ వెంగసర్కార్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇక మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. మైక్‌ గ్యాటింగ్‌, దిలీప్‌ వెంగసర్కార్‌ జాయింట్‌ గా ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్నారు.

క్రికెట్‌ మక్కా .. లార్డ్స్‌, అలాగే ఓవల్‌ గ్రౌండ్‌లో ఒకే సిరీస్‌లో విజయం సాధించటం ఇదే ఫస్ట్‌. మరో ప్రత్యేకత ఏమిటంటే ఓవల్‌లో టెస్ట్ మ్యాచ్ గెలవటం గత యాబై ఏళ్లలో ఇదే తొలిసారి. 1971 సిరీస్‌లో మొదటిసారి ఓవల్‌ లో గెలవటంతో పాటు సిరీస్‌ కూడా కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు టీమ్‌ ఇండిమా మూడు సందర్భాల్లో మాత్రమే ఇంగ్లండ్‌ లో టెస్ట్ సిరీస్‌ సాధించింది భారత్‌. ఇంగ్లండ్‌లో భారత్‌ 1971, 1986,2007 సిరీస్‌లు గెలిచింది. ఇప్పుడు గెలిస్తే నాలుగవది అవుతుంది. ఓవల్‌ విజయంతో క్యాప్టెన్ గా కోహ్లీ టెస్ట్ రికార్డు మరింత బెటర్ అయింది. 65 టెస్టులకు సారధ్యం వహించి 38 మ్యాచ్‌ లలో గెలిపించాడు. 16 మ్యాచ్ లు ఓడిపోయింది. 11 మ్యాచ్లు డ్రా అయ్యాయి. ఇంగ్లండ్‌లో అత్యధిక మ్యాచ్‌ లు గెలిపించిన కెప్టెన్ గా కూడా కోహ్లీ ఘనత సాధించారు. ఓవల్ విజయం సారధిగా ఇంగ్లండ్‌ లో ఆయనకు మూడవ విజయం. చెప్పుకుంటూ పోతే ఓవల్‌ గెలుపులో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. చివరి టెస్ట్‌ ఈ నెల 10 నుంచి 14 వరకు ఓల్డ్‌ ట్రాఫర్డ్‌ లో జరుగుతుంది. ఈ మ్యాచ్లో గెలిచినా ..డ్రా చేసినా సిరీస్‌ మన సొంతమవుతుంది. ఇంగ్లండ్‌ కు డూ ఆర్‌ డై గా మారిన ఈ టెస్ట్‌ లో టీమిండియాను ఎలా అడ్డుకుంటుందో చూద్దాం..