Begin typing your search above and press return to search.

దీనగాథ: కూలీవాళ్లుగా ఆర్టీసీ కార్మికులు

By:  Tupaki Desk   |   13 Nov 2019 1:46 PM GMT
దీనగాథ: కూలీవాళ్లుగా ఆర్టీసీ కార్మికులు
X
తెలంగాణ ఆర్టీసీ సమ్మె మొదలై నేటికి 40వ రోజు.. అప్పటికే సమ్మెకు దిగడంతో పనిచేసిన సెప్టెంబరు మాసం జీతాలు అక్టోబర్ 1న పడలేదు. ఇక అక్టోబర్ నెల మొత్తం సమ్మెలో ఉండడంతో నవంబర్ నెల 1వ తేదీన కూడా కార్మికులకు జీతాలు అందలేదు. మొత్తం రెండు నెలల జీతాలు ఆర్టీసీ కార్మికులకు రాలేదు. దీంతో ఇల్లు గడవక.. పూటకు లేక చాలా మంది సమ్మె ఉద్యమాన్ని ఇంకేన్నాళ్లు చేస్తామంటూ పొట్టూకూటీ కోసం ఇప్పుడు కూలీనాలీ చేసుకుంటున్న దీనస్థితి ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తోంది.

హైకోర్టు ఆదేశిస్తున్నా సీఎం కేసీఆర్ మొండి పట్టు వీడడం లేదు. హైకోర్టు ఆదేశాలను సైతం బేఖారతు చేస్తున్నారు. కార్మికులకు కేసీఆర్ డెడ్ లైన్ ఇచ్చినా చేరకపోవడంతో ఇక ఆర్టీసీ సమ్మెను పట్టించుకోవడం లేదు. దీంతో ఆర్టీసీ కార్మికులంతా పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తాజాగా హైకోర్టు కూడా చేతులెత్తేసింది. ఆర్టీసీ సమ్మెపై ముగ్గురు సుప్రీం మాజీ జడ్జీలతో ప్రభుత్వంతో చర్చించడానికి కమిటీ వేస్తామని ప్రకటన చేసింది. దీంతో ఈ చర్చలు ఎప్పుడు జరుగుతాయి..? కేసీఆర్ వింటారా? అసలు ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం దొరుకుతుందా లేదా అన్న ఆందోళన కార్మికుల్లో నెలకొంది. ఇక సమ్మె పరిష్కారం కాదు అని డిసైడ్ అయిన ఆర్టీసీ కార్మికులు ప్రత్యామ్మాయ పనులు చేసుకుంటున్న పరిస్థితి దయనీయంగా ఉంది.

రెండు నెలలుగా జీతాలు లేకపోవడంతో ఆర్టీసీ కార్మికులకు తినడానికి తిండి కూడా లేని పరిస్థితి కనిపిస్తోంది. పిల్లల స్కూలు ఫీజులు, ఇంట్లో గడవలేక పస్తులు ఉండలేక నిర్మల్ జిల్లాలో ఓ కండక్టర్ తన కులవృత్తి అయిన క్షవరం చేస్తున్నాడు. ఇక మరో ఆర్టీసీ డ్రైవర్ కరీంనగర్ జిల్లాలో పత్తిని ఏరేందుకు వ్యవసాయ కూలీగా మారిపోయాడు. మరికొందరు ఇల్లు గడిచేందుకు వివిధ పనులు చేస్తూ కూలీనాలీ చేసుకుంటున్నారు.

ఇలా కేసీఆర్ పట్టు.. కార్మిక సంఘాల మొండిపట్టుతో పాపం కార్మికులు బలైపోతున్నారు. కార్మిక కుటుంబాలు పస్తులు ఉండలేక ఇప్పుడు ప్రత్యామ్మాయ పనులు చేయాల్సిన పరిస్థితి దాపురించింది.