Begin typing your search above and press return to search.

మహిళలపై పెరిగిపోతున్న అరాచాలు .. రాష్ట్రాలకి కేంద్రం మార్గదర్శకాలు

By:  Tupaki Desk   |   10 Oct 2020 5:30 PM GMT
మహిళలపై పెరిగిపోతున్న అరాచాలు  .. రాష్ట్రాలకి కేంద్రం  మార్గదర్శకాలు
X
మహిళలపై జరిగే నేరాల్లో పోలీసులు అనుసరించాల్సిన విధివిధానాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకి కీలక ఆదేశాలు జారీచేసింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని హాథ్‌రస్‌లో 19ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం, హత్య కేసులో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారని వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజా మార్గదర్శకాలు విడుదలయ్యాయి. హాథ్‌రస్ కేసు విషయంలో పోలీసులతోపాటు రాష్ట్ర ప్రభుత్వంపైనా విమర్శలు వచ్చాయి.దీంతో మహిళల భద్రత, వారిపై జరిగే నేరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవడం లేదని కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని శనివారం కేంద్రం సవివర విధివిధానాలను విడుదల చేసింది. మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి చర్యలు తీసుకోని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని దీనిలో సూచించింది.

నేరస్థుల్ని అరెస్టు చేసే తీవ్రత గల నేరాల విషయంలో పోలీసులు వెంటనే ప్రాథమిక విచారణ నివేదికను నమోదు చేయాలి. తమ పోలీస్ స్టేషన్‌కు వెలుపల ఘటన జరిగితే జీరో ఎఫ్ ‌ఐఆర్ ‌ను నమోదు చేయాలి.ఐపీసీలోని సెక్షన్ 166 ప్రకారం నేరస్థుల్ని అరెస్టు చేసే తీవ్రత గల నేరాల విషయంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో విఫలమైన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలి. సీఆర్ ‌పీసీలోని సెక్షన్ 173 ప్రకారం.. అత్యాచార కేసుల విచారణను రెండు నెలల్లో పూర్తిచేయాలి. ఈ కేసుల విచారణను ట్రాక్ చేయడానికి కేంద్ర హోం శాఖ ఆన్ ‌లైన్ పోర్టల్‌ను కూడా తీసుకొచ్చింది. లైంగిక దాడి కేసుల్లో బాధితులకు 24 గంటల్లోనే వైద్యుల సాయంతో పరీక్షలు నిర్వహించాలి.

మృతులు చనిపోవడానికి ముందు ఇచ్చిన లిఖితపూర్వక లేదా మౌకిక వాంగ్మూలాన్ని సాక్ష్యంగా పరిగణించాలి. లైంగిక దాడుల విషయంలో ఫొరెన్సిక్ ఆధారాల సేకరణపై కేంద్ర హోం శాఖ ఇదివరకే స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. కఠినమైన నిబంధనలు ఉన్నప్పటికీ.. చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమైతే దేశ నేర న్యాయ వ్యవస్థ ప్రభావితం అవుతుంది. ఇలాంటి ఘటనలకు బాధ్యులపై విచారణ చేపట్టి, తగిన చర్యలు తక్షణమే తీసుకోవాలి. హాథ్‌రస్ కేసులో ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల నిర్లక్ష్యంపై రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆగ్రహంతో ఉంది. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారంటూ యోగి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మహిళల రక్షణ పట్ల తాము నిబద్ధతతో ఉన్నామని చెప్పడానికే తాజా విధివిధానాలను కేంద్రం విడుదల చేసినట్లు తెలుస్తోంది.