Begin typing your search above and press return to search.

ఒడిశాలో దారుణం: ఇంట్లో స్థ‌లం లేక మ‌రుగుదొడ్డిలో క్వారంటైన్‌

By:  Tupaki Desk   |   19 Jun 2020 3:15 AM GMT
ఒడిశాలో దారుణం: ఇంట్లో స్థ‌లం లేక మ‌రుగుదొడ్డిలో క్వారంటైన్‌
X
అస‌లై పేద‌రికం.. ఆపై మ‌హ‌మ్మారి వైర‌స్ వ్యాప్తితో క‌ష్టాలు.. వీటితో పొట్ట చేత ప‌ట్టుకుని వ‌ల‌స వెళ్ల‌గా ప‌ని లేక ఇంటికొస్తే క్వారంటైన్ విధించారు. ఉన్న చిన్న‌పాటి ఇంట్లో కుటుంబ‌స‌భ్యులు ఉండ‌లేని ప‌రిస్థితి అలాంటిది క్వారంటైన్‌లో ఉండేందుకు ఏకంగా గ‌దిలో ఉండ‌లేని ప‌రిస్థితి. దీంతో ఆ వ్య‌క్తి ప‌బ్లిక్ మ‌రుగుదొడ్డిలో క్వారంటైన్ ఉండాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. ఈ ఘ‌ట‌న ఒడిశా రాష్ట్రం జ‌గ‌త్‌సింగ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ దారుణ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇవి..

ఒడిశాలోని జగత్ సింగ్ పూర్ జిల్లా జతగావ్ గ్రామానికి చెందిన 28 ఏళ్ల యువ‌కుడు మానస్ పత్రా ఉపాధి కోసం తమిళనాడుకు వెళ్లాడు. అక్కడే చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఉపాధి కోల్పోయాడు. దీంతో త‌మిళ‌నాడు నుంచి స్వ‌స్థ‌లం బ‌య‌ల్దేరి వ‌చ్చాడు. ఒడిశాలోకి రాగానే అధికారులు అత‌డికి ప‌రీక్ష‌లు చేయించి అనంత‌రం వారం రోజుల పాటు క్వారంటైన్ ఉండాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా సుదుకాంతి పాఠశాలలో ప్రభుత్వం నేతృత్వంలో ఉన్న క్వారంటైన్ కేంద్రం‌లో ఉండాలని చెప్ప‌డంతో అత‌డిని ఆ పాఠ‌శాల‌లో కొన్నాళ్లు ఉంచారు. అతడిలో వైర‌స్ లక్షణాలేమీ కనిపించకపోవడంతో ఏడు రోజులకే డిశ్చార్జ్ చేశారు.

ఆ తర్వాత స్వ‌గ్రామం చేరుకోగా అధికారులు అత‌డిని ఆపి మ‌ళ్లీ హోమ్ క్వారంటైన్‌లో ఉండాల‌ని ఆదేశించారు. వారం రోజులపాటు ఈసారి ఇంట్లోనే ఉండాల‌ని సూచించారు. ఇప్ప‌టివ‌ర‌కు బాగానే ఉన్నా అత‌డి కుటుంబం చాలా పేద‌రికంలో ఉంది. ఉన్న చిన్న‌పాటి ఇంట్లోనే ‌ఆరుగురు కుటుంబసభ్యులు ఉంటున్నారు. ఇప్పుడు క్వారంటైన్ ఉండాల్సిన ప‌రిస్థితి లేదు. ఒక‌వేళ ఉంటే త‌న కుటుంబ‌స‌భ్యులు ఇబ్బంది ప‌డ‌తార‌ని అధికారుల‌కు మాన‌స్ చెప్పాడు. పాఠ‌శాల‌లో ఏర్పాటుచేసిన క్వారంటైన్ కేంద్రం‌లో తాను ఉండ‌డానికి అవ‌కాశం ఇవ్వాల‌ని కోరాడు. అయితే అధికారులు కుద‌ర‌ద‌ని.. నిబంధ‌న‌లు అంగీక‌రించ‌వ‌ని అధికారులు తేల్చిచెప్పారు. దీంతో అత‌డు గంద‌ర‌గోళంలో ప‌డ్డాడు. చివ‌ర‌కు అక్క‌డ క‌నిపించిన మ‌రుగుదొడ్డిలో క్వారంటైన్ ఉండేందుకు నిర్ణ‌యించుకున్నాడు.

ఆ విధంగా జూన్ 9 నుంచి 15వ తేదీ వరకు అత‌డు ఆ మ‌రుగుదొడ్డిలోనే క్వారంటైన్ ఉన్నాడు. మానస్ పత్రా విష‌యం తెలియ‌డంతో ఒక్క‌సారిగా గ్రామ‌స్తులు, అధికారులు షాక్‌కు గుర‌య్యారు. అంత‌టి క‌ష్ట‌మొచ్చింది.. అని స్థానికులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.