Begin typing your search above and press return to search.

డిగ్గీ వచ్చిన కంట్రోల్ కాలే.. తెలంగాణ కాంగ్రెసోళ్లు ఇక మారరు

By:  Tupaki Desk   |   24 Dec 2022 6:47 AM GMT
డిగ్గీ వచ్చిన కంట్రోల్ కాలే.. తెలంగాణ కాంగ్రెసోళ్లు ఇక మారరు
X
తెలంగాణ కాంగ్రెస్లో ఏర్పడిన పంచాయితీ ఇప్పట్లో తెగేట్లు లేదు. సీనియర్లు, జూనియర్ల మధ్య ఏర్పడిన వివాదం అధిష్టానానికి చేరడంతో.. ఢిల్లీ నుంచి ట్రబుల్ షూటర్ దిగ్విజయ్ సింగ్ తెలంగాణలో దిగారు. ఇరు వర్గాలతో విడివిడిగా సమావేశం నిర్వహించారు. వారి వాదనలను ఓపిగ్గా విన్నారు. ఆ తరువాత వారిని సున్నితంగా హెచ్చరించి.. ఇలా విడిపోతే పార్టీకి తీవ్ర నష్టమని, కలిసి పనిచేయాలని సూచనలను చేశారు. కొందరు సీనియర్ నాయకులు పార్టీ రాష్ట్ర చీఫ్ ను మార్చాలని పట్టుబట్టారు. కానీ ఆ విషయం తన పరిధిలో లేదని పరోక్షంగా వారికి సమాధానం ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా కేవలం సూచనలు, సలహాలతోనే దిగ్విజయ్ పర్యటన సాగిందని, సమస్య ఇంకా పరిష్కారం కాలేదని తెలుస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి ట్రబుల్ షూటర్ 2 తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇంతకీ వారెవరు..?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర కాంగ్రెస్ కు గడ్డుకాలం ఏర్పడింది. అప్పటి నుంచి టీ కప్పులో తుఫానులాగా నిత్యం ఏదో అసంతృప్తి కొనసాగింది. అయితే పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించాక ఈ అసంతృప్తి మరింత తీవ్రమైంది. కొందరు పార్టీ సీనియర్లు రేవంత్ నియామకంపై బహిరంగంగానే విమర్శించారు. ఆ తరువాత రేవంత్ రెడ్డి స్వయంగా సీనియర్లను కలిసి వారి అలక తీర్చారు. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో పార్టీ మూడో స్థానానికి పడిపోవడంతో మరోసారి అసంతృప్త జ్వాలలు రేగాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి బలహీన పరుస్తున్నారని పొన్నం ప్రభాకర్, వెంటకరెడ్డి లాంటి వాళ్లు ఆరోపణలు చేశారు.

నల్గొండలోని మునుగోడు కాంగ్రెస్ సీటును కోల్పోవడంతో పార్టీ వివాదాలు రచ్చకెక్కాయి. దీంతో ఇటీవల నిర్వహించిన సమావేశానికి కొందరు సీనియర్లు డుమ్మాకొట్టారు. ఇక్కడికి వచ్చిన వారిలో కొందరు రేవంత్ వర్గాన్ని వలసవాదులు అని ప్రస్తావించారు. దీంతో రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్న వారు పార్టీ కమిటీకి రాజీనామా చేశారు. ఇలా సీనియర్లు, రేవంత్ వర్గం రెండుగా విడిపోవడంతో ఈ విషయం అధిష్టానానికి చేరింది.

తెలంగాణలో పార్టీ సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ అధిష్టానం ట్రబుల్ షూటర్ గా పేరున్న దిగ్విజయ్ సింగ్ ను పంపించింది. అయితే ట్రబుల్ షూటర్ కే ట్రబుల్ తెచ్చేలా ఇక్కడి నాయకులు ప్రవర్తించారు. దిగ్విజయ్ చెప్పిన మాటలను ఇరు వర్గాలు పట్టించుకోకపోవడంతో ఆయన చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. అందుకే పెద్దన్న సలహాగా కలిసి ఉండాలని, విడిగా ఉంటే పార్టీకి, మీకు కూడా నష్టమని చెప్పి వెళ్లారు.

దీంతో ఈ సమస్య ఇంకా పరిష్కారం కానట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ట్రబుల్ షూటర్ 2ను పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ ట్రబుల్ షూటర్ 2 ప్రియాంక గాంధీ అని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అయితే అప్పటికైనా టీ కాంగ్రెస్ లో వివాదం ముగుస్తుందా..? లేక ఇంకా కొనసాగుతుందా..? అనేది చూడాలి. అయితే సాధ్యమైనంత వరకు ఈ సమస్యల పరిష్కరించాలని కొందరు పార్టీ నేతలు కోరుతున్నారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి మరింత అధ్వానంగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.