Begin typing your search above and press return to search.

నెల రోజుల్లో ‘విరాట్’ వీడ్కోలు

By:  Tupaki Desk   |   9 Feb 2017 9:35 AM GMT
నెల రోజుల్లో ‘విరాట్’ వీడ్కోలు
X
విరాట్ వీడ్కోలు అనగానే షాక్ అయ్యారా.. ఈ విరాట్ మన క్రికెటర్ విరాట్ కాదు. అంతకంటే చాలా సీనియర్. దేశానికి 27 ఏళ్ల పాటు సేవలందించిన ఘనత ఈ విరాట్ సొంతం. భారత నౌకాదళంలో లెజెండ్. తిరుగులేని యుద్ధనౌక.

ఇండియన్ నేవీలో 27 ఏళ్లపాటు సేవలందించిన ఐఎన్‌ ఎస్ విరాట్ యుద్ధ నౌక మార్చి 6న విధుల నుంచి ఉపసంహరణ కానుంది. రాయల్ నేవీలో అద్భుతమైన సేవలందించిన విరాట్, ఆ తరువాత ఇండియన్ నేవీలో చేరింది. భారత నౌకాదళంలో అత్యంత ప్రతిభా పాటవాలను ప్రదర్శించిన విరాట్ కొద్ది నెలల కిందట తన సేవలను ముగించింది. ఈ నౌకలోని కీలక యంత్ర పరికరాలను తొలిగించి డికమిషనింగ్‌ కు సిద్ధం చేశారు. ప్రస్తుతం ముంబై పోర్టులో విరాట్ ఉంది. ఈ యుద్ధ నౌక మార్చి ఆరవ తేదీ నుంచి పూర్తిగా భారత నౌకాదళం నుంచి వైదొలగనుంది.

కాగా నౌకాదళం నుంచి వైదొలిగిన తరువాత ఈ నౌకను ఏవిధంగా వినియోగించాలన్న అంశంపై ఏర్పడిన సందిగ్థత ఇంకా తొలగలేదు. భారత ప్రభుత్వం వద్ద ప్రస్తుతానికి రెండు ప్రతిపాదనలు ఉన్నాయి. విరాట్ నౌకను విశాఖకు తీసుకువచ్చి దాన్ని ఫ్లోటింగ్ హోటల్‌ గా మార్చాలన్న ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. ఇప్పటికే కురుసుర జలాంతర్గామిని విశాఖ ఆర్‌ కె బీచ్‌ లో ఏర్పాటు చేశారు. వుడా పర్యవేక్షణలో దీన్ని మ్యూజియంగా చేసి, ప్రజల సందర్శనార్థం ఉంచారు. అదే మాదిరి విరాట్‌ ను కూడా విశాఖకు తీసుకువచ్చి ఫ్లోటింగ్ హోటల్‌ గా దీన్ని తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఇందుకోసం వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఇంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించే పరిస్థితిలో లేదు. ఇందులో కొంత మొత్తాన్ని భరించాలని కేంద్రాన్ని కోరింది. కేంద్రం కొంత నిధులిచ్చినా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌ షిప్ విధానంలో దీన్ని ఫ్లోటింగ్ హోటల్‌ గా మార్చి, ప్రజలకు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆరవ తేదీలోగానే ఏ నిర్ణయమూ తీసుకోవలసి ఉంటుంది.

విరాట్ మొట్ట మొదట రాయల్ నేవీలో పనిచేసింది. స్కాట్లాండ్ వార్‌ లో ఈ నౌక అత్యంత ప్రతిభ కనబరచింది. అందువలన ఈ నౌకను లండన్ ప్రజలకు అందుబాటులో ఉంచడం న్యాయమని ఆ దేశం భావిస్తోంది. విరాట్‌ లో పనిచేసిన కొంతమంది నౌకాదళ అధికారులంతా కలిసి, దీన్ని లండన్‌ కు తీసుకువెళ్లాలన్న ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. చారిత్రాత్మక నౌకను భారత ప్రభుత్వం వదులుకుంటుందా? లేక ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక సహాయం చేస్తూ విశాఖకే మంజూరు చేస్తుందా? అన్నది ఆరో తేదీలోగా నిర్ణయించుకోవలసి ఉంటుంది.

గతంలో భారత నౌకాదళంలో పనిచేసిన విక్రాంత్ యుద్ధ డికమిషనింగ్ తరువాత దాన్ని ముంబైలోనే ఫ్లోటింగ్ హోటల్‌ గా ఉంచారు. అయితే, దాని నిర్వహణ, దానిపై వచ్చే ఆదాయానికి పూర్తిగా వ్యత్యాసం ఉండడంతో దాన్ని స్క్రాప్‌ కు ఇచ్చేశారు. బజాజ్ సంస్థ దాన్ని కొనుగోలు దాంతో మోటార్ సైకిళ్లు తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ముంబైలోనే ఫ్లోటింగ్ హోటల్ నిర్వహణ సాధ్యం కానప్పుడు, విశాఖలో ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్న ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వెంటాడుతోంది.

విరాట్‌ ను విశాఖకు తీసుకువచ్చి ఫ్లోటింగ్ హోటల్‌ గా ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇందుకోసం నాలుగు స్థలాలను పర్యాటక శాఖ అధికారులు పరిశీలించారు. బీచ్ రోడ్‌లోని లాసన్స్‌బే కాలనీ - కాపులుప్పాడ - భీమిలి - వుడా ఎంజిఎం పార్క్ స్థలాలను పరిశీలించారు. కేవలం ఈ నౌక ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం సాధ్యం కాదు కాబట్టి, దీన్ని ఆనుకుని ఒక టౌన్‌ షిప్‌ ను నిర్మించాలని వుడా అధికారులు ప్రతిపాదిస్తున్నారు. ఎక్కడైతే విరాట్ ఫ్లోటింగ్ హోటల్‌ ను ఏర్పాటు చేస్తారో, దాని పరిసరాల్లోని 200 - 300 ఎకరాల భూమిని సేకరించి అక్కడ టౌన్‌ షిప్ నిర్మించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై ఒక వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/